BB Jodi: ఆ ముగ్గురితో అంత ఈజీ కాదు.. జడ్జెస్ తీరుపై మణికంఠ, పింకి కామెంట్స్..
బిగ్బాస్ సీజన్ 9 ముగిసిన వెంటనే అదే టైమ్స్లాట్లో ప్రారంభమైన బీబీ జోడీ 2 రోజురోజుకీ మంచి ఆదరణ పొందుతోంది. బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్లు జోడీలుగా మారి డాన్స్ పోటీలో పాల్గొంటుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ షోకు శేఖర్ మాస్టర్, సదా, శ్రీదేవి విజయ్కుమార్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కంటెస్టెంట్లు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఈ షోలో పాల్గొంటున్న బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్లు పింకీ, మణికంఠ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, బీబీ జోడీ 2లో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా జడ్జీలపై వారు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?
ఇంటర్వ్యూలో మొదట మణికంఠ మాట్లాడుతూ.. పింకీని ఓపెన్గా ప్రశంసించాడు. 'పింకీ చాలా టాలెంటెడ్. ఒకసారి చూపిస్తే ఇట్టే డాన్స్ చేసేస్తుంది' అంటూ ఆమె డాన్స్ స్కిల్స్ను మెచ్చుకున్నాడు. తాను మాత్రం స్లో లెర్నర్నని, బయట ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటానని చెప్పాడు. పోటీ సమయంలో ఇద్దరం ఒకరినొకరు బాగా సపోర్ట్ చేసుకుంటామని, పింకీ తనకు చాలా సహకారం అందిస్తుందని కాస్త ఫన్నీగా వివరించాడు. ఈ మాటలు వినేవారికి ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ స్పష్టంగా కనిపించింది.

ఇక పింకీ తన అనుభవాలను పంచుకుంటూ... ఇటీవల తనకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయని వెల్లడించింది. గతంలోలా గంటల తరబడి ప్రాక్టీస్ చేయలేకపోతున్నానని చెప్పిన ఆమె, అయినప్పటికీ ఉన్న సమయంలోనే 100 శాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపింది. ఈ మాటలు ఆమెపై అభిమానాన్ని మరింత పెంచాయి.
అదే సమయంలో యాంకర్ జడ్జీల సపోర్ట్ ఎలా ఉందని ప్రశ్నించగా... పింకీ చాలా పాజిటివ్గా స్పందించింది. 'శేఖర్ మాస్టర్, సదా మేడం, శ్రీదేవి మేడం చాలా టాలెంటెడ్. ఆ ముగ్గుర్ని ఇంప్రెస్ చేయడం అంతా ఈజీ కాదు. అయితే.. మనం ఎంత కష్టపడుతున్నామో వారికి బాగా తెలుసు. వాళ్ల నుంచి మాకు మంచి ప్రోత్సాహం లభిస్తోంది' అని చెప్పింది. డాన్స్ రాకపోయినా తమను చాలా గౌరవంగా, ప్రోత్సాహకరంగా ట్రీట్ చేస్తున్నారని పేర్కొంది. 'మేమిద్దరం డాన్సర్లు కాదని మాకు తెలుసు. అయినా కూడా జడ్జీల సపోర్ట్ వల్లే మేము ఇక్కడివరకు వచ్చాం' అంటూ కృతజ్ఞత వ్యక్తం చేసింది.
మణికంఠ కూడా జడ్జీల తీరు గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 'డాన్స్ వచ్చినవాళ్లను ఎలా ట్రీట్ చేయాలో, రానివాళ్లను ఎలా ప్రోత్సహించాలో జడ్జీలకు బాగా తెలుసు' అని చెప్పాడు. ఉదాహరణగా... ఎల్కేజీ స్టూడెంట్ను ఎలా నేర్పించాలో అలా, టెన్త్ క్లాస్ స్టూడెంట్ను ఎలా గైడ్ చేయాలో అలా కంటెస్టెంట్లను ట్రీట్ చేస్తున్నారని వివరించాడు. ప్రతి చిన్న మిస్టేక్ను డీటెయిల్గా చెప్పి, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో జడ్జీలు వివరించడం చాలా హెల్ప్ అవుతోందని అన్నాడు.
ఇక వీరిద్దరూ చేసిన కథాకళి పర్ఫార్మెన్స్ మధ్యలో ఆగిపోయిన విషయం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ పెర్ఫార్మెన్స్ మిడ్నైట్ షూట్ అని, అప్పటికి తాను తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నానని పింకీ తెలిపింది. తాను ధరించిన కాస్ట్యూమ్స్ బరువు దాదాపు 15 నుంచి 20 కిలోల వరకు ఉంటుందని, అవి మోయలేక చాలా ఇబ్బంది పడ్డానని చెప్పింది. డాన్స్ ముందు తినకూడదన్న ఉద్దేశంతో ఏమీ తినకుండా పర్ఫార్మ్ చేయడం వల్ల చివరి క్షణంలో డాన్స్ ఆపేయాల్సి వచ్చిందని తన ఆవేదనను వ్యక్తం చేసింది.
మణికంఠ కూడా కాస్ట్యూమ్స్ చాలా హెవీగా ఉన్నాయని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు షోకు మరింత పాపులారిటీ తెస్తున్నాయి. ఈ చర్చలన్నీ షోపై ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications











