Krishna Mukunda Murari: మీరా ప్లాన్ వర్కౌట్.. అందుకు ఒప్పించిన భవానీ.. ఆమె రాకతో మరో ట్విస్ట్
గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు కొత్త కొత్త ట్రెండ్లు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందంటే:మురారిని విడిపించి వచ్చిన తర్వాత శ్రీనివాస్.. ముకుందను తప్పు చేశావని అంటాడు. అంతేకాదు, ఒక్క రాత్రి ఆగుంటే మురారి చనిపోయేవాడని చెప్తాడు. దీంతో ముకుంద తండ్రిపై సీరియస్ అవుతుంది. అంతేకాదు, అతడిని దూరంగా వెళ్లిపోమని పంపిస్తుంది. ఇక, మురారిని చూస్తూ కృష్ణ నిద్రపోకుండా ఉంటుంది. ఆమె ప్రేమను, మాటలను చూసి మురారి ఎమోషనల్ అవుతాడు. ఇక, మధును ఆదర్శ్ అవమానించేలా మాట్లాడతాడు. అప్పుడే భవానీ వచ్చి అతడిని కొడుతుంది. తర్వాత పోలీసు దెబ్బలు తిన్న మురారిపై భవానీ ప్రేమను చూపిస్తూ మాట్లాడుతుంది.

మీరాకు థ్యాంక్స్ చెప్పాలని:ఇంట్లో వాళ్ల మీద కోపంగానే ఉన్న ఆదర్శ్ కిందకు వస్తాడు. వచ్చీ రావడమే రేవతితో 'మురారి తిన్నాడా? వాడిని పిలిచి మరీ పెడతారు కానీ.. నన్ను మాత్రం పట్టించుకొరు' అంటూ వెటకారంగా మాట్లాడుతాడు. దీంతో సుమలత, మధు టిఫిన్ విషయంలో కూడా ఎందుకు గొడవ చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు ఆదర్శ్ మళ్లీ నోరు పారేసుకుంటూ ముకుంద చనిపోవడానికి మురారి కారణమని తిడతాడు. ఆ తర్వాత అమ్మ ఎక్కడ కనిపించడం లేదని అడుగుతాడు. దీంతో సుమలత మురారిని విడిపించిన మీరాకి థాంక్స్ చెప్పడానికి వెళ్ళింది అని చెబుతుంది.
సార్కు కాపాడిన దేవత అని:సుమలత చెప్పగానే ఆదర్శ్ 'ఇప్పుడే కదా మా అమ్మ వచ్చింది. అప్పుడే మీ వైపుకు తిప్పుకుని ఆ పనికిమాలిన దాని దగ్గరకు పంపించారా' అని అంటాడు. అప్పుడే కృష్ణ వచ్చి 'ఎవరిని పనికిమాలినది అంటున్నావు? ఏసీపీ సర్ను కాపాడిన దేవత ఆ అమ్మాయి. అత్తయ్య కూడా అలా అనుకున్నారు కాబట్టే వచ్చీ రాగానే తనకి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళింది' అని చెప్తుంది. దీంతో ఆదర్శ్ 'ఆవిడను దేవతను చేసి మా అమ్మ మనసు మార్చి పంపించారు. ప్రశాంతంగా అమెరికాలో ఉన్న తనను టెన్షన్ పెట్టి రప్పించారు' అని కోపంగా అంటాడు.

మీరా దగ్గరకు వెళ్లిన భవానీ:ఆదర్శ్ మాటలతో కృష్ణ 'చాలు పడుతున్నాం కదా అని ఇంకా మాట్లాడొద్దు' అంటుంది. అప్పుడు మధు 'ఇవే మాటలు పెద్దమ్మ దగ్గర మాట్లాడు పళ్ళు రాలగొడుతుంది' అని అంటాడు. తర్వాత కృష్ణ 'ఇలా పదే పదే రెచ్చగొట్టేలా మాట్లాడితే ఊరుకునేది లేదు' అని వార్నింగ్ ఇస్తుంది. అనంతరం మీరా ఉన్న ఏరియాకు భవానీ దేవి వస్తుంది. అప్పుడు 'హోమ్ మినిస్టర్ కూతురికి, ముకుందకి ఫ్రెండ్ అన్నారు. ఈ అమ్మాయి చూస్తే ఈ ఏరియాలో ఉందేంటి' అని సందేహ పడుతుంది. అనంతరం భవానీ మీరా దగ్గరకు వస్తుంది.
కాపాడింది ఒక్కరిని కాదని:భవానీని చూసిన ముకుంద 'నాకు తెలుసు అత్తయ్య మీరు వస్తారని. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాను' అని మనసులో అనుకుంటుంది. కానీ, ఏమి తెలియనట్టు ఎవరు మీరు అని భవానీని అడుగుతుంది. దీనికామె మురారి పెద్దమ్మని అని చెప్తుంది. తర్వాత విరిగిపోయిన కుర్చీ తీసుకొచ్చి వేసి కూర్చోమని ఇచ్చి పేదరికంలో బతుకుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. తర్వాత భవానీ 'నువ్వు కాపాడింది ఒక్క ప్రాణం కాదు.. మా ఇంటి అందరి ప్రాణాలు, పరువుని కాపాడావు. నువ్వు చేసిన పనికి నీకు చేతులెత్తి మొక్కాలి' అంటుంది.

మా ఇంట్లో ఉండు అంటూ:అనంతరం భవానీ దేవి 'హోమ్ మినిస్టర్ కూతురు, మా కోడలు ఫ్రెండ్వు కదా. మరి ఏంటి ఇలాంటి ప్లేస్లో ఉన్నావేంటి ' అని అడుగుతుంది. దీనికి మీరా 'గొప్ప వాళ్ళు స్నేహితులు అయినా.. వాళ్ళ దగ్గర సాయం తీసుకోవడం ఇష్టం లేదు' అంటుంది. తర్వాత ముకుంద గురించి గొప్పగా చెప్తుంది. మొత్తానికి మీరా అనాథలా కలరింగ్ ఇస్తుంది. మీరా మాటలకు భవానీ ఇంప్రెస్ అవుతూ.. 'నువ్వు మాకు చేసిన మేలుకు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు మా ఇంట్లో' అంటుంది. దీంతో మీరా ఇంత త్వరగా ఇంటికి రమ్మని పిలుస్తావని అనుకోలేదంటుంది.
మీరాను ఒప్పించిన భవానీ:భవానీ పిలిచినా మీరా ఇంటికి రానని అంటుంది. దీంతో భవానీ 'నేను ఇలాగే ఆత్మాభిమానంగా ఉంటాను కానీ.. సాయం చేసిన వారికి తిరిగి సాయం చేయకుండా ఉండలేను. ఒకప్పుడు దంపతులు నాకు సాయం చేశారు. కానీ ప్రమాదవశాత్తూ వాళ్ళు చనిపోయారు. అప్పటికి వాళ్ళకు ఆరు నెలల కొడుకు ఉన్నాడు. వాడిని నేనే పెంచుకున్నాను వాడు ఎవరో కాదు నా పెద్ద కొడుకు ఆదర్శ్' అని చెప్తుంది. నువ్వు మాకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా తమ ఇంటికి వచ్చి ఉండమని చెప్తుంది. తనని ఒప్పించి ఇంటికి తీసుకెళ్తుంది. తర్వాత ఆమెకు బట్టలు కొనిస్తుంది.
తండ్రికి కష్టం.. కూతురేమో:శ్రీనివాస్ దగ్గరకు తన స్నేహితులు వచ్చి ముకుంద చనిపోవడంపై పరామర్శిస్తారు. అప్పుడు ముకుంద ఫోటోకి దండ వేసి దీపం పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదని ఫ్రెండ్ అడుగుతాడు. అది పెడితే మళ్ళీ గుర్తు వస్తుందని అందుకే పెట్టలేదని చెప్తాడు. ట్రైన్ కింద పడి చావాల్సిన అవసరం ఏమొచ్చిందని గుచ్చి గుచ్చి అడిగేసరికి శ్రీనివాస్ కోపంగా ఆపండని గట్టిగా అరుస్తాడు. మరోవైపు, మీరాను ఇంటికి తీసుకు వస్తుండడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











