ఇలా జనాన్ని ఫూల్స్ చేస్తున్నారు.. షోలో లేని కీరవాణి సార్ వీడియోలో ఎలా.. సింగర్ ప్రవస్తి
దిగ్గజ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దాదాపు 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన పాడుతా తీయగా అనే కార్యక్రమం గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్థాలుగా ఈ కార్యక్రమం ఎదురులేకుండా సాగుతూ వస్తోంది. కుప్పిగంతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతు కంటెంట్, అశ్లీలత నిండిన రియాలిటీ షోల మధ్యలో క్లీన్గా.. ఇంటిల్లిపాది చూసే చక్కని కార్యక్రమంగా పాడుతా తీయగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా ఎందరో ప్రతిభావంతులైన గాయనీ గాయకులు వెలుగులోకి వచ్చి సినిమాలలో బిజీ అయ్యారు.
తెలుగు వారి ఫేవరెట్ ప్రోగ్రామ్గా
ఈ కార్యక్రమం చూస్తూ పెరిగిన వారు తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో ఈ కార్యక్రం చూస్తూ నాటి గుర్తులను నెమరు వేసుకుంటున్నారు. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఏ మూలన ఉన్నా ఖచ్చితంగా ఈ షో చూస్తారు. యూట్యూబ్, ఓటీటీల రాకతో పాత ఎపిసోడ్స్ చూసే అవకాశం రావడంతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇంతటి ప్రతిష్ట ఉన్న ఈ కార్యక్రమం ఇటీవల వివాదంలో చిక్కుకుంది. షో నిర్వహణ సరిగా లేదంటూ ప్రవస్తి అనే ఓ అమ్మాయి ఆరోపించింది. అలాగే నిర్వాహకులపై, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వారిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా సింగర్ ప్రవస్తి మరో వీడియోను షేర్ చేసి కలకలం రేపింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఎక్స్పోజింగ్ చేయమన్నారు
బాలసుబ్రహ్మణ్యం మరణించిన తర్వాత ఈ కార్యక్రమానికి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ హోస్ట్గా .. సునీత, చంద్రబోస్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన సిల్వర్ జూబ్లీ సిరీస్కు సంగీత దర్శకుడు కీరవాణి హాజరయ్యారు. ఈ షోపై సింగర్ ప్రవశ్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్న తనను ఎలిమినేట్ చేయడంపై భగ్గుమన్నారు. రికమండేషన్స్, జడ్జీల నుంచి రిఫరెన్స్లు ఉంటేనే షోకు వెళ్లాలని వ్యాఖ్యానించారు. ప్రొడక్షన్ వాళ్లు తనను ఎక్స్పోజింగ్ చేయమనేవాళ్లని, బొడ్డు కిందకు చీరలు కట్టుకోమనేవారని ఇబ్బందిపడుతూనే షోలో చేశానని ప్రవస్తి వ్యాఖ్యానించింది.
ప్రవస్తికి సునీత కౌంటర్
ఈ వ్యాఖ్యలను సింగర్ సునీత సహా కొందరు ఖండించారు. ఆ తర్వాత వివాదం సద్దుమణగగా.. తాజాగా మరోసారి ప్రవస్తి .. ఈ పాడుతా తీయగా ప్రోగ్రామ్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ఎలిమినేషన్ ఎపిసోడ్కు జడ్జిలు లేరని ముందు నుంచి ఆరోపిస్తూ వరుస ఇంటర్వ్యూలు, వీడియోలు వదులుతోన్న ప్రవస్తి ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ కావడంతో స్పందించింది. సదరు ఎపిసోడ్లో జడ్జీ స్థానంలో ఉన్న చంద్రబోస్, కీరవాణి, సునీతలు కనిపించడంతో పాటు చప్పట్లు కూడా కొట్టారు. జడ్జిలు లేరని ప్రవస్తి చెబితే.. ఇలా వీరంతా స్టేజ్పై కనిపించడంతో నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. దీనిపై ప్రవస్తి స్పందించింది.
ఆ ఎపిసోడ్ అంతా అతికించడమే
'నిన్న పెట్టిన పోస్ట్ నా లాస్ట్ పోస్ట్ అనుకున్నా.. కానీ నిన్న ఎలిమినేషన్ ఎపిసోడ్ చూశాక షాకయ్యా. నాకు తెలిసి రియాలిటీ షోల హిస్టరీలోనే ఇంత అనైతికంగా, అన్ ప్రొఫెషనల్గా కంప్రెస్ చేసి ఎలిమినేషన్ ఎపిసోడ్ వదులుతారని నేనైతే అనుకోలేదు. అది కూడా ఈటీవీ లాంటి ఛానెల్లో ఇలాంటివి జరుగుతాయని అస్సలు అనుకోలేదు. అంతా కూడా కంప్రెస్డ్ ఫుటేజే రిలీజ్ చేశారు. ఏ ప్రోగ్రామ్కైనా ఎడిటింగ్లు, అతికించడాలు ఉంటాయి. కానీ మరీ ఇంత అన్ ప్రొఫెషనల్గా పోస్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రేక్షకుల్లోని చాలా మంది రియలైజ్ అయి నాకు మెసేజ్ చేశారు' అని ప్రవస్తి అన్నారు.
కీరవాణి సార్ ఎక్కడి నుంచి వచ్చారు
'ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రం చాలా వేరుగా ఉందని.. మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది. చాలా ఎడిటెడ్ కట్, కట్ చేసినట్లు అనిపించింది మాకు అని మెసేజ్ చేశారు. అంత ఈజీగా జనాల్ని ఫూల్స్ని చేయొచ్చు అనే ఇంటెన్షన్తో ఇవన్నీ చేస్తున్నారు. ఇది నన్ను బాగా హర్ట్ చేసింది. జడ్జిలు లేరని ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. మేడం షార్ట్స్ ఎక్కువగా పడ్డాయి.. చంద్రబోస్ సార్ అస్సలు లేరు, ఆయన వెళ్లిపోయారు. కీరవాణి సార్ నాకు సంబంధం లేదని లేచి వెళ్లిపోయారు. ఆయనను ఫుటేజ్లో ఇవ్వలేదు.
కీరవాణి సార్ చప్పట్లు కొడుతున్న షాట్స్ ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారో నాకు తెలియదు. చివరికి నేను, రేణు కుమార్ అన్న మాత్రమే మిగిలాం. ఇద్దరికీ ఎన్ని మార్కులు వచ్చాయి.. ఏ జడ్జి ఎంత వేశారు? అన్న క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇంత అన్ఫ్రొఫెషనల్ రియాలిటీ షోలో భాగం కావాలని నాక్కూడా లేదు. నేను స్ట్రాంగ్గానే ఉన్నా.. ఏ తప్పు చేయలేదు, తప్పు చేసి కూడా సేవ్ అయ్యామని కొందరు కంటెస్టెంట్స్ ముఖాలు చూస్తేనే తెలుస్తుంది. ఎవరి మీదా నాకు వ్యక్తిగత కక్షలు లేవు' అని ప్రవస్తి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తుండగా దీనిపై పాడుతా తీయగా నిర్వాహకులు, న్యాయ నిర్ణేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











