ఆచార్య కథ కొరటాల శివ కష్టార్జితం.. కాపీ కొట్టలేదు.. రూమర్లపై ‘మ్యాట్నీ’ క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఆచార్య చిత్రంపై వస్తున్న రూమర్లను, ఏర్పడిన వివాదంపై చిత్ర యూనిట్ స్పందించింది. ఈ సినిమాను నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. తమ చిత్రానికి కథ కాపీ అంటూ మీడియాలో వస్తున్న వార్తలను, అలాగే కొందరు చేస్తున్న ప్రకటనలపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం..

కొరటాల శివ స్వయంగా రాసిన కథ..
ఆచార్య సినిమాకు సంబంధించిన కథను దర్శకుడు కొరటాల శివ స్వయంగా ఒక్కరే రాశారు. ఈ సినిమా కథ కాపీ అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్కు మంచి స్పందన వచ్చింది. సమాజంలోని అన్ని వర్గాల నుంచి సానుకూలమైన స్పందన వ్యక్తం కావడం చిత్ర యూనిట్కు ఆనందం కలిగింది అని ప్రకటనలో పేర్కొన్నారు.

ఆచార్యపై తప్పుడు ప్రచారం తగదు
ఆచార్య సినిమాకు వస్తున్న ప్రజా, ప్రేక్షక స్పందన చూసిన తర్వాత కొందరు ఈ సినిమా కథ తమదే అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తమ కథను వారు కాపీ కొట్టారనే వార్తలు మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. ఈ కథకు సంబంధించిన విషయాలను చాలా గోప్యంగా ఉంచాం. మా సినిమా కథ యూనిట్లో అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. కేవలం మోషన్ పోస్టర్ ఆధారంగా కథ మాదే అంటూ క్లెయిమ్ చేసుకోవడం చాలా దారుణం అని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తన ప్రకటనలో తెలిపింది.
Recommended Video

ఎవరి కథను కాపీ కొట్టలేదు
ఆచార్య కథ మాదే అంటూ కొందరు చేస్తున్న వివాదాస్పద ప్రకటనలకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన జారీ చేశాం. ఆచార్య కథ ముమ్మాటికి మాదే. కొరటాల శివ రూపొందించిన ఒరిజినల్ కథ. ఎవరి కథను కాపీ కొట్టలేదు. కొరటాల శివను ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రయత్నాలు చేయడాన్ని అనుమతించే ప్రసక్తి లేదు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న ఊహజనిత కథనాలు, రూమర్లకు ఎలాంటి సంబంధం లేదు అని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఆచార్య
ఆచార్య కథ మాదే అంటూ చేస్తున్న ప్రకటనలకు, మాకు ఎలాంటి సంబంధం లేదు. అవన్నీ ఊహాగానాలే. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ సమర్పిస్తున్న ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నది. ప్రస్తుతం ఆచార్య షూటింగు దశలో ఉంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను చేరుకొనేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











