చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న దీప.. కూతుళ్లకు అలాంటి కథ చెబుతూ.. వంటలక్క కన్నీరుమున్నీరు!
అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న కార్తీక దీపం సీరియల్లో 1040 ఎపిసోడ్లో భావోద్వేగాలు ఉప్పొంగాయి. దీప, తన పిల్లల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు కనిపించాయి. దీపతో పిల్లలు మాట్లాడుతూ... గతంలో విజయనగరం వెళ్లినట్టు ఇప్పుడు అందర్నీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతావా? అంటూ తల్లి దీపను హిమ అమాయకంగా ప్రశ్నించింది. ఎవరికీ చెప్పకుండా.. ఎవరికీ కనిపించనంత దూరంగా వెళ్లిపోతానా? అంటూ దీప మనసులో అనుకొంటూ మనో వేదనకు గురైంది. అంతలోనే ఇంకా నిద్ర పోలేదా అంటూ శౌర్య గదిలోకి వచ్చింది. అంతలోనే నిద్ర పట్టకపోతే గతంలో శౌర్యకు కథ చెప్పేదానివంట కదా అమ్మ అంటూ మళ్లీ హిమ అమాయకంగా ప్రశ్నించింది.

నిన్ను వంటలక్కగానే చూశా
హిమను చూస్తూ మనసులో తానే మాట్లాడుకొంటూ.. నిన్ను కన్నాను కానీ.. పెంచి పోషించలేదు. కేవలం వంటలక్క మాదిరిగానే నిన్ను చూశాను. నీ బాల్యమంతా నీకు తెలియకుండా, ఏ ముచ్చట తీరుకుండానే గడిచిపోయింది. అన్నప్రాసన చేయించలేదు. అక్షరాభ్యాసం చేయించలేదు. చెవులు కుట్టించలేదు. కనీసం ఒళ్లో పెట్టుకొని ఏ కథలు చెప్పలేదమ్మా అంటూ దీప వేదనకు గురై కంటతడి పెట్టింది. అనారోగ్యంతో తాను పిల్లలకు దూరమైతే వారి పరిస్థితి ఏమిటనే ఆలోచనలో పడింది.

ఇక అడగను అమ్మా.. ఇదే చివరిసారి అంటూ
తల్లి దీప మౌనంగా ఉండటంతో అమ్మా ఈ రాత్రి నిద్ర పట్టేలా లేదు. ఏదైనా కథ చెప్పవా? అంటూ తల్లి అనుభవిస్తున్న క్షోభను తెలుసుకోకుండా హిమ మళ్లీ అమాయకంగా అడిగింది. మళ్లీ అడగను అమ్మా.. ఇదే చివరి సారి అంటూ తల్లితో ప్రాధేయపడింది. ఏం కథ చెప్పనంటూ తల్లి అడగ్గానే సంతోషంతో మీ ఇష్టం అంటూ హిమ సమాధానం ఇచ్చింది.

ఆవు, పులి కథ...
దాంతో దీప తన పిల్లలకు కథ చెప్పడం ప్రారంభించింది. అనగనగా ఓ ఆవు. ఆ ఆవుకు ఒక దూడ. ఆవంటే దూడకు ప్రాణం.. దూడ అంటూ ఆవుకూ ప్రాణం. ఒకరోజు ఆవు మేత కోసం అడవికి వెళ్లింది. ఆ అడవిలో తన వాళ్ల నుంచి విడిపోయి ఒంటరిగా మిగిలింది. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న ఆవుకు పులి గాండ్రింపు వినిపించింది అంటూ దీప కథ చెప్పడం కొనసాగించింది.

పులిని అతికష్టం మీద ఆపిందంటూ...
అయితే పులి గాండ్రింపుకు తాను చచ్చిపోతానని భయపడలేదు. ఒకవేళ తాను చచ్చిపోతే దూడ ఒంటరి అవుతుందనే బెంగ మొదలైంది. ఆవు మీద దాడి చేసింది పులి. అతికష్టం మీద పులిని ఆవు ఆపింది. నాకు ఆహారం అవడానికి నీవు పుట్టావని ఆవును చూసి పులి అంది. అవును.. నీకు ఆహారం అవుతాను.. కానీ నాకు చివరి కోరిక ఉంది.. తీరుస్తావా అంటూ అడిగింది. దాంతో పులి సరే అంది అంటూ దీప కంటతడి పెడుతూ కథను చెప్పడం కొనసాగింది.

తనవితీరా.. ముద్దులు పెట్టి
పులితో నాకు ఓ బిడ్డ ఉంది. అభంశుభం తెలియని బిడ్డ అది. తోటి దూడతో ఆడుకొంటూ అమ్మ వస్తుందని ఎదురు చూస్తుంటుంది. లోకం తెలియని పసిబిడ్డ.. ఆకలితో ఉన్న ఎవరినీ బిడ్డ అది. నేను వెళ్లి పాలు ఇచ్చి వస్తానంది. అప్పుడు పులి కరిగిపోయి మళ్లీ రావాలని పంపించింది. ఆవు దూడ దగ్గరకు వెళ్లింది. తనవితీరా ముద్దులు పెట్టింది. కడుపు నిండా పాలు ఇచ్చింది అంటూ కన్నీరుమున్నీరవుతూ దీప కథను చెబుతూనే ఉంది.

బిడ్డను దిగులు పడొద్దని...
తన దూడకు ఆవు జాగ్రత్తలు చెప్పింది. అందరితో మంచిగా ఉండాలని చెప్పింది. అమ్మ లేదని దిగులుపడొద్దని చెప్పింది. ఇక ఎప్పటికీ తిరిగి రానని చెప్పింది. చివరి చూపు చూస్తూ వెళ్లిపోయింది అంటూ దీప ఎమోషనల్ అయింది. దాంతో నిజాయితీగా తిరిగి వచ్చిన ఆవును పులి వదిలేసిందా అంటూ హిమ ఆతృతగా అడిగింది.
Recommended Video

పులి రూపంలో మృత్యువు
అయితే ఆ కాలంలో నిజాయితీగా వచ్చిన ఆవును పులి వదిలేసింది. కానీ ఈ కాలంలో పులి వదిలేస్తుందా? అంటూ దీప మౌనంగా రోదించింది. పులిలా పొంచి ఉన్న మృత్యువు తనను కాటేస్తే.. నా పిల్లలు ఏమౌతారో అంటూ దీప గుండె పగిలేలా రోదించింది. ఇలాంటి సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











