బయటపడుతున్న బిగ్ బాస్ మోసాలు: రేటింగ్ కోసం ఆ కంటెస్టెంట్ల పరువు తీసేశారు!
ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభమైనా గతంలో మరే షోకూ దక్కని రెస్పాన్స్ను అందుకుని తెలుగులోనే నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది బిగ్ బాస్. మొదటి సీజన్తోనే తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ షో.. చాలా తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి రేటింగ్ సాధించింది. దీంతో ఈ షో ఏకంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ సైతం సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో బిగ్ బాస్ చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఫలితంగా షోపై డౌట్లు ఎక్కువయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..

బిగ్ బాస్.. అతిపెద్ద రియాలిటీ షో
బిగ్ బ్రదర్ అనే రియాలిటీ షో ఇంగ్లీష్లో ప్రసారం అవుతోంది. ప్రపంచ దేశాల్లో ఇది చాలా ఫేమస్. ఈ షో ఆధారంగానే మన దేశంలో బిగ్ బాస్ను రూపొందించారు. 2006లో హిందీలో ఈ షో ప్రారంభం అయింది. దీని తర్వాత చాలా భాషల్లో ఈ షోను తీసుకు వచ్చారు. సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం తెలుగులోనూ ఈ రియాలిటీ షోను పరిచయం చేశారు.

డైరెక్షన్ ఆధారంగానే నడుస్తుందా
కంటెస్టెంట్లు కొన్ని రోజుల పాటు ఒక ఇంట్లో ఉంటూ, వాళ్ల వాళ్ల పనులు చేసుకుంటూ, ప్రేక్షకుల మనసులు గెలుచుకుని విజేతలుగా నిలవడమే ఈ షో కాన్సెప్ట్. ఇందులో జరిగే అంశాలన్నీ రియాలిటీగా ఉంటాయి. ఈ విషయాన్ని షో నిర్వహకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయినప్పటికీ ఇది డైరెక్షన్ ఆధారంగానే నడిచే షోనే అయ్యుంటుందనేది చాలా మంది డౌట్.

ప్రతి సీజన్లోనూ అదే సందేహం
తెలుగులో బిగ్ బాస్ షో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. అన్ని సీజన్లలోనూ ఈ షో గురించి సందేహాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు నమ్మశక్యంగా లేకపోవడంతో ఇవి ఎక్కువయ్యాయి. అలాగే, అత్యంత ప్రాధాన్యం కలిగిన ఓటింగ్ సిస్టమ్పై మరిన్ని డౌట్లు ఉన్నాయి. దీనికి కారణం కంటెస్టెంట్లకు పోలైన ఓట్ల లెక్కలు చెప్పకపోవడమే.

వాళ్ల ఎలిమినేషన్లతో పెరిగాయి
బిగ్ బాస్ షోపై ఉన్న సందేహాలు.. ఈ సీజన్లో మరింత ఎక్కువయ్యాయి. ప్రేక్షకుల నుంచి ఆదరణ ఉన్న దేవీ నాగవల్లి, దివి వద్యా, కుమార్ సాయి అనూహ్య రీతిలో ఎలిమినేట్ అవడమే ఇందుకు కారణం. వీళ్లు బయటకు వెళ్లిన తర్వాత బిగ్ బాస్ యూనిట్పై విమర్శల వర్షం కురిసింది. రేటింగ్ కోసం కొందరిని హౌస్లో ఉంచి, మిగతా వాళ్లను పంపుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

బయటపడుతున్న షో మోసాలు
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు అందరూ ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. వీరిలో సూర్య కిరణ్, కరాటే కల్యాణీ, దేవీ నాగవల్లి, కుమార్ సాయి, నోయల్, మెహబూబ్లు తమ ఎలిమినేషన్లపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తమను బ్యాడ్ చేసే సన్నివేశాలను మాత్రమే షోలో చూపించారని నిర్వహకులపై ఆరోపణలు చేస్తున్నారు.
Recommended Video

ఆ కంటెస్టెంట్ల పరువు తీసేశారు!
బిగ్ బాస్ షో రేటింగ్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. దీనికి ప్రధాన కారణం హౌస్లో జరిగే గొడవలే. వాస్తవానికి షోలో 24 గంటల్లో ఎన్నో విషయాలు జరుగుతాయి. కానీ, యూనిట్ మాత్రం గొడవలనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. వాటినే ప్రసారం చేస్తోంది. ఇలా చేయడం వల్ల సూర్య కిరణ నుంచి మెహబూబ్ వరకు ప్రేక్షకుల దృష్టిలో బ్యాడ్ అయ్యారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


Click it and Unblock the Notifications











