కొందరు అలా దెబ్బకొట్టారు... డ్రగ్స్ కేసుపై నటి హేమ షాకింగ్ కామెంట్స్
అక్క, అమ్మ, వదిన, క్యారెక్టర్లతో టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక వెలుగు వెలిగారు హేమ. సినిమాలలో సాఫ్ట్గా కనిపించే హేమ.. నిజ జీవితంలో ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. మనసులో ఏమున్నాసరే కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం ఆమె శైలి. ఈ విషయంలో ఎన్నోసార్లు వివాదాల్లో ఇరుక్కున్నారు. ప్రస్తుతం ఒకటి అరా తప్పించి పెద్దగా సినిమాలలో నటించడం లేదు. అయితే హేమ జీవితంలో బెంగళూరు డ్రగ్స్ కేసు మచ్చలా మారిపోయింది. తొలుత ఆమె పేరు తెరపైకి వచ్చినప్పటికీ.. కోర్టు హేమను నిర్దోషిగా ప్రకటించింది.
2024 మే 19న కర్ణాటక రాజధాని బెంగళూరు నగర శివార్లలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్హౌస్లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు చేశారు. మద్యం సేవించడంతో పాటు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న అభియోగాలపై దాదాపు 88 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో సినీ నటి హేమ పేరు కూడా వినిపించింది. తాను బెంగళూరు వెళ్లిన మాట వాస్తవమేనని, కానీ తాను ఎలాంటి మత్తు పదార్ధాలు తీసుకోలేదని హేమ స్పష్టం చేసింది. దీనిపై బెంగళూరు పోలీసులు హేమను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఆ తర్వాత సుదీర్ఘ కాలం విచారణ జరగ్గా.. 2025 జనవరి 2న బెంగళూరు కోర్టు ఈ కేసులో హేమ డ్రగ్స్ వినియోగించలేదని నిర్ధారిస్తూ నిర్దోషిగా క్లీన్చిట్ ఇచ్చింది. ఆ సమయంలోనే హేమ ఎమోషనల్ అయ్యారు. డ్రగ్స్ తీసుకోలేదని చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు.. దీని వల్ల మా అమ్మ, నేను, నా కుటుంబం మానసిక ఆవేదన అనుభవించింది. డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయిన వారంతా డ్రగ్స్ తీసుకున్నారని కాదు.. జైలుకు వెళ్లినంత మాత్రాన ఎవరూ నేరం చేసినట్లు కాదని హేమ అన్నారు.
అయితే కేసు జరుగుతున్న సమయంలో హేమ గురించి మీడియాలో, సోషల్ మీడియాలో దారుణమైన కథనాలు వచ్చాయి. ఆమె వ్యక్తిత్వం, కుటుంబం గురించి వార్తలు వచ్చాయి. దీనిపై అప్పట్లోనే హేమ వార్నింగ్ ఇచ్చారు. తాను ఏ తప్పూ చేయలేదని, అనవసరంగా నా కుటుంబాన్ని వివాదంలోకి లాగొద్దని మండిపడ్డారు. తాజాగా హైదరాబాద్లోని తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్తో జరిగిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు డ్రగ్స్ కేసులో నాకు పాజిటివ్ అని రాకుండానే.. వచ్చినట్లుగా కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఊహా తెలిసినప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను.. నేనేంటో, నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. నాకు కూడా ఫ్యామిలీ ఉంది, మా బాధలు, ఇబ్బందులు కూడా అర్థం చేసుకోండి. వార్తలు రాసేముందు ఒకటి పదిసార్లు నిర్ధారించుకున్నాకే రాయాలి. ఇదంతా చూస్తుంటే దాసరి నారాయణరావు గారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. నా మీద కేసు నమోదైనప్పుడు మీడియా ఉత్సాహంగా చాలా వార్తలు రాసింది. అలాంటప్పుడు నిర్దోషిగా విడుదలయ్యాక కూడా అదే స్థాయిలో వార్తలు రాయాలి, కానీ తక్కువ మంది మాత్రమే రాశారు.
డ్రగ్స్ కేసు సమయంలో కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని అసభ్య ప్రచారం చేస్తూ బురద జల్లాయి. మొత్తం మీడియాను నేను ఒకేగాటిలో కట్టేయడం లేదు. నిజాయితీగా వ్యవహరించే సంస్థలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో మీరంతా నాకు అండగా ఉంటారని ఆశిస్తున్నా. డ్రగ్స్ కేసు సమయంలో నాతో పాటు నా కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడింది. అది చాలా కఠినమైన సమయం. నాపై వచ్చిన ఆరోపణలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. మానసికంగా కృంగిపోయా.. ఒకానొక దశలో నేను చచ్చిపోవాలని అనుకున్నా. అయితే ఏ తప్పు చేయని నేను, చివరికి నిర్దోషిగానే బయటకు వచ్చానని హేమ గుర్తుచేసుకున్నారు.


Click it and Unblock the Notifications

















