వారణాసిలో సాధువులంతా నకిలీలే.. హీరో ఆర్య వ్యాఖ్యలపై భగ్గుమన్న హిందూ సంఘాలు
తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్య (Arya). తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. ఆయన నటిస్తున్న తాజా స్పై యాక్షన్ థ్రిల్లర్ మిస్టర్ ఎక్స్ (Mr.X) ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వారణాసి సాధువులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏప్రిల్ 17న విడుదల కానున్న ఈ సినిమా నేపథ్యంలో ఆయన పంచుకున్న అనుభవాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?
ఆర్య తన కెరీర్ ప్రారంభ దశలో నటించిన 'నాన్ కడవుల్' సినిమా షూటింగ్ సమయంలో వారణాసిలో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడి జీవన విధానం, ముఖ్యంగా అఘోరాలు, సాధువుల జీవితాన్ని దగ్గరగా పరిశీలించాల్సి వచ్చింది. అయితే, అదే సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువయ్యాయి.

ఆర్య చెప్పిన ప్రకారం.. వారణాసిలో ఉన్న సాధువులలో చాలామంది నిజమైనవారే అయినప్పటికీ, కొంతమంది మాత్రం సాధువుల వేషంలో నేరస్థులు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. సుమారు 40 శాతం వరకు నకిలీ స్వాములు ఉంటారని, వీరిలో కొందరు నేరాలు చేసి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆ వేషంలో తిరుగుతున్నారని అన్నారు. "పేరు అడిగితే 'స్వామి' అని మాత్రమే చెబుతారు. ఐడీ ప్రూఫ్ ఉండదు. ప్రస్తుతం అక్కడే ఉంటూ తర్వాత అక్కడి నుంచి పోతారు'అని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇంటర్వ్యూలో భాగంగా కుంభమేళా సమయంలో జరిగిన ఒక అనుభవాన్ని కూడా ఆర్య పంచుకున్నారు. షూటింగ్ కోసం వెళ్లినప్పుడు పోలీసులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారని తెలిపారు. "మా దగ్గర సాధారణ ఆయుధాలే ఉన్నా, జనసమూహంలో కొందరి వద్ద అధునాతన ఆయుధాలు కూడా ఉండే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు" అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.
హీరో ఆర్య చేసిన ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ముఖ్యంగా హిందూ సంఘాలు, ఆధ్యాత్మిక వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారణాసి వంటి పవిత్ర స్థలంలో నివసించే సాధువులను నేరస్థులతో పోల్చడం సరిగ్గా లేదని విమర్శిస్తున్నారు. 'సినిమా ప్రమోషన్ కోసం మతపరమైన అంశాలను తప్పుగా చూపించడం తగదు'అంటూ మండిపడుతున్నారు. ఇక మరోవైపు కొందరు మాత్రం ఆర్యకు మద్దతు ఇస్తున్నారు. 'అతను తన అనుభవాలను మాత్రమే పంచుకున్నాడు. వాస్తవాలు చెప్పడంలో తప్పు లేదు' అని అభిప్రాయపడుతున్నారు. ఇలా రెండు వర్గాల మధ్య చర్చకు దారితీసింది.
'మిస్టర్ ఎక్స్'పై ప్రభావం?
ఈ మిస్టర్ ఎక్స్ సినిమా రిలీజ్ పై ప్రభావం చూపుతుందా అనే ప్రశ్న కూడా ఇప్పుడు ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో ఇప్పటికే #BoycottMrX వంటి హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుండటం. ఈ నిర్మాణ చిత్ర యూనిట్ కొంత ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.
ఈ సినిమాకు దర్శకుడు మను ఆనంద్ కాగా, ఇందులో గౌతం కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా, ఇప్పుడు వివాదం కారణంగా మరింత హైలైట్ అవుతోంది.
ఇప్పటివరకు ఈ వివాదంపై ఆర్య నుంచి అధికారిక క్లారిటీ రాలేదు. అయితే ఆయన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అనుభవాల ఆధారంగా చెప్పినవేనా? లేక అతిశయోక్తి ఉందా? అనే చర్చ దానిపై కొనసాగుతోంది. సినీ వర్గాలకు ఈ వివాదం తాత్కాలికమేనని, సినిమా విడుదల తర్వాత అసలు ఫలితం తెలుస్తుందని భావిస్తున్నారు. అయితే.. ఈ వివాదం ఆర్య కెరీర్పై, అలాగే మిస్టర్ X సినిమా ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications




















