హీరో నాని స్టార్డమ్ వెనుక కార్తీక దీపం డాక్టర్ బాబు? నిరుపమ్ షాకింగ్ రివీల్
Nirupam Paritala: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు 'డాక్టర్ బాబు'గా ఎంతో దగ్గరైన నటుడు నిరుపమ్ పరిటాల. 'కార్తీక దీపం' సీరియల్తో ఆయన సంపాదించిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేడు ఇంటింటా గుర్తింపు పొందిన ఈ నటుడు ఒకప్పుడు వెండితెరపై హీరోగా నిలదొక్కుకోవాలనే కలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా ఓ పాత ఇంటర్వ్యూలో నిరుపమ్ చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని కెరీర్ను మలిచిన 'అష్టా చమ్మా' సినిమా మొదట తనకు రావాల్సిందని చెప్పడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
నిరుపమ్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన తండ్రి ఓంకార్ మంచి నటుడు, రచయిత, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్న నిరుపమ్ కూడా హీరో కావాలనే లక్ష్యంతో అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో సీరియల్స్ చేస్తూనే సినిమాల్లో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే క్రమంలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న 'అష్టా చమ్మా' సినిమాకి ఆడిషన్ అవకాశం వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

నిరుపమ్ చెప్పిన వివరాల ప్రకారం.. 'అష్టా చమ్మా' కోసం తనను సంప్రదించి ఆడిషన్కు పిలిచారట. సినిమా అవకాశం రావడంతో ఎంతో ఆనందపడ్డానని, అది తన కెరీర్కు పెద్ద మలుపు అవుతుందని భావించానని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో పరిస్థితులు మారిపోయాయి. తాను అప్పటికే సీరియల్స్లో నటిస్తున్నాననే కారణంతో ఆడిషన్ ప్రక్రియ పూర్తికాకముందే తనను పక్కన పెట్టారని తెలిపారు. ఆ తర్వాత ఆ పాత్ర నాని వద్దకు వెళ్లిందని చెప్పారు. 2008లో విడుదలైన 'అష్టా చమ్మా'సినిమాతో నానికి హీరోగా కెరీర్ ప్రారంభించారు. ఆ సినిమా విజయంతో నాని వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస విజయాలతో నేడు టాలీవుడ్లో స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకున్నారు.
ఈ నేపథ్యంలో "ఒకవేళ ఆ రోజు ఆ అవకాశం నాకు వచ్చి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో చెప్పలేం. నాని గారి కెరీర్ కూడా మరోలా ఉండేదేమో" అని నిరుపమ్ సరదాగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, తన కెరీర్లో మరో ఆసక్తికర సంఘటనను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. దర్శకుడు తేజ కార్యాలయం నుంచి కూడా ఒకసారి ఆడిషన్కు పిలుపు వచ్చిందని, అయితే తాను సీరియల్ నటుడినని తెలుసుకున్న తర్వాత ఆడిషన్ కూడా చేయకుండా వెనక్కి పంపించారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు తనకు రెండుసార్లు జరిగాయని, అప్పట్లో చాలా బాధ కలిగించాయని చెప్పారు.
ఈ సందర్భంగా సీరియల్ నటులకు తెలుగు సినీ పరిశ్రమలో ఎదురయ్యే పరిస్థితుల గురించి కూడా నిరుపమ్ మాట్లాడారు. తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో యష్ వంటి నటులు టెలివిజన్ నుంచి స్టార్ హీరోలుగా ఎదిగారని, కానీ తెలుగులో మాత్రం ఇప్పటికీ సీరియల్ నటులపై ఒక ప్రత్యేక అభిప్రాయం ఉందని అన్నారు. "ఇవాళ టీవీలో కనిపించే వాళ్లను మళ్లీ సినిమాలో చూడాలా?" అనే భావన కొంతమందిలో ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఒక అవకాశం మిస్ కావడం జీవితాంతం ఓటమి కాదని నిరుపమ్ తన ప్రయాణంతో నిరూపించారు. సినిమాల్లో హీరో కాలేకపోయినా, బుల్లితెరపై డాక్టర్ బాబుగా కోట్లాది మంది అభిమానులను సంపాదించారు.
ప్రస్తుతం 'కార్తీక దీపం 2'తో ప్రేక్షకులను అలరిస్తూనే, సినిమా అవకాశాల కోసం కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ థ్రోబ్యాక్ ఇంటర్వ్యూ మరోసారి వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. "అష్టా చమ్మాలో నిరుపమ్ హీరో అయ్యి ఉంటే నాని స్టార్ అయ్యేవాడా?", "తెలుగు సినిమా చరిత్ర మరోలా ఉండేదా?" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే విధి ఎవరికి ఏ మార్గం చూపిస్తుందో ముందే చెప్పలేమని, కానీ కష్టపడిన వారికి విజయం తప్పక దక్కుతుందని నిరుపమ్ ప్రయాణం మరోసారి నిరూపిస్తోంది.


Click it and Unblock the Notifications




