అందుకే నేను నోరు విప్పా : కె. రాఘవేంద్రరావు వివరణ
హైదరాబాద్: 'పదిమందికి ఉపయోగపడితేనే మాట్లాడాలనుకొనే స్వభావం నాది. స్వర్ణోత్సవం పేరుతో నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలనుకోలేదు. నా అనుభవాలన్నీ అందులో ఉండాలనుకొన్నా. అన్నిరకాల సినిమాలు చేశాను కాబట్టి వాటి కోసం పడిన తపన ఎలాంటిదో చెబితే కొత్తగా పరిశ్రమలోకి వచ్చే వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తుందనుకున్నా' అన్నారు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.
మౌనమునిగా పేరు తెచ్చుకొన్నారు దర్శకుడు కె.రాఘవేంద్రరావు. వందకిపైగా సినిమాలు చేసిన ఆయన ఎప్పుడూ వేదికలపై మాట్లాడలేదు. నాలుగు దశాబ్దాలుగా తనదైన మౌనముద్రతోనే పనిచేసుకొంటూ వస్తున్నారు. ఈటీవీ 'సౌందర్యలహరి'తో తొలిసారి ఆయన మౌనం వీడారు. తన మనసులోని అనుభవాల దొంతరను కదిపారు. ప్రతి వారం రాఘవేంద్రుడి సినీ స్వర్ణోత్సవ ముచ్చట్ల కోసం ఎదురు చూస్తూ బుల్లితెర ముందు కూర్చూంటున్నారు ప్రేక్షకులు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు

అలాగే... 'సౌందర్యలహరి'లో నేను పంచుకున్న అనుభవాలు పదిమందికి ఎంతో కొంత స్ఫూర్తినిచ్చినా నా సంకల్పం నెరవేరినట్టే. ఈ కార్యక్రమం కోసం ఈటీవీ ఎంతో పరిశోధన చేసిందిదశాబ్దాల కిందట తీసిన సినిమాల గురించి 'సౌందర్యలహరి'కార్యక్రమంలో క్షుణ్నంగా చర్చించాం. వాటిలో నాక్కొన్ని గుర్తున్నాయి.
మరికొన్ని విషయాల్ని నాతో పని చేసినవాళ్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమం కోసం నాతో కలసి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందించిన సహకారం ఎప్పటికీ మరిచిపోలేను. పిలవగానే వచ్చి వాళ్ల విలువైన అనుభవాల్ని నాతో కలిసి పంచుకొన్నారు. చరిత్ర చెబుతున్నప్పుడు కల్పితాలు ఉండకూడదు. అందుకే ఎంతో జాగ్రత్త వహించి కార్యక్రమాన్ని చేశాం.
ఇక 'సౌందర్యలహరి' ఏడాదిపాటు కొనసాగుతుందని అస్సలు అనుకోలేదు. మొదట ఇది ఎవరికి అవసరమవుతుందనుకొన్నాం. ఎప్పుడు ఆదరణ తగ్గుతున్నట్టు అనిపిస్తే అప్పుడు ఆపేద్దామనుకొన్నాం. చక్కటి ఆదరణతో కొనసాగుతూనే ఉంది. ఈ ప్రయాణంలో గత స్మృతులెన్నో నా కళ్లముందు మరోసారి మెదిలాయి అని చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు గారు.

నా సినీ ప్రయాణంలో స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని ఏడాది కాలంగా ఈటీవీలో 'సౌందర్యలహరి' కార్యక్రమం కొనసాగుతోంది. అది చివరిదశకు చేరుకుంటోంది. అందుకే స్వామి దగ్గరికెళ్లి తలనీలాలు సమర్పించుకొన్నా. ఇంకా దర్శనం చేసుకోలేదు. అప్పుడే నేను తితిదే బోర్డు మెంబర్గా ఎంపికైనట్టు సమాచారం అందింది. ఆ క్షణంలో నేను పొందిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. కాకతాళీయంగా 'సౌందర్యలహరి'లో ఈ వారమే 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' బృందంతో చర్చ ప్రసారమవుతోంది. ఇదంతా భగవత్సంకల్పమే అని నమ్ముతున్నా.
భక్తితోనే 'సౌందర్యలహరి' కార్యక్రమాన్ని ముగించాలనుకొన్నా. నాలుగు నెలలకిందే చిత్రీకరణ పూర్తయింది. ఆ ఎపిసోడ్స్ సరిగ్గా ఈ సమయంలోనే వస్తున్నాయి. నాగార్జున, స్నేహ, అర్చన, సుమన్, బ్రహ్మానందం, రచయిత భారవితోపాటు ప్రస్తుతం నాగార్జునతో సినిమా తీస్తున్న దర్శకుడు వంశీ పైడిపల్లి ఆ ఎపిసోడ్స్లో పాల్గొన్నారు.
దేవుడి సినిమాలు తీస్తున్నప్పుడు కష్టాలు ఎదురవుతాయని అంటుంటారు. ఆ విషయాలన్నీ 'సౌందర్యలహరి'లో చివరి ఎపిసోడ్లలో ఉంటాయి. సాంఘిక చిత్రం తీయడంతో పోలిస్తే, భక్తి సినిమా చేస్తున్నప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదురవుతుంటాయి? వాటిని ఎలా అధిగమించాల్సి ఉంటుందనే విషయాలు మా అనుభవాల రూపంలో చెప్పాం. అవన్నీ నవతరానికి పాఠంలా ఉంటాయి అని ముగించారు ఆయన.
స్వతహాగా వెంకటేశ్వరస్వామికి అపర భక్తుడైన రాఘవేంద్రరావు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఇటీవల నియమితులయ్యారు. అదే సమయంలో 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' అనుభవాలతో 'సౌందర్యలహరి' ప్రసారమవుతోంది. ఆదివారం 9:30కి 'ఈటీవీ'లో ఆయా చిత్రబృందాలతో కలసి రాఘవేంద్రరావు తన అనుభవాల్ని పంచుకొంటున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందిచారు.


Click it and Unblock the Notifications











