Karthika Deepam 2 March 31st: పారిజాతం దెబ్బకి కాంచన షాక్... దీప హత్యకు జ్యోత్స్న స్కెచ్
Photo Courtesy: JioHotstar
రిపోర్ట్స్ ద్వారా దీపే సుమిత్ర కూతురని తెలుసుకున్న జ్యోత్స్న ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతుంది. ఎవరో నిన్ను కలవడానికి వచ్చారు కదా? ఆ వ్యక్తి ఎవరని పారిజాతం అడగ్గా.. జ్యోత్స్న ఏదో కవర్ చేస్తుంది. ఇంతలో పారిజాతానికి దాస్ ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మని చెబుతాడు. దీప ఎవరన్న సంగతి బావ, దీప, దాస్లకు తెలిసిపోయింది.. డాడీకి తెలుసా లేదా అన్న దాని గురించి ఆలోచిస్తుంది జ్యోత్స్న. తనను కలవడానికి వచ్చిన పారిజాతానికి దాస్ మంచినీళ్లు ఇవ్వబోతుండగా ఆమె వద్దని చెబుతుంది. అప్పుడు కూడా ఇలాగే ఇచ్చి నన్ను మత్తులో ముంచేశారు.. ఈసారి మీ ట్రాప్లో పడనని అంటుంది పారిజాతం.
ఇంత రాత్రివేళ ఎందుకు రమ్మన్నావని పారిజాతం అడగ్గా.. నీ మనవరాలు ఎవరో? ఎక్కడుందో తెలిసిపోయిందని చెబుతాడు దాస్. కార్తీక్ భార్య దీపే నీ మనవరాలని చెప్పడంతో పారు షాక్ అవుతుంది. నా భార్య కళ్యాణి, నువ్వు శివన్నారాయణ ఇంట్లో పనిమనిషులు.. ఇప్పుడు దీప కూడా పనిమనిషే.. మన వంశానికి కరెక్ట్గా సెట్ అయ్యిందని దాస్ చెప్పడంతో పారు నిజమేనని నమ్ముతుంది. వెంటనే నా మనవరాలిని చూడాలని కార్తీక్ ఇంటికి పరిగెత్తుతుంది. భోజనం చేస్తుండగా జ్యోత్స్న ఏదో ఆలోచిస్తుండగా ఏం జరిగిందని అడుగుతాడు దశరథ. నీతో మాట్లాడాలని అంటుంది జ్యోత్స్న. ఉదయం జరిగిన గొడవ గురించి అయితే ఇక్కడే మాట్లాడమని సుమిత్ర మండిపడుతుంది. అర్థరాత్రి కాంచన ఇంటి తలుపు కొడుతుంది పారు. కార్తీక్ తలుపు చూసేసరికి పారు ఉండటంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా జరిగింది. మరి మార్చి 31వ తేదీ 632వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
అర్ధరాత్రి ఇంటికొచ్చిన పారిజాతం.. దీపని చూడగానే మనవరాలా అంటూ హత్తుకోవడంతో కార్తీక్, దీప, కాంచన, అనసూయలు షాక్ అవుతారు. పొద్దున్నే తిట్టి ఇప్పుడు ఇంత ప్రేమ చూపిస్తున్నావని కార్తీక్ ప్రశ్నిస్తాడు. ఉదయం నేను తప్పు చేసినట్లు అనిపించి, అద్దం ముందు నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడు వెంటనే దీపకి సారీ చెబుదామని పరిగెత్తుకుంటూ వచ్చానని చెబుతుంది పారిజాతం. ఇంతలో శౌర్య రావడంతో పాపని కూడా హత్తుకుంటుంది పారు. కుబేర ఫోటో చూసి ఆయన చాలా గొప్పవాడు అంటూ ఎమోషనల్ అవుతుంది. కుబేర గారు నువ్వు అనుకున్నంత గొప్పోడు కాదులే.. ఓ చిన్న కాకహోటల్ నడుపుకునేవాడు అంటాడు కార్తీక్.
ఎక్కడో బస్టాండ్లో దొరికిన పాపని తన కన్నకూతురిలా పెంచాడంటే ఆయనది ఎలాంటి గుండెరా అంటుంది పారిజాతం. నీకేమైంది బాగానే ఉన్నావా అని కాంచన అడగ్గా.. నువ్వు నా కూతురివి, కార్తీక్ నా మనవడు, దీప నా మనవరాలు, శౌర్య నా మునిమనవరాలు.. అనసూయ దీపకి మేనత్త అంటే నాకు కూతురు అంటుంది పారు. నువ్వు ఇక్కడే ఉంటే తాతకి ఫోన్ చేస్తానని కార్తీక్ బెదిరించడంతో పారు కంగారు పడుతుంది. రేపు మా ఇంటికి వచ్చినప్పుడు తనివితీరా మాట్లాడుకుందామని దీపతో చెప్పి వెళ్లిపోతుంది పారు. ఆవిడకి ఏమైంది? నన్ను మనవరాలు అంటుందని దీప ప్రశ్నించడంతో.. పొద్దున్న నిన్ను, నన్ను తిట్టింది కదా? అందుకే చిన్న షాక్ ఇచ్చాను. దాస్ మావయ్య ద్వారా దీపే నీ మనవరాలని పారుకి చెప్పించానని కార్తీక్ చెబుతాడు. పాపం కదా బావ అని దీప అనగా.. పాపాలు చేసేవాళ్లని పాపం అనడం మహాపాపం అంటాడు.
భోజనాలు చేసిన తర్వాత శివన్నారాయణ, దశరథ, సుమిత్రలతో మాట్లాడుతుంది జ్యోత్స్న. మాతో ఏం మాట్లాడాలని అనుకున్నావు అని శివన్నారాయణ అడగ్గా.. ఉదయం గొడవ జరిగింది కదా దానిని అందరిలో సరిదిద్దుకుంటానని చెబుతుంది జ్యోత్స్న. మమ్మీ ఆపరేషన్ బాగా జరిగింది కాబట్టి ఇంట్లో మన చుట్టాలు, ఫ్రెండ్స్కి పార్టీ ఏర్పాటు చేయమని చెబుతుంది. అక్కడ నీకొక సర్ప్రైజ్ ఇస్తానని సుమిత్రతో చెబుతుంది జ్యోత్స్న. ఆ సర్ప్రైజ్ ఏంటని సుమిత్ర అడగ్గా.. నీ కూతురి చావు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నువ్వు చాలా మంచిదానివి కానీ అప్పుడప్పుడు తేడాగా బిహేవ్ చేస్తావని మండిపడతాడు శివన్నారాయణ. జ్యోత్స్నలో మార్పు మొదలైంది.. వీలునామా మార్చి రాయించడం మంచిదైందని అనుకుంటాడు దశరథ.
అర్ధరాత్రి కావొస్తున్నా పారిజాతం ఇంటికి రాకపోవడంతో జ్యోత్స్న, శివన్నారాయణలు ఎదురుచూస్తారు. ఇంతలో డ్యాన్స్ చేసుకుంటూ సంతోషంగా వచ్చిన పారుని చూసి శివన్నారాయణ షాక్ అవుతాడు. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లావు? నీ ముఖంలో ఈ వెర్రీ ఆనందం ఏంటీ? అని శివన్నారాయణ అడగ్గా.. వాకింగ్కి వెళ్లానని అబద్ధం చెబుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యమని మీరు చెప్పారు కదా? మీ మాటే వేదవాక్కు దానిని నేను దాటనని అంటుంది. ఇంతలో దీపని పారిజాతం హత్తుకుంటున్న వీడియోని శివన్నారాయణ చూపించడంతో షాక్ అవుతుంది. ఈ వీడియోని కార్తీక్ గాడు పంపించాడు.. కాసేపట్లో వస్తాడని చెప్పడంతో కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు.
నువ్వు కాంచన అత్త ఇంటికి ఎందుకు వెళ్లావని జ్యోత్స్న అడగటంతో.. నేను అడగాల్సిన ప్రశ్నను తను అడిగింది.. సమాధానం చెప్పమని అంటాడు శివన్నారాయణ. ఉదయం నువ్వు నానామాటలతో అందరినీ బాధపెట్టావు కదా అందుకే ఓదారుద్దామని వెళ్లానని అంటుంది పారు. అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్లావని గుచ్చిగుచ్చి అడుగుతాడు శివన్నారాయణ. నువ్వు ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చావని కార్తీక్ని అడుగుతుంది జ్యోత్స్న. పారు ఇంత రాత్రివేళ మా ఇంటికి వచ్చిందంటే ఏం జరుగుతుందో చూద్దామని వచ్చానని అంటాడు కార్తీక్. నువ్వు వచ్చి మంచి పనిచేశావు.. రేపు మా ఇంట్లో గెట్ టూ గెదర్ పార్టీ ఉంది. మీ ఫ్యామిలీ అంతా రావాలని ఆహ్వానిస్తుంది జ్యోత్స్న.
ఇప్పుడు ఎందుకు పార్టీ? అని కార్తీక్ అడగ్గా.. మమ్మీ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగిందని అందుకే పార్టీ ఇస్తున్నానని అంటుంది జ్యోత్స్న. ఖచ్చితంగా దీపని కూడా తీసుకురావాలని జ్యోత్స్న చెప్పగా... తను ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకుంటుందని కార్తీక్ అంటాడు. దీప రావాల్సిందే, ఆమె నా స్పెషల్ గెస్ట్, దీప రాకపోతే పార్టీ ఆగిపోతుందని జ్యోత్స్నన చెప్పడంతో కార్తీక్కి అనుమానం వస్తుంది. నిన్ను చూస్తుంటే దీప లేకుండానే వచ్చేలా ఉన్నావు.. ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది జ్యోత్స్న.
అసలు దీప దగ్గరికి ఎందుకు వెళ్లావని నిలదీస్తుంది పారిజాతం. నా మనవరాలు అని చెప్పబోతూ ఆగిపోతుంది పారు. నా ఇష్టమని చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అందరూ నన్ను భయపెట్టేవాళ్లే.. కానీ ఇప్పుడు ఆ రోజులు మారాయి. నా ఆశలు ఫలించాయి, పారిజాతానికి మంచి రోజులు వచ్చాయని పొంగిపోతుంది. నాకు చెప్పకుండా దీప దగ్గరికి వెళ్లొద్దని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న . నా ఇష్టం వచ్చినట్లు, ఎన్నిసార్లయినా వెళ్తాను. నాకు కావాల్సిన వాళ్ల కోసం వెళ్తానని తేల్చేస్తుంది పారిజాతం. గ్రానీకి ఏం జరిగింది? ఎందుకిలా వాగుతుందని జ్యోత్స్న కంగారుపడుతుంది. ఏం జరిగినా సరే.. రేపు దీప పార్టీకి రావాలి, పార్టీ పెట్టిందే నీ కోసమని అనుకుంటుంది జ్యోత్స్న.
ఇంట్లో గెట్ టూ గెదర్ పార్టీ ఏర్పాటు చేయడం ఏంటి? ఈసారి ఏం గొడవ చేస్తుందోనని కంగారుపడుతుంది కాంచన. ఏ ముఖం పెపట్టుకుని రావాలి.. అన్నింటికీ గొడవలే, ప్రతిదానికి మాట పడాల్సి వస్తోందని అంటుంది కాంచన. మీ నాన్న గారు పిలిచాక వెళ్లకపోతే బాగుండదని కాంచనకు నచ్చజెబుతుంది అనసూయ. జ్యోత్స్న వల్ల అందరితో మాట పడాల్సి వస్తోందని అంటుంది. వీలునామా గురించి మళ్లీ ఏదో పంచాయతీ పెట్టడానికే జ్యోత్స్న ఇలా చేస్తోందని అనసూయ చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











