నా కష్టం అంతా వృథా.. నా డ్రీమ్ హౌస్ సుధీర్ చేతిలోకి.. టాలీవుడ్ నటుడు ఎమోషనల్
టాలీవుడ్లో ఒకప్పుడు మిమిక్రీతో పాటు కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివారెడ్డి. స్టేజ్ షోలతో ప్రారంభమైన తన ప్రయాణం, తర్వాత సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్ వరకు సాగింది. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తనది. తాజాగా ఓ య్యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివరెడ్డి తన జీవిత ప్రయాణం, కెరీర్లో ఎదురైన ఒడిదుడుకులు, అలాగే ఇతర కళాకారులకు చేసిన సహాయం గురించి భావోద్వేగంగా పంచుకున్నారు. ఈ క్రమంలో తన కష్టం అంతా వృథా అయిందనీ, తాను ఎంతో కష్టపడి కట్టుకున్న డ్రీమ్ హౌస్ సుధీర్ చేతిలోకి వెళ్లిపోయిందనీ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
నటుడు శివారెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభం నుంచే ఇతర ఆర్టిస్టులకు అవకాశాలు కల్పించడం తనకు అలవాటైందని చెప్పారు. ప్రోగ్రామ్స్ కోసం తనతో పాటు కొత్తవారిని తీసుకెళ్లి, ఎలా పర్ఫార్మ్ చేయాలి, ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలి, జోక్స్ ఎలా చెప్పాలి వంటి విషయాలను నేర్పించేవాడినని తెలిపారు. ఇప్పుడున్న జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకంటే ముందే తాను జుగల్బందీ తరహాలో స్టేజ్ షోలు నిర్వహించేవాడినని గుర్తుచేసుకున్నారు.

ఆర్టిస్టుల పట్ల తనకున్న గౌరవాన్ని కూడా ఆయన వివరించారు. మార్కెట్లో ఒక ఆర్టిస్ట్కు ఎంత పారితోషికం ఇస్తే, తాను దానికంటే ఎక్కువే చెల్లించేవాడినని చెప్పారు. ఉదాహరణకు నటులకు రూ. 25,000 ఇచ్చే చోట తాను రూ.30,000 ఇవ్వడం, సింగర్లకు కూడా మార్కెట్ రేటుకంటే ఎక్కువ ఇవ్వడం తనకు అలవాటని పేర్కొన్నారు. ఇది తన వద్ద డబ్బు ఎక్కువగా ఉందని కాదు, తమతో పని చేసే వారు సంతోషంగా ఉండి, ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని తాను భావించేవాడినని వివరించారు.
తన సహాయంతో ఎంతోమంది ఆర్టిస్టులు జీవితంలో ఎదిగారని శివారెడ్డి గర్వంగా చెప్పారు. చాలామంది ఇళ్లు కట్టుకున్నారని, లోన్లు తీర్చుకున్నారని, కార్లు, ఫ్లాట్లు కొనుగోలు చేశారని చెప్పడం తనకు సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఒక విధంగా చూసుకుంటే, ఇండస్ట్రీలో కొంతమంది కమెడియన్ల కెరీర్ డెవలప్ కావడానికి తానే ప్రధాన కారణమని చెప్పారు.
అయితే, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 'దూకుడు' సినిమా తర్వాత తనకు పెద్దగా అవకాశాలు రాలేదని, ఇంకా ఇప్పటికీ దర్శకులు, రైటర్లకు మెసేజ్లు చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కొంతమంది దర్శకులు 'నెక్స్ట్ సినిమా' అంటూ మాటలు ఇస్తూ కాలం గడుపుతుంటారని, మరికొందరు సినిమా ఫెయిల్ అయిన తర్వాత మాత్రమే స్పందిస్తారని విమర్శించారు. ఆఫీసులకు వెళ్తే 'ఎందుకు వచ్చారు?'అంటారని, ఫోన్ చేస్తే 'తర్వాత చూస్తాం' అని నిర్లక్ష్యం చేస్తారని తన అనుభవాన్ని పంచుకున్నారు.
తన మిమిక్రీ ఇమేజ్ కూడా తనకు కొంతవరకు అడ్డంకిగా మారిందని ఆయన భావించారు. మిమిక్రీ ఆర్టిస్ట్గా వచ్చిన పేరు, నటుడిగా తనను గుర్తించడానికి అడ్డుపడిందని, కమెడియన్ పాత్రల కోసం పిలిచినా, నటుడిగా గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. ఇది తన కెరీర్లో ఒక పెద్ద లోటుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక సుడిగాలి సుధీర్ గురించి కూడా శివారెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సుధీర్ తన దగ్గరే మొదటి ఫ్లాట్ కొనుగోలు చేశాడని, అప్పటి పరిస్థితుల్లో తక్కువ ధరకే ఇచ్చానని తెలిపారు. ఆ ఇంటిలో తాను అవార్డులు పెట్టుకోవడానికి 'S' ఆకారంలో ఇంటీరియర్ చేయించుకున్నాననీ, ఆ ఇల్లులో ఆ పార్ట్ సుధీర్కు నచ్చి తీసుకున్నాడని చెప్పారు. ప్రస్తుతం సుధీర్కు మూడు ఇళ్లు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. అలా తాను కష్టపడి సంపాదించుకున్నా ఆ ఇల్లును అమ్మి వేశాననీ, ఆ ఇల్లు సుధీర్ చేతుల్లోకి వెళ్లిందని తెలిపారు.
తన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ, బ్యాచిలర్గా ఉన్నప్పుడు డబ్బు విలువను పెద్దగా పట్టించుకోలేదని, కానీ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాకే రూపాయి విలువ తెలుసుకున్నానని చెప్పారు. ఇప్పుడు మాత్రం కష్టపడి సంపాదించి, జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఇల్లు కొనుగోలు చేశానని తెలిపారు. తన మంచితనం, కష్టపడే గుణం ఎప్పటికైనా గెలుస్తాయని శివారెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications



















