దుర్మార్గం.. పవన్ కల్యాణ్పై విరుచుకుపడ్డ ఆర్ నారాయణమూర్తి
తెలుగు సినిమా ఇండస్ట్రీలోని డిస్ట్రిబ్యూషన్ రంగంలో పర్సంటేజీ విధానం ప్రవేశపెట్టి నిర్మాతలను ఆదుకోవాలనే డిమాండ్ వివాదాస్పదమైంది. అయితే ఆ డిమాండ్ హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకోవడానికే థియేటిర్ల బంద్ ప్రకటించారనే విషయం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అయితే ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారో తెలియజేయాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఈ విషయంపై సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతుండగానే..నిర్మాత, నటుడు, ఆర్ నారాయణమూర్తి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ...
హరిహర వీరమల్లు సినిమాను ఆపేందుకు థియేటర్ల బంద్ ప్రకటిస్తున్నారనే మాట రావడం దుర్మార్గం. అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్ర వెనుక ఎవరు ఉన్నారని స్వయంగా పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి, స్వయంగా సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేవి సినిమా పరిశ్రమకు పాలన సంస్థలు. ఆ రెండు సంస్థలు బంద్ ప్రకటిస్తామని ఎప్పుడూ చెప్పలేదు అని నారాయణమూర్తి స్పష్టం చేశారు.
బంద్ అనే ప్రజాస్వామ్యంలో బ్రహ్మాస్త్రం. నిబంధనల ప్రకారం ఎవరైనా బంద్ ప్రకటించే ముందు మూడు వారాల ముందే ప్రకటించాలి. ఎవరైనా బంద్ ప్రకటించాలనుకొంటే మూడు వారాల ముందే నిర్మాతలకు తెలియపరచాలి. రిలీజ్ డేట్ ఎవరు ప్రకటించారో వారు ఇబ్బంది పడకుండా తెలియపరచాలి. నియమ నిబంధనల ప్రకారం అది జరగాల్సిందే. జూన్ 1వ తేదీన బంద్ ప్రకటిస్తే.. అది హరిహర వీరమల్లుకు ఎలా వర్తింప చేస్తుందో చెప్పాలి. అది కరెక్ట్ కాదు అని నారాయణ మూర్తి అన్నారు.

పవన్ కల్యాణ్ మీద ఎవరు కుట్ర పన్నుతారు? చలన చిత్ర పరిశ్రమలో నటుడిగా, సీఎంగా ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి. ఆయనను ఎంత గర్విస్తామో.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ను చూసి జనం గర్విస్తున్నారు. జనసేన పార్టీ పెట్టి ఆంధ్రాలో డిప్యూటీ సీఎం అయ్యారు. హ్యాట్సఫ్ టూ పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ను మేము వ్యతిరేకించడం లేదు. పవన్ కల్యాణ్ ఆఫీస్ నుంచి అలాంటి ప్రకటన రావడం కరెక్ట్ కాదు.ఒకే సమస్య ఉంటే.. వచ్చిందనుకొండి.. దానిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి అని నారాయణ మూర్తి అన్నారు.
హరిహర వీరమల్లును ప్రస్తావించకుండా డిప్యూటీ సీఎంగా మీరు సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సినిమా పరిశ్రమ పెద్దలను చర్చలకు ఆహ్వానించి ఉంటే.. ఓ చలన చిత్ర పరిశ్రమ బిడ్డగా ఎంత గౌరవించే వాళ్లం. మీరు అలాంటి పనిని ఇప్పటికైనా చేయండి. పర్సంటేజీ సిస్టమ్ ద్వారా సినీ పరిశ్రమకు మేలు జరుగుతుంది. అది లేకపోవడం వల్ల సగటు నిర్మాత నష్టపోతున్నాడు అని నారాయణ మూర్తి అన్నారు.
ఓటీటీలు, ఇతర సాంకేతిక అంశాలు వచ్చిన తర్వాత సింగిల్ థియేటర్లకు ఉనికి లేకుండా పోతున్నాయి. తెలంగాణలో 500 సింగిల్ థియేటర్లు ఉంటే.. అవి 250కి వచ్చాయి. ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. సిని పరిశ్రమలో ఇది పెద్ద సమస్య. పర్సంటేజీ సమస్య 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఈ సమస్య కొలిక్కి వచ్చే స్థితిలో హరిహర వీరమల్లు సినిమాకు లింక్ పెడుతారా? దానికి దీనిక ఏం సంబంధం ఏమిటి? ఈ సమస్యను పక్క దోవపట్టించారు. ఈ సమస్యపై దృష్టి పెట్టాలని పవన్ కల్యాణ్కు, చంద్రబాబుకు రిక్వెస్ట్ చేస్తున్నాను అని అన్నారు.
మల్టీప్లెక్స్ థియేటర్లలో రేట్లు మండిపోతున్నాయి. పాప్ కార్న్ 500 రూపాయలా? భీభత్సకరమైన టికెట్ రేట్లు, ఇలాంటి ఎన్నో విషయాల వల్ల ప్రేక్షకుడికి వినోదం దూరమవుతున్నది. అలాంటి వినోదాన్ని ప్రభుత్వ విధానాలు దూరం చేస్తున్నాయి. పర్సంటేజ్ విధానం రావాలి. నిర్మాతలకు కావాలి. ఇది డిమాండ్ 25 ఏళ్ల నుంచి ఉంది. చాలా మంది నిర్మాతలకు రిక్వెస్ట్ చేశాం. కానీ అమలు కాలేదు. చాలా మంది నిర్మాతలు, దర్శకులు ధర్నా చేశాం. కానీ ఏమీ కాలేదు. రామానాయుడు కూడా అప్పట్లో పర్సంటేజ్ సిస్టమ్ కావాలన్నారనే విషయాన్ని నారాయణ మూర్తి చెప్పారు.


Click it and Unblock the Notifications











