2024 ఇయర్ మెగా ఫ్యామిలీదే.. నాకు ఓ హిట్ ఇవ్వండి ప్లీజ్.. నిహారిక కొణిదెల
కష్టం , సుఖం కలిస్తేనే జీవితం. ఇది కొందరికి నల్లేరుపై నడకలా ఉంటే, మరికొందరికి ఎందుకు పుట్టించావ్రా దేవుడా అనిపించేలా ఉంటుంది. జీవితంలో కొన్ని మరుపురాని సంవత్సరాలు అప్పుడప్పుడూ తారసపడుతుంటాయి. కష్టాల కడగండ్లలో కాస్త ఊపశమనం కలిగించడానికా అన్నట్లు మంచి రోజులు వస్తుంటాయి. వీటిని గుర్తుచేసుకుంటూ బాధలను మరిచిపోతుంటారు జనం. ఈ కాస్త ఓదార్పుతో జీవితమనే బండిని హ్యాపీగా లాగించేస్తుంటారు.
ఇదిలాఉండగా.. ఇటీవల మెగా కుటుంబానికి వరుసపెట్టి అన్నీ శుభాలే జరుగుతున్నాయి. రాంచరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ప్రపంచ ప్రఖ్యాత 'ఆస్కార్' అవార్డ్ లభించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలవగా.. రాంచరణ్ క్రేజ్ శిఖరాగ్రాన్ని చేరింది. నాటి నుంచి ఆయన గ్లోబల్ స్టార్గా మారిపోయారు.

ఇది జరిగిన కొన్నాళ్లకు చిరంజీవి సోదరుడు నాగబాబు ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. ఆయన కుమారుడు వరుణ్ తేజ్ తన సహనటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్గా జరిగింది. ఈ ఏడాది ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవిని భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దాదాపు పదేళ్ల నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
ఇలా అన్ని రకాలుగా మెగా ఫ్యామిలీకి మంచి సమయం నడుస్తుండగా.. అలాంటి మంచే తనకూ జరగాలని తాపత్రయపడుతున్నారు నాగబాబు కుమార్తె నిహారిక. హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో ఆమె నిర్మాతగా మారి పలు వెబ్సిరీస్లు, డాక్యుమెంటరీలు నిర్మిస్తున్నారు. అలాంటిది ఫస్ట్ టైమ్ నిహారిక కమిటీ కుర్రోళ్లు అనే సినిమాను నిర్మించారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 9న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిహారిక మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్నయ్య వరుణ్ తేజ్ తనకు సపోర్ట్గా ఉంటాడని, అందరూ బాగుండాలనుకునే మా బావ సాయితేజ్ ఈ వేదికపై ఉండటం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. కమిటీ కుర్రోళ్లులో సీనియర్ నటులను తీసుకుందామని అనుకున్నామని.. కానీ ప్రతిభ గల 15 మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశామని నిహారిక చెప్పారు. ఈ ఏడాది మా కుటుంబానికి అద్భుతంగా ఉందని .. తాను నిర్మాతగా తొలిసారిగా సినిమాతో వస్తున్నానని అదే ఊపుతో హిట్ చేసేయండ్రా ప్లీజ్ అంటూ నిహారిక ప్రేక్షకులను కోరారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు నిహారికకు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని దీవిస్తున్నారు.


Click it and Unblock the Notifications











