రసవత్తరంగా ‘రాధాకళ్యాణం’ సీరియల్

జీ టీవీ ప్రతినిధి మాట్లాడుతూ...''తల్లి రాధ, తండ్రి వంశీని కలపాలనే ఆశయంతో రాక్షసుడులాంటి ఈశ్వర్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది అపర్ణ. మరోవైపు అపర్ణే ప్రాణంగా బతుకుతున్న మహేష్... రుక్కు వేసిన ప్లాన్లో ఇరుక్కుని, మనసు చంపుకుని ఆమె కూతురి మెడలో తాళి కట్టడానికి రెడీ అవుతాడు. ఈ రెండు జంటల పెళ్లిళ్లల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి? తద్వారా అపర్ణ, మహేష్ల జీవితాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయి? అనేవి ఆసక్తికరంగా ఉంటాయి'' అని చెప్పారు.
కాన్సెప్టు విషయానికి వస్తే..భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో మహోన్నతమైనది. సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే వివాహ వ్యవస్థ ఎంతో ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంది. అగ్నిసాక్షిగా వేసే మూడు మూళ్లు.. ఏడడుగులే నూరేళ్ల జీవితాన్ని పండిస్తాయన్న బలమైన నమ్మకమే మన వివాహ వ్యవస్థకు ఉన్నతమైన ఉదాహరణ. అలాంటి వివాహ వ్యవస్థకి పసుపు తాడుతో పరిచయమైన ఓ పడుచు పిల్లే రాధ.
రాధ ఓ పేదింటి అమ్మాయి. అందం, అమాయకత్వమే ఆమెకు అలంకారాలు. అందరి అమ్మాయిల్లాగే ఆమె కూడా కన్నవాళ్ల కష్టాలు తీర్చాలనుకుంటుంది. వాళ్ల కన్నీళ్లు తుడవాలనుకుంటుంది. బాగా చదువుకుని వాళ్లకు అన్నీ తానై అండగా నిలవాలని కోరుకుంటుంది. అయితే రాధ ఆశలను, ఆశయాలను ఏ మాత్రం పట్టించుకోని తల్లిదండ్రులు.. ఆమెకి సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసి సాగనంపాలని నిర్ణయించుకుంటారు.అలాంటి పరిస్థితుల్లో రాధ ఏం చేస్తుంది? ఆమె కలలు ఫలిస్తాయా? ఆమె ఆశయం నెరవేరుతుందా?ఆమె పెళ్లికి తల్లిదండ్రులు అంతగా కంగారు పడటానికి గల కారణాలేంటి? వాళ్లు తీసుకున్న ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని ఎలా శాసిస్తుంది? ఇలా ఎన్నో అనూహ్యమైన మలుపులతో ఆశ్చర్యచకితులను చేసే సన్నివేశాలతో ఆద్యంతం హృద్యంగా సాగిపోయే అపురూప ధారావాహిక 'రాధా కళ్యాణం'. 'రాధాకళ్యాణం'. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 8.30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్కు విశేష ప్రజాదరణ లభిస్తోందని జీ టీవీ ప్రతినిధి తెలిపారు.


Click it and Unblock the Notifications











