Brahmamudi : అనామిక జైలుకి, బ్రహ్మముడిలో కొత్త విలన్ ఎంట్రీ, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే?
తెలుగు టెలివిజన్ రంగంలో స్టార్ మా ఆధిపత్యం దూసుకెళ్తోంది. ఈ ఛానెల్ దూకుడుకు సీరియల్స్ కూడా ఓ కారణం. సరికొత్త కథ కథనాలతో , భారీ స్టార్ క్యాస్ట్తో తెరకెక్కుతోన్న సీరియల్స్కు బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. స్టార్ మాలోని సీరియల్స్లో ప్రస్తుతం బ్రహ్మముడి తన హవా చాటుకుంటోంది. ట్విస్టులు, ఎత్తులు పై ఎత్తులతో మంచి వినోదాన్ని అందిస్తోంది బ్రహ్మముడి.
సంపన్న కుటుంబానికి చెందిన భర్త, నిరుపేద కుటుంబానికి భార్య మధ్య జరిగి సంఘర్షణ, అత్తింటిని ప్రతి సమస్య నుంచి కాపాడే కోడలి చాకచక్యం ఇతివృత్తంతో ఈ సీరియల్ మంచి టీఆర్పీలను సాధిస్తోంది. బిగ్బాస్ ఫేం మానస్ నాగులపల్లి, తమిళ నటి దీపిక రంగరాజులు లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సీరియల్ ఇప్పటి వరకు 658 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అయితే గత కొద్దిరోజులుగా ఈ సీరియల్కు త్వరలోనే శుభం కార్డ్ పడుతుందనే డిస్కషన్ నడుస్తోంది.

దీనికి కారణాలు లేకపోలేదు.. దుగ్గిరాల కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సీతారామయ్య కోమాలో నుంచి బయటకు వచ్చాడు. అప్పూ ఎస్ఐ అయ్యింది, ధాన్యలక్ష్మీ తన కొడుకు కోడలిని ఇంటికి తీసుకొచ్చి అంతా కలిసే ఉంటున్నారు. ఈ దశలో సామంత్ను చంపిన కేసులో రాజ్ ఇరుక్కోవడం లాస్ట్ మినిట్లో కీలక సాక్ష్యాధారం సంపాదించిన అప్పూ, కావ్యలు కోర్టు ముందుకు తీసుకొస్తారు. అతని ఫోన్లో ఉన్న వీడియో ఆధారంగా అసలు హంతకురాలు అనామికేనని, ఆమె సామంత్ని హత్య చేసి ఆ నేరాన్ని రాజ్ మీదకు తోసినట్లుగా బయటపడుతుంది. అనామికకి 14 ఏళ్లు జైలు శిక్ష విధించడంతో ఆమె జైలుకు వెళ్తుంది.
అన్ని సమస్యలు తీరిపోవడంతో బ్రహ్మముడికి రేపో మాపో శుభం కార్డ్ గ్యారెంటీ అని అనుకుంటున్న తరుణంలో ఈ సీరియల్ మేకర్స్ కొత్త పాత్రను ప్రవేశపెట్టారు. రాజ్ కోర్టు నుంచి బయటికి వచ్చి తన కుటుంబంతో మాట్లాడుతుండగా ఓ అమ్మాయిని చూసి టెన్షన్ పడతాడు. ఆమెకు వెతుక్కుంటూ వెళ్లేసరికి కనిపించదు. కావ్య ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఎవరి కోసం వచ్చారు? అని అడిగినా నిజం చెప్పడు రాజ్. మార్చి 3వ తేదీ ఎపిసోడ్ చివరిలో వదిలిన ప్రోమోలో ఆ అమ్మాయి కారు దిగి.. నేను రాజ్ను పెళ్లి చేసుకుంటానని, అతని భార్యను ఒప్పించమని అంటుంది.
దీంతో సీరియల్ కొత్త టర్న్ తీసుకుంది. ఆమె బ్రహ్మముడిలో కొత్త విలన్ అని ప్రేక్షకులకు అర్ధమై.. సీరియల్ కొన్నాళ్లు సాగదీస్తారని చర్చించుకుంటున్నారు. అయితే ఆ కొత్త క్యారెక్టర్ ఎవరు? ఇంతకు ముందు ఏ సీరియల్స్లో చేసింది? అంటూ కుటుంబ ప్రేక్షకులు ఇంటర్నెట్ను జల్లెడ పడుతున్నారు. ఆమె పేరు సౌమ్యా యాదవ్ అలియాస్ యామిని. ఈమె బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలే. గతంలో పలు ఛానెల్స్లో ప్రసారమైన మూడుముళ్లు, రంగులరాట్నం, ఉమ్మడి కుటుంబం వంటి సీరియల్స్లో నటించారు. తన నటనతో ఆకట్టుకున్న సౌమ్యా యాదవ్.. బ్రహ్మముడిలో ఎంత మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











