10 ఏళ్లలో ఎన్నో అవమానాలు, అయినా వెనక్కి తగ్గలేదు: శ్రావణ భార్గవి ఎమోషనల్
ప్రముఖ గాయని శ్రావణ భార్గవి (Sravana Bhargavi) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ నేపథ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, రేడియో జాకీ. ఆమె తన ప్రత్యేకమైన గొంతుతో ఎన్నో హిట్ పాటలను పాడారు. తాజాగా 'ఫకుయామా'తో మరోసారి వార్తల్లో నిలిచారు. యూట్యూబ్లో ఇప్పటికే లక్షల వ్యూస్ సాధిస్తూ ట్రెండ్ అవుతుంది. ఈ పాటను మహిళలకు అంకితంగా రూపొందించానని ఆమె తెలిపారు. ఈ పాట కేవలం సంగీతం మాత్రమే కాదు, తన ఆలోచనలు, అభిప్రాయాలు, విలువలకు ప్రతిబింబమని, తన జీవితంలో ఒక కీలక మలుపుగా నిలిచిందని భావోద్వేగంగా చెప్పారు. "ఫకుయామా" అనే పేరు జపాన్లోని ఒక నగరం పేరు మాత్రమే కాకుండా, ఒక ప్రముఖ వ్యక్తి పేరు కూడా అని తెలిపారు.
అలాగే.. ఈ పాటపై వస్తున్న విమర్శలపై కూడా శ్రావణ భార్గవి స్పందించారు. సమాజంలో ఉన్న కొన్ని కట్టుబాట్లు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే సమస్యలను ప్రశ్నించే ప్రయత్నమే ఈ పాటను రూపొందించినట్టు తెలిపారు. పురుషులను కించపరచడం తన ఉద్దేశ్యం కాదని, మహిళల మధ్యే పెరుగుతున్న ప్రతికూలత, ఒకరినొకరు తక్కువ చేసి చూడడం వంటి అంశాలను చూపించడమే లక్ష్యమని చెప్పారు. ఆశ్చర్యకరంగా, ఈ పాటపై వచ్చిన నెగటివ్ కామెంట్స్లో ఎక్కువ శాతం మహిళల నుంచే రావడం తనను కలచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే విమర్శలను కూడా సానుకూలంగా తీసుకుంటానని శ్రావణ భార్గవి చెప్పారు. తనపై సమయం వెచ్చించి కామెంట్ చేయడం అంటే వారు తన పనిని గమనిస్తున్నారని, అది తాను సరైన దిశలోనే ముందుకు సాగుతున్నాననే సంకేతమని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆమె పాజిటివ్ ఆలోచనా విధానాన్ని చూపిస్తున్నాయి.
తన కెరీర్లో వచ్చిన మార్పుల గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు తాను చాలా సాంప్రదాయబద్ధంగా ఉండేదాన్నని, కానీ కాలక్రమేణా తనను తాను అర్థం చేసుకుంటూ మరింత ధైర్యంగా, ఆధునికంగా మారానని చెప్పారు. "ఫకుయామా" పాట ఈ పరిణామానికి ప్రతీకగా నిలిచిందని, తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా ప్రతిబింబించే పాట అని తెలిపారు.
సంగీత రంగంలో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ, ప్లేబ్యాక్ సింగింగ్తో పాటు స్వతంత్ర సంగీతం తనకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చిందని తెలిపారు. పాటను రాయడం, స్వయంగా కంపోజ్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం, మార్కెటింగ్ చేయడం వరకు అన్ని ప్రక్రియల్లో పాల్గొనడం ద్వారా తన క్రియేటివిటీని పూర్తిగా వినియోగించుకుంటున్నానని చెప్పారు. ఎటువంటి పరిమితులు, ఫిల్టర్లు లేకుండా తన నిజమైన భావాలను వ్యక్తం చేయగలగడం ఇండిపెండెంట్ మ్యూజిక్ వల్లే సాధ్యమైందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇక వ్యక్తిగతంగా కూడా తాను ఎన్నో కోణాల్లో ఎదిగానని శ్రావణ భార్గవి చెప్పారు. కేవలం గాయని మాత్రమే కాకుండా, పాటల రచయిత్రి, డబ్బింగ్ ఆర్టిస్ట్, మ్యూజిక్ కంపోజర్, ఆర్జే, యాంకర్గా తనలోని విభిన్న ప్రతిభలను వెలికితీసుకుంటున్నానని తెలిపారు. ఈ ప్రయాణంలో సంగీత నిర్మాత శశాంక్ ఆలమూరి వంటి వ్యక్తుల సహకారం తనకు ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు.
ఇలా శ్రావణి భార్గవి "ఫకుయామా" ద్వారా తన ఆలోచనలను, సమాజంపై తన దృష్టిని స్పష్టంగా వ్యక్తం చేశారు. కేవలం ఇప్పుడే కాదు. గత 10 ఏండ్లుగా ఎన్నో విమర్శలను ఎదుర్కొంటుననీ, వాటన్నింటిని మరింత ధైర్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications