Oscars 2025 : ఆస్కార్ రేసులో అమీర్ మూవీ.. ఇండియా నుంచి అఫీషియల్గా, అంతగా ఏముందబ్బా!
97వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. మార్చి 2, 2025న జరగనున్న ఈ మెగా ఈవెంట్కి సంబంధించి ఆయా దేశాల నుంచి ఎంట్రీలు వెళ్లనున్నాయి. దీనికి సంబంధించిన విధి విధానాలను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఇప్పటికే విడుదల చేసింది. చాలా దేశాలు తమ సినిమాలను ఆస్కార్ ఎంట్రీకి పంపించాయి. భారత్ నుంచి కూడా సినిమాలను పంపేందుకు కసరత్తు మొదలుపెట్టగా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషలకు చెందిన పలు చిత్రాలు ఆస్కార్ కోసం పోటీపడ్డాయి. వీటిలో ఒక సినిమా మాత్రం భారత్ నుంచి అధికారికంగా ఎంట్రీని దక్కించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..
ఆస్కార్ ఎంట్రీలకు సంబంధించి ప్రతి ఏడాది కేంద్ర సమాచార, పౌర సంబంధాల శాఖ స్క్రీనింగ్ పెట్టి ఆయా భాషాలకు చెందిన సినిమాలను ఎంపిక చేస్తుంది. ఈసారి తమిళ్ నుంచి తంగలాన్, వాజై, కొట్టుకాళి, మహారాజ, జమా, జిగర్తాండ డబల్ ఎక్స్ ఆస్కార్ బరిలో నిలిచాయి. మలయాళం నుంచి ఊళ్ళోజుక్కు, ఆడు జీవితం, ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్, ఆట్టం ఉన్నాయి. మరాఠీ నుంచి స్వరగంధర్వ సుధీర్ ఫడకే, ఘాట్, ఘరత్ గణపతి నిలిచాయి. హిందీ నుంచి కిల్, ఆర్టికల్ 370, షామ్ బహదూర్, గుడ్ లక్, జోరం, ఆనిమల్, శ్రీకాంత్, వీర్ సవార్కర్, చోటా భృమ్ అండ్ ది కర్స్ ఆఫ్ దమ్యం, లాపట్టా లేడిస్, చందు చాంఫియన్లు ఆస్కార్ కోసం పోటీపడ్డాయి.

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డ్ కొట్టడంతో తెలుగు సినిమా నుంచి ఏయే సినిమాలకు ఆస్కార్ ఎంట్రీకి వెళ్లనున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నాగ్ అశ్విన్ - ప్రభాస్ల కల్కి 2898 ఏడీ, ప్రశాంత్ వర్మ హనుమాన్, అజయ్ భూపతి మంగళవారం సినిమాలు బరిలో నిలిచాయి. అయితే అన్ని సినిమాలను వెనక్కి నెట్టి హిందీ సినిమా లాపతా లేడీస్ ఇండియా నుంచి అకాడమీ అవార్డుల కోసం అధికారిక ఎంట్రీ సాధించింది.
97వ అకాడమీ అవార్డుల కోసం భారత్ నుంచి ఏ సినిమాను పంపించాలన్న దానిపై చెన్నైలో సోమవారం ది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు సమావేశమై.. లాపతా లేడీస్ను బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా పంపాలని తీర్మానించారు. కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నిర్మించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలులో వెళ్తూ తప్పిపోయిన ఘటనను ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. లింగ సమానత్వం, సమాజంలో జరిగే అంశాలను దర్శకురాలు కిరణ్ రావు అద్భుతంగా చూపించారు.

ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. సుప్రీంకోర్టును ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లాపతా లేడీస్ చిత్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆవరణలో ప్రదర్శించే గౌరవం దక్కింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో అమీర్ , కిరణ్ రావులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ బరిలో లాపతా లేడీస్ నిలవగా.. ఆ గౌరవాన్ని కూడా దక్కించుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications











