'మా నాన్న చనిపోతే సూసైడ్ ప్రచారం.. మండిపోయిం వాళ్లకి ఫోన్ చేసి'
యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ఖాతాలలో సెలబ్రెటీలపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా సినీరంగానికి చెందినవారు ట్రోలర్స్కు ఎక్కువ టార్గెట్ అవుతున్నారు. వ్యూస్ , డబ్బు, పాపులారిటీ కోసం కొందరు ఇలాంటి పనులు చేస్తుంటే.. మరికొందరు మాత్రం పైశాచిక ఆనందం కోసం దిగజారిపోతున్నారు. ఫలానా హీరోయిన్ ఫలానా హీరోతో తిరుగుతోందని.. ఉన్నది లేనిది కల్పించి రాస్తుండటంతో వారి క్యారెక్టర్పై తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి.
ఇంకొందరైతే గుండ్రాయిలా ఉన్న సెలబ్రెటీని చనిపోయినట్లుగా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎవరైనా స్టార్ స్వల్ప అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరితే చాలు వారి పరిస్థితి విషమంగా ఉందని, కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారని వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. మొన్నామధ్య ఓ సీనియర్ నటుడు చనిపోయాడంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంతో ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. సదరు నటుడు తాను క్షేమంగా ఉన్నానని స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సెలబ్రెటీలు మీడియా సమావేశాల్లో ఏదైనా విషయంపై మాట్లాడితే దానికి నానా రకాలుగా పెడర్ధాలు తీసి .. అసలు మ్యాటర్ను డైవర్ట్ చేయడంతో అది కాస్తా వివాదాస్పదమై కూర్చోంటోంది. కానీ ఇటీవల ఈ ట్రోలింగ్ హద్దులు దాటుతోంది. నటీనటుల వ్యక్తగత జీవితంలోకి చొరబడి వారి భార్యాబిడ్డలను, కుటుంబ సభ్యులను సైతం బజారుకీడుస్తున్నారు. పరువు పోతుందనే భయంతోనో, ట్రోలర్స్ మరింత రెచ్చిపోతారనే భయంతోనో చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయం లేదు. వందల్లో ఉండే ఈ యూట్యూబ్ ఛానెళ్లు , సోషల్ మీడియా ఖాతాలు ఎక్కడ నుంచి నడుస్తున్నాయో, ఎవరు నడుపుతున్నారో తెలియదు. ఈ మధ్య వీరి ఆగడాలు శృతి మించుతుండటంతో మా అధ్యక్షుడు మంచు విష్ణు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని ఛానెళ్లను టెర్మినెట్ చేయించారు కూడా.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ట్రోలింగ్పై కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు రాజీవ్ కనకాల. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సుమారు 250 ఛానెల్స్ నటీనటులపై ట్రోలింగ్ చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. ఓ ఫంక్షన్కు వచ్చిన తన కూతురిపై లేనిపోనివి రాశారని రాజీవ్ మండిపడ్డారు. తాను ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇస్తే వాళ్లు బాగా ఎడిట్ చేసి పబ్లిష్ చేశారని.. అయితే సదరు ఛానెల్ అనుబంధ మరో సబ్ ఛానెల్ తన వీడియోను ముక్కలు ముక్కలుగా కట్ చేసి షార్ట్స్ పెట్టిందని ఆయన తెలిపారు.

ఆ ముక్కల్లో ఓ వీడియోకి సూసైడ్ చేసుకుని చనిపోయిన దేవదాస్ కనకాల అని థంబ్ పెట్టారని రాజీవ్ వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో మా నాన్న సూసైడ్ చేసుకునే పరిస్ధితులు వచ్చాయని ఒక మాట చెప్పానని.. దానిని బేస్ చేసుకుని ఫేక్ న్యూస్ వైరల్ చేశారని .. ఆ థంబ్ చూడగానే తనకు ఎక్కడో కాలిందన్నారు. ఇంటర్వ్యూ తీసుకున్న వ్యక్తికి ఫోన్ చేస్తే.. ఆయన సారీ చెప్పి వెంటనే థంబ్ మార్చారని రాజీవ్ కనకాల గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











