బంగారాన్ని మించి బ్లూ డ్రమ్ముల ధరలు.. మహిళల మోజుపై నటి హేమ
వివాహేతర సంబంధాల మోజులో పడి భర్తలను చంపుతున్న భార్యలు దేశంలో ఎక్కువైపోతున్నారు. పడక సుఖానికి అలవాటుపడి, ప్రియుడితో బంధానికి అడ్డుగా ఉన్న వారిని కిరాతకంగా చంపేస్తున్నారు. కట్టుకున్న భర్తనే కాదు.. తల్లిదండ్రులు, అత్తమామలు, నవమాసాలు మోసిన బిడ్డల్ని సైతం బలి చేస్తున్నారు. చివరికి ఈ నేరాలు బయటపడి జైళ్లలో మగ్గుతూ అటు పుట్టింటికి, ఇటు మెట్టినింటికీ కళంకం తీసుకొస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు.. కొందరు తల్లుల కారణంగా అనాథలుగా మారుతున్నారు.
సంచలనం కలిగించిన బ్లూ డ్రమ్ కేసు
ప్రతినిత్యం దేశంలో భార్యల చేతుల్లో మరణిస్తున్న భర్తల కేసులు పెరుగుతున్నాయి. ఈ హత్యలను కూడా విభిన్నంగా, కనీసం ఊహకి కూడా అందని విధంగా చేస్తూ పోలీసులకు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నారు భార్యలు. ఈ మధ్యకాలంలో బ్లూ డ్రమ్ అంటే చాలు మగాళ్లు వణికిపోతున్నారు. గతేడాది ఉత్తరప్రదేశ్కు చెందిన ముస్కాన్ రస్తోగి అనే మహిళ.. ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని డెడ్ బాడీని 15 ముక్కలుగా కోసి.. బ్లూ డ్రమ్లో వేసి.. సిమెంట్తో సీల్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నాటి నుంచి కొన్ని కేసుల్లో భర్తలను చంపేందుకు భార్యలను బ్లూ డ్రమ్లను వాడుతూ పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా బ్లూ డ్రమ్లు, ఆడవాళ్ల మైండ్సెట్పై సంచలన వ్యాఖ్యలు చేశారు నటి హేమ.

క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హేమ హవా
లేడీ కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు హేమ. తల్లి, అక్క, వదిన, అత్త తదితర పాత్రలలో నటిస్తూ కొన్నేళ్ల పాటు తన హవా చూపించారు. గోదావరి యాసలో తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు హేమ. మనసులో ఏమున్నా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. సినిమాలతో పాటు బిగ్బాస్లోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడా సత్తా చాటారు. కొద్దినెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పేరు తెరపైకి రాగా.. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత హేమకు కోర్ట్ క్లీన్ చీట్ ఇచ్చింది. సినిమాలలో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో హేమ గతంలో మాదిరిగా కనిపించడం లేదు.
అనన్య నాగళ్ల లీడ్ రోల్లో
చాలా రోజుల తర్వాత హేమ నటించిన మూవీ లేచింది మహిళా లోకం. అనన్య నాగళ్ల, శ్రీరామ చంద్ర జంటగా నటించగా.. శ్రద్ధా దాస్, మంచు లక్ష్మీ, హరితేజ, హర్షవర్ధన్, సుప్రీత, భద్రం, జెమిని అశోక్లు కీలకపాత్రలు పోషించారు. బృహస్పతి ఎంటర్టైన్మెంట్స్ అండ్ అప్పారెంట్లీ సినిమా అండ్ స్టోరీ టెల్లర్స్ బ్యానర్పై హైమా రాజశేఖర్, శ్వేత మహీ, నిరోషా నవీన్లు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు అర్జున్ - కార్తీక్లు దర్శకత్వం వహించారు. జాగ్జ్ సినిమాటోగ్రాఫర్గా, అనిల్ కుమార్ ఎడిటర్గా వ్యవహరించారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ నేపథ్య సంగీతం అందించారు. మార్చి 26న లేచింది మహిళా లోకం రిలీజ్ కానుంది.
బ్లూ డ్రమ్ల కాస్ట్ పెరిగిపోయింది
తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత ప్రసాద్ ల్యాబ్స్లో అలా అడుగుపెడుతూ మీ అందరి మధ్య నడిచి వస్తుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంది. నా సీనియర్ మీడియా మిత్రులందరినీ కలుసుకున్నాను.. అందరితో మాట్లాడాను, చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ మీరంతా చూశారు కదా .. చాలా బాగుంది కదా? మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక కోతి ఉంటేనే వనమంతా చెడగొడుతుంది కదా.. అలాంటిది ఇన్ని కోతులు ఉంటే ఏమవుతుందో ఆలోచించారా? సినిమా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఈ మధ్యన బంగారం కంటే బ్లూ డ్రమ్ముల కాస్ట్ బాగా ఎక్కువైందట. లేడీస్కి బంగారం అంటే ఎంత ఇష్టమో ఆలోచించండి.. కానీ బంగారం కూడా కొనడం మానేసి బ్లూ డ్రమ్ములు కొంటున్నారు. అది ఎందుకు కొంటున్నారు? ఏంటీ? అని మీరు తెలుసుకోవాలనుకుంటే 26వ తారీఖున థియేటర్లకు వచ్చేయండి అంటూ ముగించారు హేమ. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications















