Sivaji: ఇండస్ట్రీలో నాపై కుట్ర.. మంచి చెప్పడం కూడా తప్పేనా?
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ (Sivaji)చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, పలువురు సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు కూడా తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ (Telangana Commission for Women) ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని, శివాజీకి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల మేరకు శివాజీ నేడు(శనివారం) మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.విచారణ అనంతరం శివాజీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఇండస్ట్రీలో నాపై కుట్ర జరుగుతుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
మహిళా కమిషన్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా శివాజీ, తన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇండస్ట్రీలో తనపై కొంతమందికి వ్యతిరేకత ఉందని, అదే ఇప్పుడు స్పష్టంగా బయటపడుతోందని అన్నారు. 'నాపై కుట్ర జరుగుతోంది. కొందరు జూమ్ మీటింగ్స్ పెట్టుకుని మరీ నన్ను టార్గెట్ చేస్తున్నారు'అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటలను సందర్భం లేకుండా తీసుకుని పెద్ద రచ్చ చేస్తున్నారని తెలిపారు.

'దండోరా' సినిమా ఫంక్షన్లో తాను మాట్లాడిన మాటలు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారని శివాజీ చెప్పారు. ఆ ఈవెంట్లో తాను ఆవేశంలో కొన్ని మాటలు మాట్లాడినప్పటికీ, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఎక్కువగా తండ్రి పాత్రలు చేస్తున్నానని, ఆ సందర్భంలో తన పిల్లలకు చెప్పినట్లుగా భావోద్వేగంతో మాట్లాడానని వివరించారు. అయితే ఆ మాటలను నెగిటివ్ కోణంలో చూపిస్తూ తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు.
మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం తనకు బాధ కలిగించినప్పటికీ, అది ఒక చట్టబద్ద సంస్థ కాబట్టి గౌరవంతో విచారణకు హాజరయ్యానని శివాజీ తెలిపారు. కమిషన్ ఎదుట తన వివరణను పూర్తిగా ఇచ్చానని, తన మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమాపణలు కూడా చెప్పానని అన్నారు. 'రెండు మాటలు ఆవేశంలో మాట్లాడాను. అవే ఇప్పుడు పెద్ద సమస్యగా మారాయి. ఇప్పటికే సారీ చెప్పాను. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి' అంటూ కమిషన్ ఎదుట వేడుకున్నట్లు వెల్లడించారు.
తాను ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశంతో మాట్లాడలేదని శివాజీ మరోసారి స్పష్టం చేశారు. 'సంస్కృతి గురించి చెప్పాలన్న ఉద్దేశం మాత్రమే ఉంది. కానీ నా మాటలు వక్రీకరించబడ్డాయి. నా వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను' మరోసారి క్షమాపణ చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పినందుకు ఇంత పెద్ద వివాదం చేయడం బాధాకరమని, 'నేను ఏం తప్పు చేసానని నా మీద ఇంత కోపం చూపిస్తున్నారు?'అంటూ తన ఆవేదనను బయటపెట్టారు.
ఇదే సమయంలో ఈ వివాదం వెనుక జరుగుతున్న కొన్ని కీలక విషయాలను కూడా శివాజీ ప్రస్తావించారు. తనతో పాటు కెరీర్ ప్రారంభించిన కొంతమందికే తనపై కోపం ఉందని, తన వ్యాఖ్యల తర్వాత నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొందరు జూమ్ మీటింగ్స్ పెట్టుకుని చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు. 'ఎవరి బట్టలు వారు వేసుకుంటారు. దానికి నాకేంటి? మీ అమ్మానాన్నలు మీ ఇంట్లో మీకు జాగ్రత్తలు చెప్పరా?'అంటూ ప్రశ్నించారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిపై ఇలానే స్పందించారా అని కూడా ఆయన ప్రశ్నించారు.
అయితే, భారతీయ మహిళల సంప్రదాయం, సంస్కృతి ప్రపంచానికి దేశాన్ని గుర్తింపజేస్తుందని తన ఉద్దేశమని శివాజీ చెప్పారు. '180 దేశాలు ఉన్నా... సారి కట్టుకున్న వారిని చూసి ఇది భారతదేశం అని ప్రపంచం గుర్తిస్తుంది' అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తన మాటలు వ్యక్తిగత ఎంపికలను తాకినట్లుగా అనిపించాయని అంగీకరించారు. అదే ఈ వివాదానికి కారణమైందని తెలిపారు.
చివరిగా, సినిమాలే తన జీవితమని కాదని శివాజీ స్పష్టం చేశారు. 'సినిమా లేకపోతే వ్యవసాయం చేసుకుని బతుకుతాను. నాకు 30 ఎకరాల పొలం ఉంది. నాకు విలువలు, ఆత్మగౌరవం ముఖ్యం' అంటూ తాను ఎవరికీ భయపడననీ, తన స్టేట్ మెంట్స్ ను వెనక్కి తీసుకోలేదన్నారు. మొత్తం మీద మహిళా కమిషన్ ముందు హాజరైన తర్వాత శివాజీ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే, తన వ్యాఖ్యల్లో తప్పుడు ఉద్దేశం లేదని, అయితే మాటలు తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వివాదం పెద్దదైందని ఆయన భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











