‘జబర్దస్త్ యాంకర్గా ఆఫర్ వదిలేసుకున్నా... అనసూయకి ఛాన్స్ అలా’
జబర్దస్త్.. దాదాపు 13 ఏళ్లుగా తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తుతోన్న టాప్ కామెడీ షో. ఎంతో మంది ప్రతిభావంతులను తెలుగువారికి పరియం చేసిన జబర్దస్త్ షో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని మిగిల్చింది. జబర్దస్త్ వస్తుందంటే ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోయేవారు. ఈ షోలోని కంటెంట్పై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. జబర్దస్త్ ద్వారా పరిచయమైన వారు సినీనటులుగా, హీరోలుగా, దర్శకులుగా, రచయితలుగా సినీరంగంలో రాణిస్తున్నారు.
గడిచిన 13 ఏళ్ల కాలంలో జబర్దస్త్లో పాత టీమ్ లీడర్లు, కమెడియన్లు, యాంకర్లు, జడ్జిలు మారిపోయారు. ఎంత మంది వస్తున్నా, వెళ్తున్నా.. జబర్దస్త్ మాత్రం నడుస్తూనే ఉంది. ఇటీవలి కాలంలో ఈ షోకు టీఆర్పీ రేటింగ్ పడిపోయిందనే కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు. జడ్జి నాగబాబు రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయనతో పాటు పాత కమెడియన్లు కూడా ఒక్కొక్కరిగా తిరిగొస్తున్నారు. ప్రస్తుతం స్కిట్స్ బాగుంటున్నాయి, పంచ్లు పేలుతున్నాయనే ఫీడ్ బ్యాక్ వస్తోంది.

జబర్దస్త్ అనగానే జడ్జిలు నాగబాబు, రోజాలతో పాటు యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్లు ఖచ్చితంగా గుర్తొస్తారు. అనసూయ సినిమాలలో బిజీ కావడం, ఇతర వ్యక్తిగత కారణాలతో జబర్దస్త్కు యాంకర్గా గుడ్ బై చెప్పేశారు. కానీ రష్మీ మాత్రం యాంకరింగ్ చేస్తూనే ఉన్నారు. జబర్దస్త్కు తన అందంతో గ్లామర్ టచ్ ఇచ్చారు అనసూయ. మధ్యలో కమెడియన్లపై పంచ్లు పేలుస్తూ, కొన్ని స్కిట్స్ చేస్తూ జబర్దస్త్ హిట్ కావడంతో తన వంతు పాత్ర పోషించారు. జబర్దస్త్ షోతో అనసూయ జీవితం మారిపోయింది. స్టార్డమ్తో పాటు సినిమాలలో అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం దక్షిణాదిలో డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్లలో అనసూయ కూడా ఒకరు.
అయితే నిజానికి అసలు జబర్దస్త్కి అనసూయ ప్లేస్లో మరో యాంకర్ని నిర్ణయించారు. ఆమె తిరస్కరించడంతోనే జబర్దస్త్కి యాంకరింగ్ చేసే అవకాశం రంగమ్మత్తకి దొరికింది. ఇంతకీ ఆ యాంకర్ ఎవరో కాదు.. మన రాములమ్మ అలియాస్ శ్రీముఖి. కొన్నేళ్ల క్రితం ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ యాంకర్గా వచ్చిన ఆఫర్ను వదిలేయడంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలో నేను పెద్ద వంశీ గారి ఆఫీసులో ఉండేదానిని. మొన్నే వెళ్లిపోయింది అని నిఖితా నారాయణన్, మరో హీరోతో సినిమా చేస్తున్నారు, హీరోయిన్గా నన్ను సంప్రదించి ఆడిషన్ తీసుకున్నారు. అంతా ఓకే అయిపోయింది, ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన వెంటనే నాకు మల్లెమాల ఆఫీస్ నుంచి ఏడుకొండలు గారి నుంచి కాల్ వచ్చిందని శ్రీముఖి గుర్తుచేసుకున్నారు.
ఓ స్టాండప్ కామెడీ షో ప్లాన్ చేస్తున్నాం.. 3, 4 ఎపిసోడ్స్ ఉన్నాయి చేయాలమ్మా అని ఏడుకొండలు గారు అడిగారు. నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది మల్లెమాల ఎంటర్టైన్మెంట్.. ఏ రోజైనా వాళ్లకి రుణపడి ఉండాల్సిందే, వాళ్లు చెబితే వెళ్లాలి. కానీ పెద్ద వంశీ గారి ఆఫీస్ నుంచి బయటికి వచ్చేశా.. ఆయన సినిమాలలో హీరోయిన్ రోల్స్ అద్భుతంగా ఉంటాయి. ఇది వదులుకోవడం అవసరమా? కామెడీ షో అంటున్నారు.. యాంకర్ మీద ఎన్ని సెటైర్లు వేస్తారో ఏంటో? పంచింగ్ బ్యాగ్ లాగా వాడుకుంటారు. అవన్నీ నేను తీసుకోగలుగుతానా? లేక స్టేజ్ మీదే ఏడ్చేస్తానా? సినిమా వచ్చింది కదా, ఇక అవసరమా అని నో చెప్పేశాను. మిమ్మల్ని తీసుకొచ్చిందే మేము.. కొంచెం ఆలోచించమని అడిగారు. పెద్ద వంశీ గారి సినిమా ఒకటి ఓకే అయ్యిందని చెప్పానని శ్రీముఖి పేర్కొంది.
నేను వద్దు అనడంతో అనసూయని పెట్టుకున్నారు. అనసూయ కొన్ని కారణాలతో మధ్యలోనే యాంకరింగ్ను వదిలేస్తున్నప్పుడు మళ్లీ ఫోన్ వచ్చింది. అప్పటికే నేను షో చూసేశా.. జబర్దస్త్ హిట్ అయ్యింది, తప్పు చేశానా అని అనిపించింది. కనీసం 3 ఎపిసోడ్స్ చేయమని అడిగారు. అప్పటికీ కూడా నో చెప్పేశాను. కాంట్రవర్సీలు, అనసూయ మీద ఏమైనా కామెంట్స్ చేసినా తను స్పోర్టివ్గానే తీసుకుంది. నేను అలా తీసుకోగలుగుతానా లేదా అనుకున్నాను. యాంకర్ వెళ్లిపోగానే కొత్త యాంకర్ని టార్గెట్ చేస్తారు. 3 ఎపిసోడ్స్ చేసిన తర్వాత నేను వెళ్లిపోతే ప్రొడక్షన్ హౌస్లో బ్యాడ్ అయిపోతా. అప్పుడు కూడా వద్దని చెప్పడంతో రష్మీని పెట్టుకున్నారు.. అలా ఓ ఏడాది తర్వాత రష్మీ ఎలా రిసీవ్ చేసుకుంటుందని షో చూసిన తర్వాత జబర్దస్త్ ఆఫర్ను వదిలేసుకోవడంపై కొంచెం బాధేసింది. పెద్దవంశీ గారి సినిమా కూడా కొన్నాళ్లు ఆలస్యమై.. అది కూడా పోయింది. పటాస్ అడిగిన వెంటనే మరో మాట లేకుండా రెడీ సార్ అనేశానని శ్రీముఖి గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications



