టీవీ సెట్లో అగ్నిప్రమాదం...భారీ నష్టం
ముంబయి: ప్రముఖ టీవీ కార్యక్రమం 'కామెడీ నైట్స్ విత్ కపిల్' చిత్రీకరణ సెట్లో బుధవారం ఉదయం 8.15కి అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే నాలుగు అగ్నిమాపక వాహనాలు, అయిదు నీటి ట్యాంకర్లు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపు చేశాయని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు. కానీ ఇరవై నుంచి ఇరవై రెండు కోట్లు దాకా నష్టం వాటిల్లి ఉంటుందని కపిల్ శర్మ చెప్పారు.
ప్రమాద సమయంలో సెట్లో చిత్రీకరణేమీ సాగడం లేదని 'కామెడీ నైట్స్ విత్ కపిల్' కార్యక్రమం ప్రసారం చేసే కలర్స్ చానల్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ నిర్వహిస్తున్నారు.. షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్ వంటి బాలీవుడ్ హీరోలూ తమ సినిమాల ప్రచార నిమిత్తం తరచూ ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటారు.

కపిల్..ది గ్రేట్ ఇండియన్ లాఫర్ చాలెంజ్లో విజయం సాధించడంతో దశ తిరిగింది. ప్రేక్షకులకు మరింత దగ్గర కావడానికి కామెడీ నైట్స్ విత్ కపిల్ పేరుతో ఇతడు ప్రత్యేక షోను నిర్మిస్తూ నిర్వహిస్తున్నాడు. 'నాకేదో ఒకే రాత్రిలో ఇంత పేరు వచ్చిందని అంతా అనుకుంటున్నారు. అది నిజం కాదు. దీని వెనక ఏళ్ల శ్రమ ఉంది. డబ్బులు తీసుకోకుండానే ఎన్నో షోల్లో నటించాను. ఏడాదిపాటు అనేక వ్యయప్రయాసలకు ఓర్చి కామెడీ నైట్స్ విత్ కపిల్ షోను తీర్చిదిద్దాను' అని తెలిపారు. నటుడిగా, స్టాండప్ కమెడియన్గా, షో నిర్వాహకుడిగా.. ఇలా ఎన్నో పాత్రలు పోషించిన కపిల్ తన కెరీర్ ప్రయాణం బాగానే ఉందని తెలిపాడు.
'2005లో నేను కామెడీ షోలు మొదలుపెట్టాను. నాలో ఎంతో ఎదుగుదల గమనించాను. మొదట్లో నిరాశ పడ్డాను. అయితే భగవంతుడు నాకు ఇచ్చింది చాలు. నేను కొత్త రకం కామెడీ పండించడం లేదు. ఉన్నదానినే కొత్తగా చూపిస్తున్నాను' అని కపిల్ వివరించాడు. షారుఖ్, సల్మాన్ వంటి బడాతారల ప్రశంసలు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయని కపిల్ శర్మ అన్నాడు. అన్నట్టు ఈ షోలో మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సిద్ధూ కూడా పాల్గొంటూ తన వంతుగా ప్రేక్షకులను నవ్విస్తుంటారు.


Click it and Unblock the Notifications











