Pandu Master Health Update:పండు మాస్టర్ మళ్లీ డ్యాన్స్ చేస్తారా? వైద్యుల కీలక ప్రకటన
Pandu Master Health Update: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పండు మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖ డాన్స్ రియాలిటీ షో 'ఢీ' ద్వారా కొరియోగ్రాఫర్గా, మెంటర్గా, కంటెస్టెంట్గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆయన, ఎన్నో అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్లతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం 'ఢీ' 20వ సీజన్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్న పండు మాస్టర్కు ఇటీవల జరిగిన ప్రమాదం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం తర్వాత సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పండు మాస్టర్ ఇకపై డ్యాన్స్ చేయలేరని, బుల్లితెరపై మళ్లీ కనిపించరని కొన్ని పోస్టులు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మెడికవర్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ ప్రతాప్ రెడ్డి తాజాగా కీలక వివరాలు వెల్లడించారు.

డాక్టర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత కొంతకాలం ఐసీయూలో చికిత్స అందించినట్లు పేర్కొన్న ఆయన, ఇప్పటికే వారం రోజుల క్రితమే ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన చికిత్సకు చాలా బాగా స్పందిస్తున్నారని, మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు.
ప్రమాదంలో పండు మాస్టర్కు ఎలాంటి గాయాలు అయ్యాయనే విషయంపై కూడా వైద్యులు వివరించారు. ప్రమాద సమయంలో వాహనం కాళ్లపై నుంచి వెళ్లడంతో మోకాళ్ల కింది భాగంలో తీవ్రమైన ఫ్రాక్చర్లు ఏర్పడ్డాయని తెలిపారు. కుడి, ఎడమ కాళ్లకు రెండింటికీ గాయాలు అయ్యాయని, ముఖ్యంగా ఒక కాలుకు సంబంధించిన చర్మం తీవ్రంగా దెబ్బతినడంతో ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అదేవిధంగా ఎడమ కాలు హిప్ జాయింట్ కూడా డ్యామేజ్ కావడంతో తొలి రోజే ప్రత్యేక శస్త్రచికిత్స నిర్వహించి సమస్యను సరిచేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం రెండు కాళ్లకు సంబంధించిన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయని, ముఖ్యంగా ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేకపోవడం వైద్యులకు ఊరటనిచ్చే అంశమని డాక్టర్ తెలిపారు. పేషెంట్కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గించేందుకు అభిమానులను నేరుగా కలిసేందుకు అనుమతించడం లేదని చెప్పారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పరిశుభ్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
పండు మాస్టర్ పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే ప్రశ్నకు స్పందించిన డాక్టర్ ప్రతాప్ రెడ్డి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే సుమారు ఆరు నెలల్లో మంచి రికవరీ సాధించే అవకాశం ఉందన్నారు. అనంతరం మరో నాలుగు నుంచి ఐదు నెలల వ్యవధిలో నడవడం, ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం, డ్యాన్స్ ప్రాక్టీస్ ప్రారంభించడం సాధ్యమవుతుందని తెలిపారు. దీంతో పండు మాస్టర్ భవిష్యత్తులో మళ్లీ డ్యాన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని వైద్యులు స్పష్టం చేసినట్టయింది.
అయితే శారీరక చికిత్సతో పాటు మానసికంగా కూడా ధైర్యంగా ఉండటం చాలా ముఖ్యమని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు ఆయనలో ఆత్మవిశ్వాసం పెంచేలా మాట్లాడాలని, సానుకూల వాతావరణం కల్పించాలని కోరారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే పాజిటివ్ సందేశాలు, అభిమానుల ప్రేమాభిమానాలు ఆయన త్వరగా కోలుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
"పండు మాస్టర్ ఆరోగ్యం గురించి అతిగా భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. త్వరగా కోలుకుని మళ్లీ డాన్స్ స్టేజ్పై తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించాలని మేము కూడా కోరుకుంటున్నాం" అని డాక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. దీంతో పండు మాస్టర్ ఇక డ్యాన్స్ చేయలేరనే ప్రచారాలకు వైద్యుల తాజా ప్రకటనతో చెక్ పడినట్టైంది. మరోవైపు అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకుని మళ్లీ 'ఢీ' వేదికపై కనిపించాలని సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications






