వాళ్ల విషయంలో ఆ తప్పు అస్సలు చేయను.. ఉదయభాను షాకింగ్ కామెంట్స్
ఒకప్పుడు తెలుగు టెలివిజన్లో యాంకరింగ్కు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. తొలినాళ్లలో యాంకర్ అంటే కేవలం షో నడిపేవారు కాదు... ప్రేక్షకులను ఆకట్టుకునే స్టార్గా ఉండేవారు. అలాంటి కాలంలో తన ఎనర్జీ, స్టైల్, మాట తీరుతో ట్రెండ్ సెట్ చేసిన యాంకర్ ఉదయ భాను (Udaya Bhanu). డాన్స్ బేబీ డాన్స్, సాహసం చేయరా ఢింభకా, ఢీ వంటి షోలతో ఆమె చిన్న తెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్టేజ్పై ఆమె కనిపిస్తే చాలు.. షోకి ప్రత్యేక ఆకర్షణ వచ్చేది. ఆమె హోస్టింగ్లో ఉన్న స్పీడ్, ఎక్స్ప్రెషన్స్, ఆడియన్స్తో కనెక్ట్ అయ్యే స్టైల్ అన్ని కలిసి ఆమెను టాప్ యాంకర్గా నిలబెట్టాయి. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా విషయంలో జరిగిన తప్పును వాళ్ల విషయంలో చేయను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమైందంటే?
తాజాగా యాంకర్ ఉదయభాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సమయంలో "ట్రోలింగ్ను ఎలా హ్యాండిల్ చేస్తారు?" అనే ప్రశ్నకు ఉదయభాను చాలా స్ట్రెయిట్గా స్పందించారు. "నేను అలాంటి కామెంట్స్ను అసలు పట్టించుకోను. కానీ అలాంటి కామెంట్స్ చేసే వారిని మాత్రం తప్పుపట్టను. వారిని పెంచిన తల్లిదండ్రుల బాధ్యత అది" అంటూ ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. పిల్లల పెంపకం సరిగ్గా ఉంటే ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయరని ఆమె స్పష్టం చేశారు. ఒక బిడ్డను సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దాలా? లేక సమాజానికి హానికరంగా మారేలా పెంచాలా? అనేది పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇక పిల్లల పెంపకం గురించి మాట్లాడుతూ... "పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వారి పరిసరాలు ఎలా ఉన్నాయి, వారు సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలి" అంటూ సూచించారు. నేటి కాలంలో సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువగా ఉందని, దాని వల్ల అనేక ప్రమాదాలు ఎదురవుతున్నాయని ఆమె హెచ్చరించారు. అమ్మాయిల భద్రత విషయానికి వస్తే ఉదయభాను మరింత ఆవేదన వ్యక్తం చేశారు. "ఈ రోజుల్లో అమ్మాయిలకు పూర్తి భద్రత లేకుండా పోయింది. కొన్ని సంఘటనలు వినడానికే భయంకరంగా ఉంటున్నాయి" అంటూ ఆమె పేర్కొన్నారు.
సమాజంలో జరుగుతున్న దారుణ ఘటనలు చూసి బాధ కలుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో పిల్లలను ధైర్యంగా పెంచాల్సిన అవసరం ఉందని, వారికి మానసికంగా బలాన్ని ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెకు జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ... "సెలబ్రిటీల పిల్లలకే రక్షణ లేకపోతే, సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు" అన్నారు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆత్మవిశ్వాసం, ధైర్యం నేర్పించాలని, 'ప్రపంచం అంతా వ్యతిరేకించినా తల్లి నిన్ను కాపాడుతుంది' అనే నమ్మకం కల్పించాలని చెప్పారు.
ఇక ధనిక తల్లిదండ్రులు చేస్తున్న ఒక పెద్ద తప్పుపై కూడా ఉదయభాను దృష్టి సారించారు. "కొంతమంది రిచ్ పేరెంట్స్ తమ పిల్లలకు మన దగ్గర చాలా డబ్బుంది, కార్లు, బిల్డింగ్స్ ఉన్నాయి అని చెప్పడం చాలా పెద్ద తప్పు" అన్నారు. ఇలా చెప్పడం వల్ల పిల్లలు కష్టాల విలువను అర్థం చేసుకోరని, భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోలేరని హెచ్చరించారు. తాను తన పిల్లల విషయంలో అలాంటి తప్పు చేయనని అన్నారు. పిల్లలను స్వతంత్రంగా, తమ కాళ్ల మీద నిలబడేలా పెంచాలని ఆమె సూచించారు. "జీరో నుంచి మొదలు పెట్టినా తమ జీవితాన్ని తామే నిర్మించుకునేలా పెంచాలి. అప్పుడే వారు జీవితంలో వచ్చే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోగలరు" అని చెప్పారు.


Click it and Unblock the Notifications



