Shivaji: ఎవరికీ భయపడను.. నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను.. వివాదంపై శివాజీ క్లారిటీ
ప్రముఖ నటుడు శివాజీ (Shivaji) హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల్లో ఉపయోగించిన భాష అసభ్యకరంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీంతో శివాజీ వెంటనే స్పందిస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన తన మాటలను తానే విశ్లేషించుకుంటూ, ప్రసంగంలో రెండు అనవసరమైన మరియు అసభ్య పదాలు వాడటం పెద్ద తప్పేనని అంగీకరించారు. 'నేను మాట్లాడింది పూర్తిగా తప్పు. ఆ పదాలు నా నోటినుంచి రావాల్సింది కాదు'అంటూ స్పష్టంగా క్షమాపణ తెలిపారు.
ఉద్దేశం ఏదైనా కావచ్చు కానీ, భాష తప్పుగా ఉన్నప్పుడు దాన్ని సమర్థించుకోవడం సరికాదని, తప్పును ఒప్పుకోవడమే నిజమైన సంస్కారం అని ఆయన వ్యాఖ్యానించారు. అయినా ఈ వివాదానికి అడ్డుకట్ట పడటంతో మరోసారి మీడియా ముందుకు వచ్చి, బహిరంగంగా క్షమాపణ చెప్పారు. బుధవారం నాడు నటుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ హీరోయిన్ దుస్తులపై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ..తాను ఎవరికి భయపడటం లేదనీ, తన స్టేట్మెంట్కు తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఆ వ్యాఖ్యల సందర్భంలో రెండు అసభ్య పదాలు ఉపయోగించినందుకు మాత్రం బహిరంగంగా క్షమాపణ చెప్పారు.

తన 30 ఏళ్ల సినీ జీవితంలో ఎప్పుడూ అలా మాట్లాడలేదని, రాజకీయాల్లో ఉన్న సమయంలో కూడా ఎవరినీ హద్దు మీరి ఒక్క మాట అనలేదని శివాజీ గుర్తుచేశారు. 'ఆ రోజు వేదికపై ఉన్న నా తోటి నటీనటులకు, ముఖ్యంగా ఆడ బిడ్డలకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. అలాంటి పదాలు అస్సలు దొర్లకూడదు. అవి నా నోటి నుంచి రావాల్సినవే కాదు' అని అన్నారు.
'ఈవెంట్లో నేను ఎందుకు అలా మాట్లాడానా అని చాలా బాధపడ్డాను. బయటకు రాగానే ఇది నా తప్పే అని అర్థమైంది. అందుకే మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను' అని చెప్పారు. ' నేను ఇచ్చిన స్టేట్మెంట్కు భయపడాల్సిన అవసరం లేదు. కానీ, ఆ రెండు పదాలు మాత్రం మాట్లాడటం తప్పు. ఆ తప్పు నాదే' అనే మరోసారి క్షమాపణ చెప్పారు. ఈ ఘటన తర్వాత తాను 36 గంటలుగా నిద్రపోలేదని, తనలో తీవ్ర అంతర్మథనం మొదలైందని తెలిపారు. 'రాజకీయాల్లోనూ తప్పుగా మాట్లాడని నేను ఇలా ఎలా మాట్లాడానా? అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను' అన్నారు.
అందుకే గత మూడ్నాలుగు రోజులుగా సినిమా ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని, ఆ తర్వాత నిర్మాతకు తానే ప్రెస్మీట్ పెట్టాలని చెప్పినట్లు వెల్లడించారు. నిర్మాత మాత్రం 'వివాదం అవుతుందేమో' అని ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. అయినప్పటికీ, సినిమా కోసం పారితోషికం తీసుకున్నందున తన వంతు బాధ్యతగా ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉందని శివాజీ స్పష్టం చేశారు.
తన సినీ ప్రయాణంలో తాను ఎన్నడూ అలా మాట్లాడలేదని, కానీ, ఈవెంట్లో ఎందుకు అలా మాట్లాడానా? అని తనలో తానే బాధపడ్డానని చెప్పారు. అయితే ఆ రెండు పదాలు మహిళా కమిషన్ వరకూ వెళ్లాల్సినంత పెద్ద తప్పేనా? ఇండస్ట్రీలో తనకంటే తీవ్రమైన పదాలు ఎవరూ వాడలేదా? అంటూ ప్రశ్నించారు. తన స్టేట్మెంట్కు మాత్రం కట్టుబడి ఉన్నానని చెబుతూ.. 'మంచి బట్టలు వేసుకోమని చెప్పడం తప్పా?'అని నిలదీశారు. అలాగే ఈ వివాదంలో అనసూయ, చిన్మయి ఎందుకు జోక్యం చేసుకున్నారో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
చివరగా 'దండోరా' సినిమాపై కూడా మాట్లాడారు. 'ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లలో ఈ సినిమాను చూడాలి. సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థను గాఢంగా స్పృశించే కథ ఇది. మనుషులు ఉన్నంతకాలం ఈ అసమానతలు ఉంటాయి. అలాంటి బలమైన కథతో దండోరా మూవీని తీర్చిదిద్దారు' అని అన్నారు.


Click it and Unblock the Notifications











