ఆర్య-2, మిర్చి, వూసరవెల్లి సంతృప్తి ఇచ్చాయి
కడియం : ఈ.టి.విలో 'ఢీ' వంటి డ్యాన్స్ రియాల్టీషోలు ఔత్సాహిక కొరియాగ్రాఫర్లకు వరాల వంటివని ప్రముఖ నృత్యదర్శకుడు, స్త్టెలిష్ కొరియాగ్రాఫర్ రాఘవేంద్ర (రఘుమాస్టర్) పేర్కొన్నారు. 'ఓరి దేవుడోయ్' సినిమా షూటింగ్ నిమిత్తం కడియంలోని పల్ల వెంకన్న నర్సరీకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ.టి.వి.లో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 'ఢీ-3' లో విజేతగా టైటిల్ అందుకోవడం తన జీవితంలో మరచిపోలేని అనుభూతిగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం ప్రతిభ ఉన్న నృత్య దర్శకులకు సినిమా రంగంలో అవకాశాలు పెరిగాయని, అందుకు తానే నిదర్శనమన్నారు.
అతి తక్కువ సమయంలో తెలుగు సినిమారంగంలోని ప్రముఖ హీరోలందరితో పనిచేసే అవకాశం దక్కిందని, ముఖ్యంగా ఆర్య-2, మిర్చి, వూసరవెల్లి, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లోని పాటలు కొరియా గ్రాఫర్గా తనకు సంతృప్తినిచ్చాయని చెప్పారు. ఒక సినిమాకు సంబంధించి అన్ని పాటలకు గతంలో ఒకరే నృత్యాలు సమకూర్చేవారని, మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని పాటలు కొందరు నృత్యదర్శకులు బాగా చేయగలరనే ముద్ర పడటంతో ఒక్కో పాటకు ఒక్కో నృత్య దర్శకుడు పనిచేసే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందని వివరించారు. దీనివల్ల ఎక్కువ సినిమాలకు పనిచేశామనే తృప్తి ఉంటుంది తప్ప ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉంటుందన్నారు.

ఇటీవల తక్కువ సమయంలో ఎక్కువ సినిమాల నిర్మాణాలు జరుగుతుండటంతో అవకాశాలు బాగానే ఉంటున్నాయని తెలిపారు. తాను సమకూర్చే నృత్యాలు సెమీ క్లాసికల్గా ఉంటూ కమర్షియల్ లుక్తో ఉండేలా తెరకెక్కిస్తూ విజయవంత మయ్యానని, అదే తన విజయసూత్రమన్నారు. పలు రాష్ట్రాల్లో ఆడవారు నృత్యదర్శకులుగా ఇప్పటికీ రాణించడానికి కారణం వారింకా డ్యాన్స్లో ప్రత్యేక మెలకువలు అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లడమేనన్నారు. రాష్ట్రంలో గతంలో మహిళా నృత్యదర్శకులున్నా ప్రస్తుతం వారికిలాగా చిత్తశుద్ధితో నృత్యాన్ని అందిపుచ్చుకుని రాణించే సత్తా కరవైందన్నారు.
'ఓరి దేవుడోయ్' చిత్రంలో మూడు పాటల చిత్రీకరణ పూర్తయిందని, ఎలాంటి అలసట లేకుండా ఇక్కడి వాతావరణంలో చేయగలగడంపై ఆనందం వ్యక్తం చేశారు. గతంలో సిద్ధార్థ హీరోగా నటించిన 'బావ' చిత్ర గీతాలను ఈ ప్రాంతంలోనే తెరకెక్కించామన్నారు. జిల్లా అందాలు అద్భుతమని, రాయలసీమకు చెందిన తాను ఆహ్లాదకరమైన ఈ జిల్లాలోనే స్థిరపడతానని చెప్పారు.
జనవరిలో తాను హీరోగా ప్రముఖ బ్యానర్లో డ్యాన్స్తో కూడిన ప్రేమ కథాచిత్రం ప్రారంభం కానున్నందున 'ఓరి దేవుడోయ్' చిత్రం అనంతరం నృత్య దర్శకత్వానికి కొంతకాలం దూరంగా ఉంటున్నానన్నారు. సోషియా ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఆ చిత్రంలోని ఆరు పాటలకు తానే నృత్య దర్శకత్వం వహిస్తున్నానని రఘు తెలిపారు.


Click it and Unblock the Notifications











