‘యాత్ర 2’ ప్రకటించిన డైరెక్టర్... ఈ సారి ఎవరి కథ చెప్పబోతున్నారంటే?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై 'యాత్ర' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్ త్వరలో 'యాత్ర 2' చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తూ అధికారం దిశగా పరుగులు పెడుతున్న నేపథ్యంలో జగన్ను విష్ చేసిన ఈ డైరెక్టర్... అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఈ మూవీ ప్రకటించారు.
'యాత్ర 2' వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ఉంటుందని తెలుస్తోంది. వైఎస్ఆర్ అకాల మరణాన్ని తట్టుకోలేక ఎంతో మంది అభిమానులు గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే. వారి కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించారు. దీని ఆధారంగా సినిమా ఉంటుందట.
జగన్ పాదయాత్ర మొదలు... 2019లో అతడు అధికారంలోకి వచ్చే వరకు చోటు చేసుకున్న పరిణామాలను ఫోకస్ చేస్తూ 'యాత్ర 2' ఉంటుందని టాక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 175 సీట్లకుగాను 150 సీట్లలో అధిక్యంలో కొనసాగుతూ వైసీపీ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని ఇతర రాజకీయ పార్టీలు ఎలాంటి ఇబ్బందులకు గురి చేసిందనే విషయాలతో పాటు జగన్ పార్టీ పెట్టడానికి దారి తీసిన కారణాలేమిటి? ప్రజల్లో జగన్ పట్ల నమ్మకం పెరగడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటనే విషయాలు చూపించే అవకాశం ఉంది.
అయితే 'యాత్ర 2' ఎప్పుడు వస్తుందనే విషయాలను మాత్రం మహి వి రాఘవ్ తెలుపలేదు. 'యాత్రా 2' స్టోరీ రాయడం ప్రారంభిస్తాను, త్వరలోనే సినిమా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను అనే ప్రకటన మాత్రమే చేశారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.


Click it and Unblock the Notifications











