అలాంటి వారితో పెళ్లి? జీవితాంతం బాధే..సీరియల్ నటి ఎమోషనల్!
లహరి.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. టీవీ సీరియల్స్లో చక్కటి చీరకట్టుతో సంప్రదాయ బద్దంగా కనిపించే ఈ అందాల తారకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లహరి, చక్రవాకం, మొగలిరేకులు, ముద్దుబిడ్డ, ఇంటింటి గృహలక్ష్మి వంటి సూపర్ హిట్ సీరియల్స్తో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ప్రస్తుతం యాక్టింగ్కు బ్రేక్ ఇచ్చిన ఈ బుల్లితెర నటి, స్క్రీన్పై కాస్త తక్కువగా కనిపిస్తున్నా... సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన డైలీ లైఫ్, ఫ్యామిలీ మూమెంట్స్, పర్సనల్ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్లోనే ఉంటున్నారు.
ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న లహరి తన వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. జీవితం గురించి మాట్లాడిన లహరి... 'జీవితం మనకు ఎప్పుడూ పాఠాలు చెబుతూనే ఉంటుంది. మనకు ఎదురయ్యే ప్రతి సంఘటనను గుణపాఠంగా తీసుకుంటేనే మనం స్ట్రాంగ్ అవుతాం' అని చెప్పింది. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంటుందని, మనం చేసిన తప్పులను అంగీకరించడమే మన ఎదుగుదలకు మొదటి అడుగు అని ఆమె పేర్కొంది.

తల్లిదండ్రుల గురించి అడిగినప్పుడు లహరి చాలా భావోద్వేగంగా స్పందించింది. 'మనం కొంత ఏజ్ వచ్చిన తర్వాతే తల్లిదండ్రుల విలువ అర్థమవుతుంది. చిన్నప్పుడు వాళ్లు చెప్పిన మాటలు అర్థం కావు. కానీ జీవితం కొంత దెబ్బలు తగిలిన తర్వాత... వాళ్లు చెప్పిందే నిజమని తెలుసుకుంటాం. మనం చేసిన తప్పులను ఒప్పుకుని 'సారీ' చెప్పగానే... వాళ్లు మనల్ని మరింత ప్రేమిస్తారు' అంటూ చెప్పింది.
ఇక అత్త-కోడలు సంబంధంపై ఆమె చేసిన కామెంట్స్ మాత్రం నెట్లో వైరల్ అవుతున్నాయి. చాలామంది "కోడల్ని కూతురు లాగా చూడాలి" అంటారని... కానీ నిజంగా అది జరుగుతుందా అని ప్రశ్నించగా, లహరి కాస్త స్ట్రైట్గా స్పందించింది. "అది మాటల్లో బాగానే ఉంటుంది కానీ ప్రాక్టికల్గా అస్సలు జరగదు. కూతురిని చూసినట్టు కోడల్ని చూడటం చాలా అరుదు... చాలా వరకు అది ఇంపాజిబుల్" అంటూ నిర్మొహమాటంగా చెప్పింది.
ఆమె మాటల్లోనే... "ఇంట్లో ఆలుమగల మధ్య గొడవ జరిగితే... మధ్యలోకి అత్త వస్తుంది. అక్కడ కొడుకు తప్పు ఉన్నా... కోడలినే ప్రశ్నిస్తారు. 'నా కొడుకును ఎందుకు అలా అన్నావ్?' అంటూ కోడలినే తప్పుపడతారు. ఆ సమయంలో కోడలే అన్ని భరించాల్సి వస్తుంది" అని చెప్పింది. ఈ కామెంట్స్ చాలా మంది మహిళలు ఫుల్గా రిలేట్ అవుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
మరింతగా, పెళ్లైన కొత్తలో భార్యాభర్తలకు ఫ్రీడమ్ చాలా అవసరమని లహరి చెప్పింది. "మొగుడు పెళ్లాలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. ఒక పూట గొడవ పడితే... మరో పూట వాళ్లే సర్దుకుపోతారు. కానీ మధ్యలో అత్తమామలు జోక్యం చేసుకుంటే... చిన్న గొడవ పెద్దదైపోతుంది" అని వివరించింది. కుటుంబంలో పెద్దలు సపోర్ట్ చేయాలి కానీ జోక్యం చేయకూడదని ఆమె అభిప్రాయం.
తన పర్సనల్ లైఫ్ గురించి కూడా లహరి ఓపెన్గా మాట్లాడింది. "నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. పెళ్లయిన కొత్తలో అత్తవారి ఇంట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ రోజులు గుర్తొస్తే ఇప్పటికీ బాధేస్తుంది. అది నా జీవితంలో చాలా కఠినమైన ఫేజ్" అంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం మాత్రం సెపరేట్గా ఉండటం వల్ల మానసికంగా కాస్త రిలీఫ్ దొరికిందని చెప్పింది.
జాయింట్ ఫ్యామిలీ గురించి అడిగిన ప్రశ్నకు లహరి ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తికరంగా ఉంది. "నేను జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఇంట్లో ఎప్పుడూ కలసి ఉండే వాతావరణం ఉండేది. ఫంక్షన్స్, గెట్స్ టుగెదర్స్ అన్నీ జరిగేవి. అదే వాతావరణం నాకు అత్తింట్లో కూడా ఉంటుందని అనుకున్నా... కానీ అలా జరగలేదు" అని చెప్పింది. "నేను ఫ్రీగా తిరిగే పక్షిలా ఉండేదాన్ని... కానీ ఒక్కసారిగా పంజరంలో పెట్టినట్లు అనిపించింది. ఇంట్లో వాళ్లు మన మాట వినకపోతే... మనం చెప్పుకునే వాళ్లే ఉండరు. చివరకు నా మాటే తప్పు అని అనిపించే పరిస్థితి వచ్చింది. అక్కడ నేను ఉన్నా... లేనట్లే అనిపించేది" అంటూ తన బాధను వ్యక్తం చేసింది.
చివరిగా పెళ్లి చేసుకునే వారికి ఆమె కొన్ని సలహాలు కూడా ఇచ్చింది. "ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు జీవితంపై క్లారిటీ ఉండాలి. ఎవరితో జీవితం మొదలుపెడుతున్నామో అర్థం చేసుకోవాలి. మమ్మీ బాయ్స్ అయితే అస్సలు పెళ్లి చేసుకోకూడదు. అలాంటి వారిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది" అంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది. అలాగే పిల్లల విషయంలో కూడా ముందుగానే ప్లానింగ్ ఉండాలని ఆమె సూచించింది. "పిల్లల్ని కనడం ఒక పెద్ద బాధ్యత. మనం మెంటల్గా, ఎమోషనల్గా రెడీగా ఉన్నప్పుడు మాత్రమే ఆ నిర్ణయం తీసుకోవాలి" అని చెప్పింది.


Click it and Unblock the Notifications






