‘నన్నెప్పుడు గెంటేస్తారా అని కోరుకున్నారు... టీవీ ఇండస్ట్రీలో అలాంటి కుట్రలు’
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కొన్నేళ్లుగా తన నటనతో అలరిస్తున్నారు పల్లవి రామిశెట్టి. తొలుత శ్రీ శ్రీమతి కళ్యాణం అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు పల్లవి. ఆ తర్వాత ఆడదే ఆధారం, వసుంధర, మాటే మంత్రము, భార్యామణి, పాపే మా జీవన జ్యోతి, అత్తారింటికి దారేది, భార్యామణి తదితర సీరియల్స్లో నటించారు. ఆమె నటించిన ఆడదే ఆధారం ధారావాహిక ఏకంగా 11 ఏళ్లపాటు టెలికాస్ట్ అయి.. 3300 ఎపిసోడ్స్తో తెలుగు బుల్లితెరపై అత్యధిక రోజులు ప్రసారమైన సీరియల్గా నిలిచింది. ఇక భార్యామణి సీరియల్లో నటనకు గాను నంది అవార్డును అందుకున్నారు పల్లవి. ప్రస్తుతం స్టార్ మాలో ఇంటింటి రామాయణం సీరియల్లో నటిస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, తెలుగు బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన విషయాలను వెల్లడించారు. ఈ వివరాల్లోకి వెళితే..
టీవీ ఇండస్ట్రీలో నేను అడుగుపెట్టి 16 ఏళ్లు అవుతోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి 13 ఏళ్లు ఈటీవీలోనే వర్క్ చేశా. 12 ఏళ్ల పాటు ఎక్కడికి వెళ్లలేదు. రామోజీ గ్రూప్లోనే పనిచేశా. ప్రతి సీరియల్ స్క్రిప్ట్ అంతా ఒక టైంలో చాలా బాగుండేది. ఇప్పటితో పోల్చి చూస్తే స్క్రిప్ట్ రియలిస్టిక్గా, రెగ్యులర్గా ఇంట్లో జరిగే డ్రామాలానే ఉండేది. ఆడదే ఆధారం చేస్తున్న కొన్ని నెలలకు భార్యామణిలో అవకాశం ఇచ్చారు. భార్యామణి చేస్తుండగా అత్తారింటికి దారేదిలో ఛాన్స్ దొరికింది. ఇన్నేళ్లలో నేను చేసిన సీరియల్స్ ఐదారుకు మించి ఉండవు. అయితే ఆడదే ఆధారం అనే సీరియల్ నా ఇంటర్లో స్టార్ట్ అయ్యి.. నా మ్యారేజ్ వరకు 11 ఏళ్లు రన్ అయ్యింది. నా కంటే పెద్దోళ్లు కూడా నా చిన్నప్పుడు ఈ సీరియల్ స్టార్ట్ అయ్యింది, అప్పటి నుంచి చూస్తున్నామని చెబితే నవ్వుకుంటే ఉండేదానిని అని పల్లవి తెలిపారు.

మా నాన్న కజిన్ ఒకరు.. యాంకరింగ్ వైపు తీసుకెళ్లి సినిమాల కోసం ట్రై చేశారు. అయితే సినిమాలో రోల్ చిన్నగా ఉండటంతో సెట్ కాలేదు. కానీ ఆయనే ఆడిషన్స్కి పంపించి సీరియల్స్ వైపు నడిపించారు. ఆయన వల్లే ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. నా ఏజ్ కంటే చాలా పెద్ద క్యారెక్టర్లు చేశా. ఇప్పుడంటే ఓకే కానీ.. ఆ వయసులో నాకు క్యారెక్టర్లు ఎంచుకునేంత అనుభవం లేదు. ఈటీవీలో ఆఫర్ రావడం అంటేనే పెద్ద అవకాశం. చాలా మంచిగా ఒక గవర్నమెంట్ జాబ్ మాదిరిగానే ఉండేది. ప్రతి నెల శాలరీ.. టైమింగ్స్, ఒక సిస్టమ్ ప్రకారం జరిగేవి. అలా ఫ్లోతో వెళ్లిపోయాం. సీన్లలో వెరియేషన్స్ చూపించడం కూడా అప్పుడే నేర్చుకున్నానని పల్లవి వెల్లడించారు.
అప్పటితో పోలిస్తే ఇప్పుడు బుల్లితెర ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్టులు కనిపించడం లేదు. కొత్తవారికి అవకాశాలు రాకుండా వేరే స్టేట్స్ నుంచి తీసుకొస్తున్నారు. హీరోయిన్సే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులని కూడా పరభాషా నటులకు ఇచ్చేస్తున్నారు. గతంలో రోజుకు రెండు మూడు సీన్లు షూట్ చేసేవాళ్లం.. 18 రోజులు షూటింగ్ చేస్తే నెలకు సరిపడా ఎపిసోడ్స్ వస్తాయి. ఇప్పుడు పరిస్ధితి ఎలా తయారైందంటే 10 రోజులు చేస్తే చాలాు నెలకు సరిపడా కంటెంట్ వచ్చేస్తుంది. వర్క్ పెరిగిపోయింది, ఆర్టిస్టులపై ఒత్తిడి పెరిగిందిని పల్లవి పేర్కొన్నారు.
ఈటీవీలో చాలా ఏళ్లు పనిచేయడంతో నేను ఏం చెప్పినా, ఏది చేసినా నడుస్తుందని అనుకునేవాళ్లు. కానీ అది రాంగ్. నేను కూడా అందరిలాగానే చేస్తున్నాను. నా టాలెంట్తో పాటు వాళ్లు ఇచ్చిన స్క్రిప్ట్కి న్యాయం చేస్తున్నాను కాబట్టే అన్నేళ్లు ఈటీవీలో చేయగలిగాను. కానీ నేనేం చేసినా అక్కడ నడుస్తుందని క్రియేట్ చేసేశారు. నేను ఎప్పుడు ఈటీవీలో నుంచి బయటికి వెళ్లిపోతానా అని ఎదురుచూశారు. ఆ టైంలోనే బయట చేయాలని నిర్ణయించుకుని ఈటీవీ కాకుండా వేరే సంస్థలో ఫస్ట్ టైం నటించాను. నా మీద ఈ మచ్చ పోవాలి.. ఎందుకలా అనుకుంటున్నారు అని నాకు నేనుగా త్యాగం చేశా. ఎదుగుతుంటే చూడలేని వాళ్లు ప్రతిచోటా ఉంటారని పల్లవి తెలిపారు.
ఎందుకు ఈ అమ్మాయి ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంది? ఇంకా హీరోయిన్గా ఎలా చేస్తుంది? ఎందుకు ఇంకా ఆఫర్లు వస్తున్నాయి? అని పెద్దవాళ్లకు ఉన్నవి లేనివి చెప్పేవాళ్లు. ఇంక ఆ అమ్మాయితో చాలు .. వేరే వాళ్లని పెట్టుకుందామని ఇంటర్నెల్గా చాలా రాజకీయాలు జరిగాయి. స్క్రిప్ట్లో, క్యారెక్టర్లో బలం ఉంది కాబట్టే నన్ను ప్రేక్షకులు అన్ని సంవత్సరాలు ఆదరించారు. నువ్వు కట్టుకున్న చీరలు కూడా చాలా పద్ధతిగా కట్టుకుంటావని బయట కొందరు పెద్దవాళ్లు మెచ్చుకునేవాళ్లు. టీవీ ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఇలా జరిగాయి.. అలా జరిగాయి అని చెబుతూ ఉంటారు. కానీ నాకు అలాంటి పరిస్ధితి ఎప్పుడు ఎదురుకాలేదు. నన్ను బయటకు తోసేయాలని చూశారు తప్పించి.. వేరే నెగిటివ్ నాకేం జరగలేదు అని పల్లవి రామిశెట్టి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications


















