మా నాన్న కోరిక తీర్చలేకపోయా.. కార్తీక దీపం డాక్టర్ బాబు ఎమోషనల్
నిరుపమ్ పరిటాల.. ఈ పేరు చెబితే అంత తొందర ఎవరూ గుర్తుపట్టారు. అదే 'డాక్టర్ బాబు' అంటే.. ఇట్టే గుర్తుపడుతారు. అంతలా ఈయన్ని పాపులర్ చేసింది 'కార్తీక దీపం' సీరియల్ తో ఆయన సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంటింటికీ డాక్టర్ బాబుగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సహజ నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఆయన తండ్రి ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు దివంగత ఓంకార్. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిరుపమ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన డాక్టర్ బాబు తన తండ్రి ఓంకార్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్.. ''మీ నాన్నగారు నటించిన చాలా సీరియల్స్లో దామోదరం అనే పేరు కనిపించేది. దానికి కారణం ఏంటి?'' అని ప్రశ్నించగా నిరుపమ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ''మొదట 'ఇది కథ కాదు' అనే సీరియల్లో దామోదరం అనే పాత్ర చేశారు. నిజానికి దామోదరం అంటే మా తాతగారి పేరు. ఆ పేరుతో ఆయనకు ఒక ప్రత్యేక అనుబంధం ఉండేది. అందుకే తర్వాత కూడా చాలాసార్లు అదే పేరును తన పాత్రలకు ఉపయోగించేవారు'' అని తెలిపారు.

అలాగే ఓంకార్ నటన గురించి మాట్లాడుతూ.. ''నాన్నగారి డైలాగ్ డెలివరీ చాలా ప్రత్యేకంగా ఉండేది. చాలామంది ఆయనను చూసి రావుగోపాల్ రావు గారి స్టైల్ గుర్తొస్తుందని చెప్పేవారు. కానీ ఆయన ఎవరినీ అనుకరించలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరు, విలనిజాన్ని చూపించే విధానం పూర్తిగా ఆయనదే. కొంచెం నెమ్మదిగా, తాపీగా మాట్లాడే స్టైల్ వల్ల ఆయన పాత్రలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది'' అని చెప్పారు.
తండ్రి మరణం తర్వాత తన జీవితంలో జరిగిన పరిణామాలను కూడా నిరుపమ్ గుర్తు చేసుకున్నారు. ''ఒక మనిషి చనిపోతే కొద్ది రోజుల పాటు మాత్రమే అందరూ గుర్తు పెట్టుకుంటారు. తర్వాత ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయిపోతారు. కానీ మా నాన్నగారి విషయంలో అలా జరగలేదు. ఆయనతో కలిసి పనిచేసిన చాలామంది నన్ను ప్రోత్సహించారు. 'నువ్వు కూడా నటించగలవు, ప్రయత్నించు' అంటూ ధైర్యం చెప్పారు'' అని తెలిపారు. ముఖ్యంగా అశోక్ రావు, రాజేష్ వాసిరెడ్డి వంటి వ్యక్తులు తన కెరీర్ ప్రారంభంలో ఎంతో సహాయం చేశారని చెప్పారు. ''నా మొదటి పోర్ట్ఫోలియో తయారు చేసి ఇండస్ట్రీలోని వాళ్లకు పంపించింది వాళ్లే. ఈటీవీలో పనిచేసిన పరిచయాలతో ఉషాకిరణ్ మూవీస్ వరకు నా ఫోటోలు చేరేలా చేశారు. నేను నటుడిగా నిలబడటానికి వాళ్ల ప్రోత్సాహం చాలా ఉపయోగపడింది'' అని వెల్లడించారు.
ఇక తండ్రితో ఉన్న మధుర జ్ఞాపకాల గురించి అడగగా నిరుపమ్ మరింత ఎమోషనల్ అయ్యారు. ''నాన్నగారంటే నాకు చాలా గౌరవం. అదే సమయంలో కొంచెం భయం కూడా ఉండేది. ఆయన ముందు వెళ్లి మాట్లాడాలంటే ఒక బెరుకు ఉండేది. ఎందుకంటే చిన్నతనం నుంచే ఆయనను ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా చూశాను'' అని అన్నారు. తన చిన్ననాటి పరిస్థితులను వివరిస్తూ.. ''మా అమ్మ గుడివాడలో లెక్చరర్గా పనిచేసేది. కొంతకాలం ఉద్యోగానికి సెలవు తీసుకుని చెన్నైకి వెళ్లాం. నేను ఏడో తరగతి వరకు అక్కడే చదివాను. తర్వాత అమ్మ ఉద్యోగం కారణంగా మళ్లీ గుడివాడకు రావాల్సి వచ్చింది. నేను అమ్మతో వచ్చేశాను. నాన్న మాత్రం చెన్నైలోనే ఉండిపోయారు. అలా మా ఇద్దరి మధ్య కొంత దూరం ఏర్పడింది'' అని తెలిపారు.
ఇంజినీరింగ్ చదివే సమయంలో మళ్లీ తండ్రి దగ్గరకు వెళ్లినట్లు చెప్పారు. 'ఆ సమయంలో చిన్నప్పుడు కోల్పోయిన ప్రేమను ఒకేసారి ఇవ్వాలని నాన్న ప్రయత్నించేవారు. ఎప్పుడూ నాతో సమయం గడపాలని కోరుకునేవారు. సాయంత్రం క్లబ్కి వెళ్లినా నన్నే వెంట తీసుకెళ్లేవారు. తన స్నేహితుల మధ్య కూర్చోబెట్టి నాతోనే ఎక్కువగా మాట్లాడేవారు'' అని గుర్తు చేసుకున్నారు. అయితే తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని ఒక సంఘటన గురించి చెబుతూ నిరుపమ్ కంటతడి పెట్టుకున్నారు.
'2000లో హృతిక్ రోషన్ హీరోగా పరిచయమైనప్పుడు ఆయన గురించి ఎక్కడ చూసినా మాట్లాడుకునేవారు. ఆ సమయంలో రాకేష్ రోషన్ గారిని అందరూ హృతిక్ గురించి అడిగేవారని నాన్న చెప్పేవారు. ఒకరోజు నన్ను పక్కన కూర్చోబెట్టి.. 'రేపు నువ్వు పెద్ద స్టార్ అయిన తర్వాత నీ గురించి కూడా నన్ను ఇలాగే అడగాలి. నేను క్లబ్లో కూర్చుని ఉంటే అందరూ నీ గురించి గొప్పగా చెప్పాలి. అప్పుడు నాకు వచ్చే ఆనందం వేరే ఉంటుంది' అని అన్నారు'' అని చెప్పారు. ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ తన మనసు భారంగా మారుతుందని నిరుపమ్ తెలిపారు. ' నాన్నగారి కల నెరవేరింది. నేను నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను. కానీ ఆయన బతికి ఉండగా ఆ కోరికను తీర్చలేకపోయాను. అదే నా జీవితంలో పెద్ద బాధ'' అంటూ భావోద్వేగానికి గురయ్యారు.


Click it and Unblock the Notifications





