బిగ్ బాస్లో నా భర్త నరకం చూశాడు.. సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్
తెలుగు బుల్లితెరపై క్యూట్ కపుల్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జంటల్లోఅమర్ దీప్ (Amardeep)- తేజస్విని గౌడ(Tejaswini Gowda) జంట ఒకటి. వీరిద్దరూ ఎప్పుడూ చాలా సంతోషంగా ఉండటమే కాదు, తమ దాంపత్య జీవితంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రేమ, పరస్పర గౌరవం, అర్థం చేసుకునే స్వభావంతో ఈ జంట ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకుంది.
సోషల్ మీడియాలోనూ వీరికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక తాజాగా తేజస్విని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని భర్త అమర్ దీప్కు సంబంధించిన అనేక విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu Season 7)లో అమర్ ఎదుర్కొన్న పరిస్థితులపై మాట్లాడిన ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విడాకుల రూమర్స్కు చెక్
ముందుగా తన కుటుంబ జీవితం గురించి మాట్లాడుతూ, తాము విడిపోతున్నామని కొందరు కావాలనే వార్తలు ప్రచారం చేశారని తేజస్విని తెలిపారు. అసలు ఆ రూమర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదని, కానీ 'నీతోనే 2.0' షోలో కలిసి పాల్గొనడం ద్వారా ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టామని చెప్పారు. తాము చాలా హ్యాపీగా ఉన్నామని, తమ బంధం మరింత బలంగా ఉందని స్పష్టం చేశారు.
అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న రోజుల గురించి మాట్లాడుతూ తేజస్విని ఎమోషనల్ అయ్యారు. "అమర్ టైటిల్ కోసం ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. హౌస్లో ఉన్నప్పుడు తనను గుడ్డిగా నమ్మిన వాళ్లే కొన్ని సందర్భాల్లో మోసం చేశారు. ముఖ్యంగా కెప్టెన్సీ కోసం చాలా ట్రై చేశాడు. కానీ ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేకపోయాననే బాధ అతనిలో చాలా ఎక్కువగా ఉండేది" అన్నారు. ఆ బాధను బయటకు చెప్పకుండా తనలో తానే దాచుకున్నాడని, అదే కారణంగా మానసిక ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు. "ఒకరకంగా చెప్పాలంటే బిగ్ బాస్ వల్ల అమర్ నరకం అనుభవించాడు" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
హౌస్లో జరిగిన బాల్ టాస్క్ గురించి మాట్లాడుతూ తేజస్విని కన్నీటి పర్యంతమయ్యారు. "ఆ గేమ్లో అమర్ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి, కెప్టెన్సీ అవకాశాన్ని దక్కించుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. తనతోటి కంటెస్టెంట్స్ను రిక్వెస్ట్ చేస్తూ కనిపించడం చూసి నేను చాలా బాధపడ్డాను. అతడిని చూసి ప్రేక్షకులు ఏడిస్తే, నేను భార్యగా ఏడవకూడదా?" అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఆ సమయంలో అమర్ ఫీలింగ్స్ను అర్థం చేసుకోకుండా కొందరు ట్రోలింగ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఒకరినే టార్గెట్ చేసినట్టు అనిపించిందని ఎమోషనల్ అయ్యారు.
హౌస్లో కొన్ని సందర్భాల్లో అందరూ కలిసి అమర్ను టార్గెట్ చేసినట్టు కనిపించిందని తేజస్విని తెలిపారు. "ఒకే వ్యక్తిని పదేపదే టార్గెట్ చేస్తే అది సహజంగా అనిపించదు. కొన్ని సందర్భాల్లో బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షోలా అనిపించింది. ఎందుకంటే ఒక వ్యక్తిని అంతలా టార్గెట్ చేయడం వెనుక ప్లానింగ్ ఉన్నట్టు అనిపించింది" అని వ్యాఖ్యానించారు. అయితే ప్రేక్షకులు మాత్రం అమర్కు అండగా నిలిచారని, అదే అతనికి అసలైన బలం అని చెప్పారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమర్లో చాలా మార్పు వచ్చిందని తేజస్విని చెప్పారు.
" అమర్ ప్రతి చిన్న విషయాన్నీ సీరియస్గా తీసుకునేవాడు. కానీ హౌస్లో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు చూసి, బయటికి వచ్చిన తర్వాత నెగెటివిటీకి స్పందించకూడదని మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. ఆ మార్పు చూసి నేను ఆశ్చర్యపోయాను" అన్నారు. బిగ్ బాస్ తర్వాత వచ్చిన ట్రోలింగ్ సమయంలో తాను భర్తకు అండగా నిలబడి, మోరల్ సపోర్ట్ ఇచ్చానని చెప్పారు.
హౌస్లో టైటిల్ గెలవకపోయినా, కెప్టెన్సీ దక్కకపోయినా చివర్లో హీరో రవి తేజ (Ravi Teja)తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పడం అమర్కు పెద్ద గిఫ్ట్గా మారిందన్నారు. "తన ఫేవరెట్ హీరో స్వయంగా సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పడంతో అమర్ నమ్మలేకపోయాడు. అప్పటివరకు పడిన కష్టం అంతా ఒక్క క్షణంలో మర్చిపోయాడు" అని తేజస్విని వెల్లడించారు. తేజస్విని చేసిన ఈ వ్యాఖ్యలతో మరోసారి అమర్ బిగ్ బాస్ జర్నీపై చర్చ మొదలైంది. కొందరు ఆమె మాటలకు మద్దతు ఇస్తుంటే, మరికొందరు ఇది గేమ్లో భాగమే అంటున్నారు.


Click it and Unblock the Notifications






