23 ఏళ్లుగా ఆ హీరోతో డేటింగ్... 41 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన హీరోయిన్
ఇష్టమైన వ్యక్తిని పెళ్లాడటం అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ప్రేమలో పడటమే కాదు.. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చిన వారే నిజమైన విజేతలు. చిత్ర పరిశ్రమలోనూ ఎందరో నటీనటులు ప్రేమలో పడ్డారు, విడిపోయారు, ఒక్కటయ్యారు. ఏళ్లపాటు ప్రేమాయణం సాగించి దారులు వేరయిన వారూ ఉన్నారు. అయితే ఏకంగా 23 ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించి చివరికి 41 ఏళ్ల వయసులో మనసిచ్చిన వాడిని పెళ్లాడింది ఓ నటి. ఆ నటి ఎవరు? ఎందుకు 23 ఏళ్ల పాటు పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..
మోడలింగ్ నుంచి నటిగా
ఆశ్లేష సావంత్.. హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో పాపులర్ నటి. 1984లో పూణేలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ గ్రాడ్యుయేషన్ చేశారు. అయితే 12వ తరగతిలో ఉన్నప్పుడే మోడలింగ్లోకి దిగి.. స్థానికంగా జరిగిన మోడలింగ్ పోటీలలో పాల్గొన్నారు ఆశ్లేష. ఈ దశలో బాలాజీ టెలి ఫిల్మ్స్ నిర్మిస్తోన్న క్యా హద్సా క్యా హకీఖత్ అనే సీరియల్ కోసం ఆడిషన్స్కు హాజరై అవకాశం దక్కించుకున్నారు. అయితే ఈ సీరియల్ వెంటనే సెట్స్ మీదకు వెళ్లలేదు. కసౌటీ జిందగీ కే అనే సీరియల్లో ఓ చిన్న రోల్లో ఆశ్లేష నటించారు. ఈ క్రమంలో బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత ఏక్తా కపూర్.. క్యూంకీ సాస్ బీ కబీ బాహు థి అనే సీరియల్లో అవకాశం కోసం ఆశ్లేషను సంప్రదించారు.

23 ఏళ్లుగా బుల్లితెర క్వీన్గా
ఈ సీరియల్లో తీషా మెహతా విరాణీగా ఆశ్లేష నటన కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్యార్ కా దార్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా, కుంకుమ భాగ్య, అనుపమ తదితర సీరియల్స్తో హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్గా వెలుగొందింది. 2022లో హర్యానా అనే సినిమాలోనూ నటించారు. దాదాపు 23 ఏళ్ల కెరీర్లో పలు సీరియల్స్, ప్రోగ్రామ్లలో అలరించారు ఆశ్లేష.
సందీప్ బస్వానాతో ప్రేమాయణం
కాగా.. 23 ఏళ్ల క్రితం క్యూంకీ సాస్ బీ కబీ బాహు థి సీరియల్లో తనతో కలిసి నటించిన సందీప్ బస్వానాతో ఆశ్లేష ప్రేమలో పడ్డారు. హర్యానాలోని హిసార్కు చెందిన సందీప్ కూడా ఇంచుమించుగా ఆశ్లేషతో పాటే కెరీర్ ప్రారంభించారు. కుచ్ జూహీ పాల్కయిన్, కోయి దిల్ మే హై, క్యూంకీ సాస్ బీ కబీ బాహు థి తదితర సీరియల్స్ ఆయనకు పాపులారిటీ తెచ్చిపెట్టాయి. హిట్లర్ దీదీ, ఉదాన్, దిల్ దియాన్ గల్లాన్ సీరియల్స్లో సందీప్ పోషించిన మున్నా, ఈశ్వర్ రావత్, డాక్టర్ మాన్ సింగ్ పాత్రలు ప్రజల్లో చెరగని ముద్ర వేశాయి.
23 ఏళ్ల సహజీవనానికి తెర
దాదాపు 23 ఏళ్లుగా సందీప్ బస్వానా, ఆశ్లేషా సావంత్లు డేటింగ్ చేస్తున్నారు. ఇన్నేళ్లయినా ఇద్దరి మధ్యా బంధం మరింత బలోపేతమైందే కానీ, ఎలాంటి సమస్యలు రాలేదు. తాజాగా వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. నవంబర్ 16న బృందావనంలోని చంద్రోదయ ఆలయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సందీప్ - ఆశ్లేషల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో వీరిద్దరూ బృందావన్కి వెళ్లినప్పుడే బుల్లితెర వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఇక్కడి రాధా- కృష్ణ ఆలయాలతో తమకు లోతైన ఆధ్మాత్మిక బంధం ఉందని సందీప్ పలుమార్లు తెలిపారు. తన జీవితంలో ప్రేమను వివాహంగా మార్చుకోవడానికి ఇదే సరైన ప్రదేశమని ఆశ్లేష సైతం వ్యాఖ్యానించారు. 23 ఏళ్ల తర్వాత వీరిద్దరూ పెళ్లితో ఒక్కటి కావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











