ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి ఆత్మహత్య, అసలేం జరిగిందంటే?
2025వ సంవత్సరం వెళ్తూ వెళ్తూ పలు విషాదాలను మిగులుస్తోంది. చిత్ర పరిశ్రమ పరంగా పలువురు దిగ్గజాలు ఈ ఏడాది తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. పలువురు బుల్లితెర నటీనటులు కూడా కన్నుమూశారు. తాజాగా ఓ బుల్లితెర నటి బలవన్మరణానికి పాల్పడటంతో ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఎవరు? ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? అందుకు దారి తీసిన కారణాలు ఏంటీ? ఈ వివరాల్లోకి వెళితే...
తమిళ బుల్లితెరపై మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రాజేశ్వరి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె వయసు 39 సంవత్సరాలు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనతో సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గురువారం రాత్రి రాజేశ్వరి నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేశ్వరి శుక్రవారం కన్నుమూశారు.

చెన్నైలోని సైదాపేటకు చెందిన రాజేశ్వరి.. ఓ తమిళ ఛానెల్లో ప్రసారమవుతున్న సిరకడిక్క ఆశై సీరియల్లో నటిస్తున్నారు. దీని కంటే ముందు భాగ్యలక్ష్మీ, పనివిళుమ్ మలర్వనమ్ తదితర సీరియల్స్తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సీరియల్స్తో పాటు పలు చిత్రాల్లోనూ రాజేశ్వరి చిన్నాచితకా పాత్రలు పోషించారు. కాగా.. భర్తతో విభేదాల కారణంగా మనస్తాపానికి గురైన రాజేశ్వరి బలవన్మరణానికి పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి.
రాజేశ్వరికి పెళ్లయి భర్త సతీష్తో కలిసి ముత్తియల్పేటలో నివసించేవారు. ఈ దంపతులకు కుమారుడు హేమంత్ కుమార్, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఐటీ ఉద్యోగిగా పనిచేస్తుండగా.. కుమార్తె స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటోంది. సతీష్కు, రాజేశ్వరికి గత కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో ఆమె సైదాపేటలోని తన పుట్టింటికి వచ్చేశారు. అక్కడి నుంచే తన షూటింగ్స్కు హాజరయ్యేవారు. అయితే ఇటీవల మరోసారి సతీష్కు, రాజేశ్వరికి గొడవ జరగడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి పెద్ద మొత్తంలో నిద్రమాత్రలు మింగడంతో రాజేశ్వరి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అనంతరం మెరుగైన చికిత్స కోసం కీల్పక్కంలోని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేశ్వరి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలుసుకున్న తోటీ నటీనటులు, సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, రాజేశ్వరి ఆత్మహత్యకు దారితీసిన పరిస్ధితులపై ఆరా తీస్తున్నారు.
కాగా.. కొద్దిరోజుల క్రితం కర్ణాటకకు చెందిన బుల్లితెర నటి శోభిత హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. గచ్చిబౌలిలోని శ్రీరామ్నగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న శోభిత.. తన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పలు కన్నడ, తెలుగు సీరియల్స్తో పాటు కొన్ని చిత్రాల్లోనూ నటించిన శోభిత మరణం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటనకు ముందు గోవాలో భార్యాభర్తలిద్దరూ సరదాగా గడిపి వచ్చారు. వీరిద్దరూ అన్యోన్యంగానే ఉంటారని స్థానికులు తెలిపారు. దీంతో శోభిత ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు అనంతరం హైదరాబాద్ పోలీసులు.. ఆమె మృతిని ఆత్మహత్యగా తేల్చారు.


Click it and Unblock the Notifications











