ఆ దర్శకుడికి టీఎన్ఆర్ చివరి ఫోన్ కాల్… ఈరోజు నుంచి షూటింగ్.. 'అది చెబుదామని ఫోన్ చేశా...అంటూ'!
తెలుగు డిజిటల్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ సినీ పాత్రికేయులు నరసింహారెడ్డి అలియాస్ టీఎన్ఆర్ ఈరోజు ఉదయం కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణానికి సినీ ఇండస్ట్రీ మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆయనతో అనుబంధం ఉన్న దాదాపు అందరు సినిమా నటీనటులు, దర్శకులు ఇతర టెక్నీషియన్స్ ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఇంత త్వరగా వెళ్లిపోతారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా టీఎన్ఆర్ చివరి ఫోన్ కాల్ అంటూ ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఆయన ఒక దర్శకుడికి పంపిన వాట్సాప్ ఆడియో మెసేజ్, ఇంతకీ ఎవరా దర్శకుడు , టీఎన్ఆర్ ఏమని మెసేజ్ చేశారు ? అనే వివరాల్లోకి వెళితే
Recommended Video

ఎక్కడో మారుమూల జిల్లాలో పుట్టి
ఎక్కడో మారుమూల ఆదిలాబాద్ జిల్లాలో పుట్టిన టీఎన్ఆర్ సినిమా దర్శకుడు కావాలనే తపనతో హైదరాబాద్ వచ్చారు. 90లలోనే హైదరాబాద్ వచ్చిన ఆయన అప్పటి నుంచి దర్శకుడు కావాలని తన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కెరీర్ మొదట్లో ప్రముఖ నటుడు రచయిత గా పేరున్న ఎల్బీ శ్రీరామ్ వద్ద ఆయన కొన్ని సినిమాలకు సహ రచయితగా పనిచేశారు. తర్వాత జర్నలిస్ట్ గా మారిన ఆయన ఈ టీవీ సహా పలు ఛానళ్లలో పని చేశారు. మరీ ముఖ్యంగా ఈ టీవీలో వచ్చే నేరాలు ఘోరాలు ఎపిసోడ్స్ కు ఆయన మూడేళ్లపాటు దర్శకత్వం వహించారు..

డిజిటల్ రంగంలో తనదైన ముద్ర
ఆ తర్వాత వివిధ ఛానళ్ళలో ఉద్యోగం చేసిన ఆయన చివరికి ఐడ్రీమ్ అనే సంస్థలో స్థిరపడ్డారు. ఆ సంస్థ ద్వారా ఆయన ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ పేరుతో చేస్తున్న ఇంటర్వ్యూలకు మంచి ఆదరణ దక్కింది. దాదాపు 189 ఇంటర్వ్యూలు చేసిన ఆయన తెలుగు డిజిటల్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అంటే ఏమిటి అంటే టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో కనిపించడం అని ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తున్న వారు భావించేవారు అంటే ఆయన ఇంటర్వ్యూ లకు ఉన్న క్రేజ్ ఏపాటిదో మీరు అర్థం చేసుకోవచ్చు.

ఒక దర్శకుడికి వాయిస్ మెసేజ్
అయితే చనిపోవడానికి కొన్ని రోజుల ముందు టీఎన్ఆర్ ఒక దర్శకుడికి వాయిస్ మెసేజ్ పంపారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువ దర్శకుడు బండి సరోజ్ కుమార్ సూర్యాస్తమయం అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా కారణంగా రిలీజ్ కాలేదు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఆయన నిర్బంధం అనే సినిమా చేశారు. కేవలం యూట్యూబ్లో రిలీజ్ చేసిన ఈ సినిమాకు మంచి స్పందన దక్కింది..

నిర్బంధం 2లో కీలక పాత్ర కోసం
నిర్బంధం సినిమాకు వచ్చిన స్పందనతో ఆయన నిర్బంధం 2 అనే సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఆయన టీఎన్ఆర్ ను సంప్రదించారు. టీఎన్ఆర్ పాత్ర తాలూకా షూటింగ్ ఏడో తారీఖు నుంచి చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. కానీ అప్పటికే తనకు జ్వరం అనిపిస్తూ ఉండడంతో పాటు కొన్ని కరోనా లక్షణాలు తెలియడంతో టీఎన్ఆర్ ఏడో తారీఖు నుంచి కాదు పదో తారీకు నుంచి షూటింగ్ పెట్టుకుందాం అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఆడియో మెసేజ్ పంపారు.
నువ్వు ఆగగలిగితే
కొద్ది రోజుల నుంచి జ్వరం లాగే అనిపిస్తోందని జ్వరం అంటే జ్వరం కూడా అని చెప్పలేను అని టీఎన్ఆర్ పంపిన వాయిస్ నోట్ లో పేర్కొన్నారు. ఏమీ తిన బుద్ధి కావడం లేదని పేర్కొన్న ఆయన అందుకే జ్యూస్ తాగుతూ సరి పెడుతున్నాను అని చెప్పుకొచ్చారు. నిజానికి ఏడో తారీఖు నుంచి షూటింగ్ వద్దని కొంచెం స్థిమిత పడ్డాక పదో తారీకు తర్వాత పెట్టుకుందాం అని ఆయన చెప్పుకొచ్చారు. నువ్వు ఆగగలిగితే తర్వాత పెట్టుకుందాం అని ఆయన దర్శకుడిని కోరారు. ఇంటర్వ్యూ కూడా తాను చేయలేక క్యాన్సిల్ చేయించానని ఆయన ఆడియో మెసేజ్ లో చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











