విజయ్ దేవరకొండతో వివాదం... ఐదేళ్ల తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ రియాక్షన్
చిత్ర పరిశ్రమలో నటీనటులు, సాంకేతిక నిపుణుల, నిర్మాతలు, దర్శకుల మధ్య అప్పుడప్పుడు వివాదాలు చోటు చేసుకుని ముదిరి పాకానపడతాయి. కొందరు ఈ వివాదాలను అప్పటికప్పుడే పరిష్కరించుకుంటే మరికొందరు మాత్రం ఏళ్ల తరబడి సాగదీస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో వివాదంపై దర్శకుడు అభిషేక్ నామా స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన మూవీ వరల్డ్ ఫేమస్ లవర్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు, కేఏ వల్లభ ఈ సినిమాను నిర్మించారు. విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్ థ్రెస్సా, ఇజ్బెల్లా లీట్లు హీరోయిన్లుగా నటించారు. 2020 ఫిబ్రవరి 14వ తేదీన వరల్డ్ ఫేమస్ లవర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి వరల్డ్ ఫేమస్ లవర్ మూవీని దాదాపు 35 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు.

విజయ్ దేవరకొండ క్రేజ్ నేపథ్యంలో వరల్డ్ ఫేమస్ లవర్ మూవీకి వరల్డ్ వైడ్గా అప్పట్లో దాదాపు 30.5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 32 కోట్ల రూపాయల షేర్.. 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. అయితే రిలీజైన క్షణం నుంచే మిక్స్డ్ టాక్తో డిజాస్టర్గా నిలిచింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి కేవలం 17 కోట్ల రూపాయల గ్రాస్.. 9 కోట్ల కోట్ల రూపాయల షేర్ మాత్రమే రాబట్టి డిజాస్టర్గా నిలిచింది. డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 23 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చింది.
వరల్డ్ ఫేమస్ లవర్ మూవీకి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్గా అభిషేక్ నామా వ్యవహరించారు. భారీ నష్టాల నేపథ్యంలో తమను హీరో విజయ్ దేవరకొండ ఆదుకోవాలని ఆయన కోరారు. వరల్డ్ ఫేమస్ లవర్ డిస్ట్రిబ్యూషన్ కారణంగా తాము 8 కోట్ల రూపాయలకు పైగా పొగొట్టుకున్నాం.. దానిపై ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు మీరు పెద్ద మనసుతో 100 కుటుంబాలకు కోటి రూపాయలు విరాళం ఇస్తున్నారు. అలాగే మా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలను కూడా ఆదుకోండి అని అభిషేక్ ట్వీట్ చేశారు. తర్వాత ఈ ఇష్యూని అంతా మరిచిపోయారు.
అయితే అభిషేక్ నామా ఇప్పుడు డైరెక్టర్గా మారి.. నాగబంధం అనే మూవీకి దర్శకత్వం చేసి పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. విజువల్ వండర్గా తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా విజయ్ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అభిషేక్ నామా. వరల్డ్ ఫేమస్ లవర్ వల్ల అంత నష్టం వచ్చినా.. మేం విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్లి ఒక్క రూపాయి కూడా అడగలేదు, అలాగే నష్టాన్ని కొంతైనా రికవరీ చేసుకోవడానికి మా బ్యానర్లో ఆయన ఓ సినిమా చేస్తాడని మూడేళ్లుగా ఎదురుచూశాం. కానీ విజయ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని అభిషేక్ వ్యాఖ్యానించారు.
అలాగే ఓ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో గొడవపై యాంకర్ ప్రశ్నించగా.. అభిషేక్ తనదైన శైలిలో స్పందించారు. ఆయనతో ఓ మంచి సినిమా తీస్తే అన్ని గొడవలు సాల్వ్ అయిపోతాయి. సినిమా ఇండస్ట్రీ అంటే ఓ కుటుంబం లాంటిది. చిన్న చిన్న వివాదాలు సహజం, గొడవలు జరుగుతాయి, మళ్లీ కలిసిపోతామని అభిషేక్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యాయి.


Click it and Unblock the Notifications



