Krishna Mukunda Murari: మొత్తం వినేసిన కృష్ణ.. మురారికి తెలిసిన మరో నిజం.. ట్విస్టుల మీద ట్విస్టులు
టీవీల వాడకం పెరిగిన నాటి నుంచే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందంటే:ముకుంద ఇచ్చిన షాక్తో మురారి ఆమె గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే కృష్ణ వచ్చి మాట్లాడబోగా ఆమెపై సీరియస్ అవుతాడు. తర్వాత బుజ్జగిస్తూ తనకు నచ్చిన ఉల్లి దోశ చేయమంటాడు. అంతకు ముందే కృష్ణ వంట బాధ్యతను ముకుందకు అప్పగిస్తుంది. మురారి కోసం ఆమె దోశ చేస్తే ముకుంద మారలేదు అనుకుంటుంది. అంతలోనే మురారి.. ముకుంద దగ్గరకు వెళ్లి దోశ వేయకుండా చేయాలని అనుకుంటాడు. కానీ, ముకుంద మాత్రం అతడిపై ప్రేమను వ్యక్త పరుస్తూ మాట్లాడుతుంది. దీంతో మురారి ఆమెను కొట్టేందుకు చేయి లేపుతాడు.

కృష్ణ లైఫ్ నుంచి వెళ్లిపోవాలి:మురారితో ముకుంద 'కృష్ణకు మన విషయం తెలుస్తుందని బాధపడుతున్నావు కదా. తెలియనివ్వు ఈరోజు కాకపోతే రేపు అయినా తెలియాలి కదా. నిన్ను నాకు అప్పగించి ఎలా వచ్చిందో అలా నీ జీవితం నుంచి వెళ్లిపోవాల్సిందే కదా' అంటుంది. దీనికి మురారి కలలో కూడా అది జరగదని చెప్తాడు. దీంతో ముకుంద 'జరగాలి.. మన జీవితంలోకి ఎవరైతే రావడం వల్ల మనం దూరం అయ్యామో వాళ్ళు వెళ్లిపోవాలి. ఇప్పుడు నీ ముందు ఉన్న ఆప్షన్స్ రెండు. ఆదర్శ్ను ఎలాగైనా ఒప్పించి ఇంట్లో నుంచి బయటకి పంపించడం, రెండు ఇప్పుడే ఇక్కడే గొడవ చేసి ఇంట్లో అందరికీ తెలిసేలా చేస్తే ఆ బాధ తట్టుకోలేక తనంతట తానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం ఒకటి కావడమే' అని చెబుతుంది.
ఏది జరిగినా ఒకటి కావాలని:ఆ తర్వాత ముకుంద 'ఈ రెండింటిలో ఆదర్శ్ వెళ్ళడం కామన్ అనుకుంటున్నావేమో కాదు.. ఏది జరిగినా మనం ఒకటి కావడం కామన్. ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు. నేను వేసే ఉల్లిపాయ దోస తిని శోభనం ఎలా ఆపాలి? ఆదర్శ్ను ఎలా పంపించాలి? అనేవి ఆలోచించు' అని చెప్తుంది. ముకుంద మాటలకు పక్కనుంచి వింటున్న కృష్ణతో పాటు మురారి కోపం వస్తుంది. కానీ, ఇద్దరూ కంట్రోల్ చేసుకుని వెళ్లిపోతారు. తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకోడానికి కృష్ణ గార్డెన్లో మొక్కలకు నీళ్ళు పోస్తుంటే రేవతి వచ్చి బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఇక్కడ ఉన్నావేంటి అంటుంది.

వాళ్లపై కోపం చూపిన కృష్ణ:రేవతి మాటలకు కృష్ణ 'ఈరోజు వంట ముకుందను చేయమని చెప్పాను. అయినా మీ సొంత కోడలు నేనా ముకుందనా' అని అంటుంది. దీంతో రేవతి వెంటనే కృష్ణ చెవిని మెలిపెట్టేస్తుంది. వెంటనే 'అలా కాదు.. నీకు అయితే ఎవరికి ఏం కావాలో బాగా తెలుసు' అంటుంది. తర్వాత మురారి హడావుడిగా వెళ్తుంటే ఎక్కడికని కృష్ణ అడుగుతుంది. అప్పుడతను 'ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది' అని వెళ్తాడు. దీంతో కృష్ణ 'మీరు ఎందుకు బ్రేక్ ఫాస్ట్ చేయలేదో.. ముకుంద మనసులో ఏముందో మొత్తం తెలిసింది. అయినా మీ మనసులో తను లేదుగా' అనుకుంటుంది.
మధుకు డౌట్.. ఆదర్శ్తో:టిఫిన్ రెడీ చేసిన తర్వాత మురారిని ముకుంద పిలుస్తుంది. దీంతో మధు కోపంగా చూస్తూ 'అది మురారికి ఇష్టమైనది కదా. ఆదర్శ్కు ఇష్టమైనది చేయలేదా' అని అడిగేస్తాడు. దీంతో ఆదర్శ్ 'నాకు ఆనియన్ దోస అంటే ఇష్టమే. వాడికి ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం' అంటాడు. అందరూ వస్తే కలిసి తిందామని చెప్తుంది. దీంతో మురారి ఆఫీసుకి వెళ్లిపోయాడని రేవతి చెప్తుంది. ఇక, కోపంగా వెళ్లిపోయిన మురారి 'రాత్రి వరకే టైమ్ ఉంది.. ఈలోగా ఏదో ఒకటి చేయాలి. ముకుంద మనసులో నుంచి పిచ్చి ఆలోచనలు పారిపోయేలా చేయాలి' అనుకుంటాడు.

మురారికి చేసింది పెట్టను:మురారి వెళ్లిపోయాడని తెలిసి ముకుంద 'ఎందుకు ఇలా చేశావ్? ఈ శోభనం జరగకుండా నువ్వే చూడాలి' అనుకుంటుంది. కృష్ణ కూడా ఇంట్లో ఉండకపోవడంతో 'తను వెళ్లిపోవడానికి నేను చేసిన టిఫిన్ కారణమా? అంటే నా గురించి మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకా హ్యాపీ. అందరికీ తెలిసిపోతుంది. శోభనం ఏమీ ఉండదు' అని సంబరపడుతుంది. తర్వాత 'నా మురారి కోసం ఇష్టంగా చేసింది నీకెందుకు పెడతా' అని ఆదర్శ్కు టిఫిన్ పెట్టదు. దీంతో మధు ఆదర్శ్ కి పెట్టవా అనగా.. తనకి ఉప్మా పెసరట్టు ఇష్టం కదా అదే చేసి పెడతానని కవర్ చేస్తుంది.
మధు అలా.. మురారి ఇలా:ఆదర్శ్ కోసం వంట మనిషితో టిఫిన్ చేయించాలని ముకుంద అనుకుంటుంది. కానీ, ఆదర్శ్ సంతోషంగా ఉంటాడు. అప్పుడు మధు 'నిన్ను ఉప్మా గాడిని చేసి వెళ్ళిపోయింది. మురారి కోసం చేసిన టిఫిన్ డస్ట్ బిన్లో అయినా వేస్తాను కానీ.. నీకు పెట్టనని చెప్పేసింది. నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు' అనుకుంటాడు. మరోవైపు మురారి.. గోపి దగ్గరకు వచ్చి తన గోడు చెప్పుకుంటాడు. కృష్ణ అతడిని గమనిస్తుంది. అప్పుడు మురారి 'ముకుంద మారలేదు ఇన్నాళ్ళూ మారినట్టు నటించింది. రేపు శోభనం అనగా ఇప్పుడు అసలు రంగు బయట పెట్టింది. తాను మారిందని కదా ఆదర్శ్ను తీసుకొచ్చాము. ఇప్పుడు పంపించమంటే ఎలా? కథ మళ్ళీ మొదటికి వచ్చింది ఏం చేయాలో అర్థం కావడం లేదు' అంటాడు.
నేను ఉన్నానంటూ ధైర్యం:గోపీని మురారి ఏదైనా సొల్యూషన్ చెప్పమని అడుగుతాడు. 'అన్ని మర్చిపోయి మంచు కొండలలో ఉన్నవాడు ముకుంద మారిందని ఇంటికి తిరిగొచ్చాడు. తన గురించి తెలిస్తే కుటుంబం మొత్తం అల్లకల్లోలంగా అయిపోతుంది' అంటాడు. ఇక, బయటకి మురారి రాగానే వెనుక కృష్ణ వచ్చి పిలుస్తుంది. అప్పుడామె 'నేను విన్నాను, నేను ఉన్నాను ఏం టెన్షన్ వద్దు. ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కారం అదే దొరుకుతుంది. కిచెన్లో నేను మొత్తం విన్నాను. రిసార్టులోనే ముకుంద మీద నాకు డౌట్ వచ్చింది' అని చెబుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











