ఎన్టీఆర్ వద్ద సలహాలు తీసుకొన్న వారే..:మురళి మోహన్

రాష్ట్రంలో కళాకారుల పొట్టగొట్టే అనువాద ధారావాహికల ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని మా అధ్యక్షులు మాగంటి మురళీమోహన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని వెదురుపాక విజయదుర్గా పీఠాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. అక్కడ మాట్లాడారు. నటించాలనే ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోందని, ఓపిక ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటానని మురళీమోహన్ అన్నారు.
మురళి మోహన్ మాట్లాడుతూ.... అద్భుతమైన కథలు, సత్తా ఉన్న కళాకారులు పుష్కలంగా ఉండగా, పరభాష సీరియల్స్ను వీక్షకులపై రుద్దాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. ఉగాది అనంతరం అనువాద ధారావాహికలను నిలిపివేయాలన్న తమ అభ్యర్థనను ఈటీవి ఒక్కటే అమలు చేసిందన్నారు. జెమినీ టీవీ కూడా వాటిని నిలిపివేస్తామని హామీ ఇచ్చిందన్నారు. జీ టీవీ, మాటీవీలలో అధికశాతం డబ్బింగ్సీరియల్స్ ప్రసారమవుతున్నాయన్నారు.
73 సంవత్సరాల వయస్సులో ఆరోగ్యంగా ఉండటానికి గల కారణాలను ఆయన వివరిస్తూ సానుకూల దృక్పధం, ఆహార నియమాలు, క్రమం తప్పని నడక, వ్యాయామ ప్రక్రియలేనన్నారు. పార్టీలు మారితే రాజకీయ ఆత్మహత్యే... రోజుకో పార్టీ మార్చేవారు రాజకీయంగా ఆత్మహత్య చేసుకొన్నట్లేనని, సిద్ధాంతాలు నచ్చకపోతే గుడ్బై చెప్పాలే తప్ప పార్టీలు మారడం నాయకులకు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











