Boycott Laila: అలాంటి కామెంట్స్ తప్పే .. గోదారోళ్లం ఏం చేస్తాం ... పృథ్వీరాజ్
మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం లైలా. కెరీర్లో ఆయన తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడంతో పాటు లేడీ గెటప్ వేయడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, లేడీ గెటప్లో ఉన్న విశ్వక్సేన్ లుక్స్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వాలైంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న లైలా ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవలో లైలా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్లో ఫిబ్రవరి 9న ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా హాజరై హీరో విశ్వక్సేన్ను ఆశీర్వదించారు. ఇదే కార్యక్రమంలో సీనియర్ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఈ సినిమాలో 150 గొర్రెలు ఉండాలని.. కానీ లాస్ట్ సీన్లో మాత్రం 11 గొర్రెలే ఉన్నాయని పృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు తమ పార్టీని, తమ అధినేతను టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయంటూ వైసీపీ శ్రేణులు రగిలిపోయాయి. ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూద్దామంటూ , బాయ్కాట్ లైలా పేరుతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్కు దిగారు వైసీపీ అభిమానులు.

అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో హీరో విశ్వక్సేన్, నిర్మాత సాహూ గారపాటిలు మీడియా ముందుకొచ్చి వైసీపీ శ్రేణులకు క్షమాపణలు చెప్పారు. ఎంతో కష్టపడి తీశామని.. సినిమాను చంపేయొద్దని రిక్వెస్ట్ చేశారు. ఈ సినిమా హెచ్డీ ప్రింట్ను సోషల్ మీడియాలో పెడతామని అంటున్నారని.. రాత్రికి రాత్రే నా సినిమాకు వ్యతిరేకంగా 25 వేల ట్వీట్స్ వేశారని రిష్వక్సేన్ చెప్పారు. జరిగిన దాంట్లో మా ప్రమేయం లేదని, ఒక వ్యక్తి చేసిన తప్పుకు నేనేందుకు బలవ్వాలని హీరో ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ వైసీపీ అభిమానులు బాయ్కాట్ లైలా క్యాంపెయినింగ్ చేస్తూనే ఉన్నారు.
అయితే విశ్వక్సేన్కు ఈ విషయంలో మద్ధతు పలికేవారు లేకపోలేదు. నందమూరి అభిమానులంతా ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అభిమానులకు వీరు సోషల్ మీడియాలో కౌంటరిస్తూ లైలా సినిమాకు మద్ధతుగా మాట్లాడుతున్నారు. నందమూరి అభిమానులు తోడుగా వున్నంత వరకు వీధి కుక్కల బెదిరింపులకు భయపడేది లేదని వుయ్ ఆర్ విత్ యూ విశ్వక్సేన్ అంటూ వారు పోస్టులు పెడుతున్నారు.

మరికొద్దిగంటల్లో లైలా సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఏం జరుగుతోందోనని విశ్వక్సేన్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు . ఈ క్రమంలో అసలు ఈ వివాదానికి కారణమైన నటుడు పృథ్వీరాజ్ స్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ విడుదల చేశారు. గోదావరి వాళ్లమని మాకు వెటకారం వెన్నతో పెట్టిన విద్య అని.. ఎవరితోనూ నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదని పృథ్వీరాజ్ చెప్పారు.
నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదని, ఇకపై బాయ్కాట్ లైలా కాదని, వెల్కమ్ లైలా అనాలని అన్నారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని పృథ్వీరాజ్ కోరారు. ఓ వ్యక్తి తనతో నీచంగా మాట్లాడాడని, చివరికి మా అమ్మను కూడా తిట్టాడని, నా ఆరోగ్యం పాడయ్యేలా చేశాడని ఆయన మండిపడ్డారు. అయినప్పటికీ అతడి గురించి నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు పృథ్వీరాజ్ చెప్పారు. ఆయన క్షమాపణలతోనైనా వైసీపీ శ్రేణులు వెనక్కి తగ్గుతాయా? లేదా? అన్నది మరికొద్దిగంటల్లోనే తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











