నన్ను కించపరిచే అధికారం ఎవరిచ్చారు? జబర్థస్త్ కామెడీయన్ ఆవేదన
తెలుగు బుల్లితెరపై తన కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పటాస్ ప్రవీణ్ ( Patas Praveen).'పటాస్', 'జబర్దస్త్' వంటి షోల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ప్రవీణ్, శ్రీ దేవీ డ్రామా కంపెనీ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించాడు. అలాగే అతడు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. సినిమాల్లో చిన్న పాత్రలతో కూడా అలరిస్తున్నాడు ఈ కమెడియన్. ఇటీవల సింగిల్ లైఫ్ కు బై బై చెబుతూ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. ప్రముఖ నటి, డ్యాన్సర్ కడెం వంశిత తో ప్రవీణ్ వివాహం గ్రాండ్ గా జరిగింది. అయితే, తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న ప్రవీణ్ తనకు ఇండస్ట్రీలో జరిగిన అవమానం గురించి వెల్లడించారు.
తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న ప్రవీణ్, ఒక సీరియల్ షూటింగ్ సమయంలో ఎదురైన చేదు అనుభవాన్ని భావోద్వేగంగా పంచుకున్నాడు. తనకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎంతో గౌరవంగా ప్రవర్తించినప్పటికీ, కో-డైరెక్టర్ మాత్రం అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపాడు. "మొదట అవుట్డోర్ షూట్కు పిలిచారు. నేను సీరియల్స్లో కొత్తవాడినని ముందే చెప్పాను. అయినా సరే, నన్ను సరైన విధంగా గైడ్ చేయకుండా, అందరి ముందు అవమానించేలా మాట్లాడాడు" అని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు.

తాను చెప్పిన ప్రకారం, కో-డైరెక్టర్ ప్రవర్తన చాలా బాధాకరంగా అనిపించిందని, "కుర్చీలో కాళ్లు వేసుకుని కూర్చొని 'ఇలా రా, అలా రా' అంటూ కసురుకున్నాడు. కనీసం మనిషిగా కూడా గౌరవం ఇవ్వలేదు. నేను ఎవరినీ అడిగి ఇండస్ట్రీకి రాలేదు. నా ప్రతిభతోనే వచ్చాను. అలాంటి నన్ను పదిమంది ముందు కించపరచే హక్కు ఎవరికీ లేదు" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక సీరియల్ అనుభవం తనకు తక్కువ అని చెప్పినప్పుడు 'నీకు యాక్టింగ్ రాదా?" అంటూ ప్రశ్నించడం తనను తీవ్రంగా బాధపెట్టిందని తెలిపాడు. "ప్రతి రంగంలోకి వెళ్లినప్పుడు నేర్చుకోవాల్సిందే. నేను లైవ్ షోలు, కామెడీ ప్రోగ్రామ్లలో పనిచేశాను. సీరియల్ అనేది వేరే ఫార్మాట్. దానికి టైమ్ ఇవ్వాలి. కానీ అలా అవమానించేలా మాట్లాడటం సరికాదు" అని స్పష్టం చేశాడు.
ఇంకా షూటింగ్ సమయంలో ఎదురైన ఇబ్బందుల గురించి కూడా ప్రవీణ్ వివరించాడు. 'ఎండాకాలంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో బయట నిలబెట్టి పదిసార్లు టేక్ చేయించారు. అయినా నేను ఓపికగా చేశాను. ఎలా చేయాలో చెప్పడం వేరు, కానీ 'నీకు యాక్టింగ్ రాదా?' అంటూ మాట్లాడటం వేరు. అది చాలా బాధించింది' అని ఎమోషనల్ అయ్యాడు.
ఈ ఘటన తర్వాత వెంటనే ఆ ప్రాజెక్ట్ను వదిలేసి వెళ్లిపోయినట్లు ఆయన వెల్లడించాడు. "నలుగురి ముందు అవమానించి మళ్లీ నటించమంటే ఏ ఆర్టిస్ట్ అయినా చేయలేడు. గౌరవం లేని చోట పని చేయడం కష్టం" అని తేల్చి చెప్పాడు. తాను ఇలా బయటపెట్టడానికి కారణం, తర్వాత ఎవరైనా తప్పుడు ప్రచారం చేయకుండా ముందుగానే నిజం చెప్పాలనే ఉద్దేశమని పేర్కొన్నాడు.
ఇక ఇండస్ట్రీలో ఇతర దర్శకులతో తన అనుభవం గురించి మాట్లాడుతూ, "నేను చేసిన సినిమాల్లో, షోలలో ఎవ్వరూ ఇలా ప్రవర్తించలేదు. వాళ్లు ఎప్పుడూ క్యారెక్టర్ను అర్థం చేసుకుని నటించమని ప్రోత్సహించారు. గౌరవం ఇచ్చారు" అని గుర్తుచేసుకున్నాడు. ప్రవీణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్టిస్టులకు గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమో, కొత్తవారిని ఎలా ప్రోత్సహించాలో అనే అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. పలువురు నెటిజన్స్ ప్రవీణ్కు మద్దతుగా నిలుస్తున్నారు.


Click it and Unblock the Notifications





