‘ఆ షో వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. ఉన్న ఫేమ్ కూడా పోయింది'
టాలీవుడ్లో ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి తేజస్వి మదివాడ (Tejaswi Madivada). ఈ అమ్మడు తరుచు వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారుతుంది. అలాగే.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బిగ్బాస్ షో గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 'బిగ్బాస్ వల్లే నా కెరీర్ నాశనం అయింది.. ఉన్న ఫేమ్ కూడా పోయింది' అనే ఆమె మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
ఫేమ్ కోసం వెళ్లి... నెగిటివిటీతో బయటికి?
బుల్లితెరలో సంచలనం సృష్టించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 (Bigg Boss Telugu Season 2)లో పాల్గొన్నప్పుడు తేజస్వి భారీ ఫేమ్ వస్తుందని ఆశించింది. కానీ షోలో తనను చూపించిన విధానం పూర్తిగా భిన్నంగా ఉండిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తినని, అదే తనపై నెగిటివ్గా మారిందని తెలిపింది. 'జరిగింది ఒకటి... చూపించింది మరోటి' అంటూ షో ఎడిటింగ్పై కూడా ఆమె పరోక్షంగా విమర్శలు చేసింది. దీంతో ప్రేక్షకుల్లో తనపై తప్పుదారి పట్టించే ఇంప్రెషన్ ఏర్పడిందని చెప్పింది.

తేజస్వి మాటల్లోనే చెప్పాలంటే.. ఒకసారి ప్రజల్లో నెగిటివ్ ఇమేజ్ ఏర్పడితే దాన్ని మార్చడం చాలా కష్టం. అదే తన కెరీర్లో పెద్ద సమస్యగా మారిందని ఆమె పేర్కొంది. ఈ నెగిటివిటీ కారణంగా దర్శక నిర్మాతలు కూడా తనను దూరంగా పెట్టారని, అవకాశాలు తగ్గిపోయాయని తెలిపింది. ఫలితంగా బిగ్బాస్ తర్వాత రావాల్సిన కెరీర్ గ్రోత్ పూర్తిగా ఆగిపోయిందని చెప్పింది. బిగ్బాస్ తర్వాత వచ్చిన ట్రోలింగ్, విమర్శలు తనపై తీవ్ర మానసిక ఒత్తిడిని తీసుకొచ్చాయని తేజస్వి వెల్లడించింది.
దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమాలు లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చిందని, ఆ సమయంలో షో ద్వారా సంపాదించిన డబ్బుతోనే జీవించానని తెలిపింది. 'ఎందుకు జనాలు నన్ను ఇలా చూస్తున్నారు?' అనే ప్రశ్న తనను చాలా కాలం వేధించిందని ఆమె ఎమోషనల్గా చెప్పింది. కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఈ ప్రభావం పడిందని తేజస్వి తెలిపింది. ప్రేమలో ఉన్న వ్యక్తితో బ్రేకప్ జరిగిందని, చివరికి పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్నానని వెల్లడించింది.ఈ పరిస్థితులన్నీ కలిసి తన జీవితాన్ని పూర్తిగా మార్చేశాయని ఆమె చెప్పింది.
'మళ్లీ బిగ్బాస్కు వెళ్తానా?' షాకింగ్ కామెంట్
మరోసారి బిగ్బాస్లో పాల్గొంటారా అనే ప్రశ్నకు తేజస్వి ఘాటుగా స్పందించింది. 'సిగ్గు ఉన్నోడు మళ్లీ ఆ షోలోకి వెళ్తాడా?' అంటూ షాకింగ్ కామెంట్ చేసింది.ఇప్పటికే ఆ షోను పూర్తిగా పట్టించుకోవడం మానేశానని, తన జీవితాన్ని తన విధంగా ముందుకు తీసుకెళ్తున్నానని చెప్పింది. లైఫ్ ఇస్ బ్యూటీ పుల్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజస్వి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హార్ట్ అటాక్ట్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఐస్ క్రీమ్ లో హీరోయిన్గా కనిపించింది. అయితే బిగ్బాస్ తర్వాత ఆమె కెరీర్ ఆశించినంతగా ముందుకు సాగలేదనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
'బిగ్బాస్... డబుల్ ఎడ్జ్ స్వోర్డ్?'
తేజస్వి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఒక పెద్ద చర్చకు దారితీశాయి. బిగ్బాస్ వంటి రియాలిటీ షోలు కొందరికి కెరీర్ను పెంచితే, మరికొందరికి మాత్రం నష్టాన్ని కలిగిస్తాయనే వాదనకు ఇది ఉదాహరణగా మారింది. 'బిగ్బాస్కు వెళ్తే ఫేమ్ రావొచ్చు... కానీ ఉన్న ఫేమ్ కూడా పోయే ప్రమాదం ఉంది'అనే ఆమె వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేజస్వి మదివాడ థ్రోబ్యాక్ ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్లీ వెలుగులోకి రావడం, రియాలిటీ షోల అసలు ప్రభావంపై మరోసారి చర్చ మొదలయ్యేలా చేసింది. ఫేమ్ కోసం వెళ్లిన ఒక షో, తన కెరీర్ను పూర్తిగా మార్చేసిందని ఆమె చెప్పడం... ఇండస్ట్రీలో కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.


Click it and Unblock the Notifications


















