నన్ను టార్గెట్ చేస్తే ఇంటికొచ్చి కూర్చుంటా.. హేమ సీరియస్ వార్నింగ్!
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, లేడీ కమెడియన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ( Hema) మరోసారి వార్తల్లో నిలిచారు. గతేడాది సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఆమె పేరు వినిపించడం పెద్ద చర్చకు దారితీసింది. ఆ కేసు కారణంగా ఆమె ఇమేజ్కు భారీగా నష్టం జరిగిందని అప్పట్లో సినీ వర్గాలు భావించాయి.
అయితే ఈ కేసులో హేమకు పెద్ద ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు హేమపై నమోదైన కేసును కొట్టివేసింది. దీంతో చాలా కాలంగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. కానీ, కొంత మంది ట్రోలర్స్ ఆమెను టార్గెట్ చేస్తున్నారట. వారికి నటి హేమ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ ఏమన్నారంటే?

ఈ నేపథ్యంలో హేమ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసి తన మనసులోని భావాలను పంచుకున్నారు. కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని, తాను ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానం కూడా నిర్ధారించిందని ఆమె పేర్కొన్నారు. వీడియోలో మాట్లాడిన హేమ, "హైకోర్టు నా కేసును కొట్టివేసింది. నాపై ఉన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేలింది. యూరిన్ టెస్ట్లు కూడా నెగెటివ్ వచ్చాయి. ఆ విషయాన్ని కూడా నేను ప్రజలకు చెప్పాను. నేను కేవలం ఆ పార్టీకి ఆహ్వానం రావడంతో వెళ్లాను. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. మొదటి నుంచి ఇదే విషయం చెబుతున్నాను" అని వివరించారు.
అయితే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో కొందరు తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఫేక్ అకౌంట్ల ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తున్న వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "నేను తప్పు చేయలేదని కోర్టు చెప్పింది. అయినా కొందరు ఇప్పటికీ రేవ్ పార్టీలు, డ్రగ్స్ అంటూ నాపై పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తున్నారు. ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కుని ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. అలాంటి అకౌంట్లను గుర్తించడం పెద్ద విషయం కాదు" అని హెచ్చరించారు.
అంతేకాదు, భవిష్యత్తులో తనపై దుష్ప్రచారం కొనసాగిస్తే లీగల్ యాక్షన్ తీసుకోవడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. "ఇంకోసారి నా పోస్టుల కింద ఇలాంటి కామెంట్లు చేస్తే నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఇది వార్నింగ్ అనుకున్నా, రిక్వెస్ట్ అనుకున్నా మీ ఇష్టం. కానీ నా గురించి తప్పుడు ప్రచారం చేయడం ఆపండి" అని ఘాటుగా స్పందించారు.
దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన హేమ, ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఇక తాజాగా ఆమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా, రేవ్ పార్టీ కేసులో కోర్టు నుంచి ఊరట పొందిన తర్వాత హేమ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.


Click it and Unblock the Notifications




