సుధీర్తో రష్మీ గౌతమ్ బ్రేకప్? పేరు పలకడానికి ఇష్టపడని జబర్దస్త్ యాంకర్
తెలుగు బుల్లితెరపై అత్యంత పాపులర్ జోడీల్లో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ ఒకటి. వీరిద్దరూ కలిసి ఎన్నో షోలు, స్కిట్లు చేశారు. వీరిద్దరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ ఒకప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'జబర్దస్త్' కామెడీ షోలో వీరి మధ్య చూపించిన రొమాంటిక్ ట్రాక్ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేమ ప్రపోజల్స్, ఎంగేజ్మెంట్ సన్నివేశాలు, పెళ్లి వరకు వెళ్లే ఎపిసోడ్లు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. అయితే అవన్నీ షోలో భాగంగానే చేశామని ఇద్దరూ పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
అయినా కూడా అభిమానులు మాత్రం వీరిద్దరూ నిజ జీవితంలో కూడా ప్రేమించుకుంటున్నారనే నమ్ముతుంటారు. సోషల్ మీడియాలోనూ ఈ జంటకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. ఇద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోవాలని అభిమానులు ఎన్నోసార్లు ఆకాంక్షించారు. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. సినిమాల్లో అవకాశాలు రావడంతో సుడిగాలి సుధీర్ 'జబర్దస్త్'కు దూరమయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకే వేదికపై కనిపించే సందర్భాలు కూడా చాలా అరుదుగా మారాయి. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా 'టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్' షో ప్రమోషన్స్లో పాల్గొన్న రష్మీ గౌతమ్కు మరోసారి సుధీర్ గురించి ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్.. "మీరు సుడిగాలి సుధీర్తో కలిసి ఎన్నో షోలు చేశారు. కానీ ఈ ఈవెంట్లో నిర్వహించిన గేమ్లో ఆయన పేరు కూడా చెప్పలేదు. అందుకు ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? గొడవ జరిగిందా? " అని ప్రశ్నించారు.
దానికి స్పందించిన రష్మీ గౌతమ్ నవ్వుతూ.. "ఇష్టపడకపోవడం అంటూ ఏమీ లేదు. మేము ఇక్కడ 'టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్' షోని ప్రమోట్ చేయడానికి వచ్చాం. మమ్మల్ని గానీ, ఒక వ్యక్తిని గానీ ప్రమోట్ చేయడానికి రాలేదు. ఆ గేమ్లో ప్రేక్షకులను నవ్వించడానికి ఒక ఎలిమెంట్ చేశాం. అంతే తప్ప ఎవరి పేరు చెప్పకపోవడంలో ఎలాంటి ఉద్దేశం లేదు" అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో సుధీర్ పేరు ఉద్దేశపూర్వకంగా దాటవేసిందనే ప్రచారానికి ఆమె సమాధానం చెక్ పెట్టినట్టైంది.
అయితే ఈ ప్రశ్న వద్దే ప్రెస్మీట్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రష్మీ సమాధానం ముగియగానే నటి మంచు లక్ష్మీ మైక్ తీసుకుని మీడియాపై తనదైన శైలిలో స్పందించారు. "జోక్ను జోక్లాగే తీసుకుంటే బాగుంటుంది. అదే విషయాన్ని పదే పదే లాగితే అది జోక్ కాదు. ఈ ప్రశ్నను మళ్లీ మళ్లీ అడిగి మీకే బోర్ కొట్టలేదా? అసలు ఈ షోకి సంబంధం లేని ప్రశ్న ఇది. కేవలం క్లిక్బైట్ కోసం ప్రశ్నలు అడిగితే, వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపై లేదు. రష్మీ ఇబ్బంది పడొచ్చు కానీ నేను మాత్రం నేరుగా చెబుతున్నా. ఇకనైనా షోకు సంబంధించిన ఆసక్తికరమైన ప్రశ్నలు అడగండి" అంటూ సెటైరికల్గా వ్యాఖ్యానించారు.
మంచు లక్ష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు రష్మీ తన సమాధానంతో సుధీర్పై వస్తున్న ఊహాగానాలను ఖండించగా, మరోవైపు మంచు లక్ష్మీ మీడియా ప్రశ్నల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. అయితే రష్మీ ఎక్కడా సుధీర్తో విభేదాలు ఉన్నాయని లేదా బ్రేకప్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే రష్మీ-సుధీర్ జోడీకి ఉన్న క్రేజ్ మాత్రం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.


Click it and Unblock the Notifications




