చిరంజీవిని తిడతావా.. ఆ నటిని 50 మంది కలిసి, నేటికీ పీడకలే
మూడున్నర దశాబ్ధాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను మకుటం లేని మహారాజుగా ఏలుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. మూసలో కొట్టుకుపోతున్న టాలీవుడ్కు దూకుడు నేర్పించి కమర్షియల్ సినిమాకు కొత్త నిర్వచనం చెప్పారు చిరు. తన మార్క్ ఫైట్లు, డ్యాన్స్లు, డైలాగ్ డెలివరీ, డిఫరెంట్ మేనరిజంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. శరీరాన్ని పాదరసంలా మెలికలు తిప్పుతూ చిరంజీవి చేసే డ్యాన్స్కు యువత మైమరిచిపోయారు. తెలుగు సినిమా మార్కెట్ను, విస్తృతిని పెంచడంలోనూ చిరంజీవిది కీలకపాత్ర.
వసూళ్ల కుంభవృష్టి కురిపించినా, భారతదేశంలో కోటి రూపాయలు తీసుకున్న తొలి నటుడిగా అనిపించుకున్నా అది మెగాస్టార్కే సాధ్యం. దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పినట్లుగా ఒక తరాన్ని ఆయన శాసించారు. 80's, 90's కిడ్స్ మెగా టానిక్ తీసుకున్నారని వీరిలో చాలా మందిని ఇండస్ట్రీ వైపు నడిపించేలా ఆ టానిక్ పనిచేసిందని అనిల్ అన్నారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. వీరిలో దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు.

చిరంజీవి వేసిన బాటలో ఓ డజన్ మంది హీరోలు మెగా కాంపౌండ్ నుంచి చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. వీరి అందరికీ మెగాస్టార్ దైవ సమానులు.. ఆయనను ఎవరైనా ఏమైనా అంటే వాళ్ల ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఎదురుగా ఉన్నది ఏ స్థాయి వ్యక్తయినా సరే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేయాల్సిందే. ఇక అభిమానులైతే అన్నయ్యపై ఈగ వాలనివ్వరు. మెగాస్టార్ జోలికి వస్తే ఏ వేదికైనా సరే కౌంటర్ ఇచ్చే దాకా వదిలిపెట్టరు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. ఈ క్రమంలో ఓ సినిమాలో చిరంజీవిని తిట్టిన నటిని మెగా ఫ్యాన్స్ వెంటాడటంతో ఆమె వణికిపోయారట.
వరుస పరాజయాలతో చిరంజీవి ప్రభ మసకబారుతున్న దశలో.. ఆయన కెరీర్ అయిపోయిందని పుకార్లు చక్కర్లు కొడుతున్న దశలో హిట్లర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయి అందరి నోటికి తాళం వేశారు చిరు. మలయాళంలో బ్లాక్బస్టర్ అయిన సినిమాను మూవీని ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రీమేక్ చేశారు. 1997 జనవరి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్, చిరంజీవి నట విశ్వరూపం, పాటలు అన్ని కలిసి హిట్లర్ను బ్లాక్ బస్టర్గా నిలబెట్టాయి. ఈ సినిమాలోని నడక కలిసిన నవరాత్రి, కన్నీళ్లకు కన్నీళ్లొచ్చే పాటలు నేటికీ ఎవర్ గ్రీన్. ఒంగోలులో హిట్లర్ సినిమా 100 రోజుల వేడుక జరిగింది.
హిట్లర్లో చిరంజీవి చెల్లెళ్లుగా అశ్వినీ, మోహిని, పద్మశ్రీ, గాయత్రి, మీనాకుమారిలు నటించగా మెగాస్టార్తో రంభ ఆడిపాడారు. దర్శకరత్న దాసరి నారాయణరావు, రాజేంద్రప్రసాద్లు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా సందర్భంగా తనకు ఎదురైన పరిస్థితులను బుల్లితెర నటి మీనాకుమారి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. హిట్లర్లో తాను చిరంజీవిని ఓ సందర్భంలో రాక్షసుడా నిన్ను చూస్తే భయంగా ఉందని డైలాగ్ చెబుతానని.. ఇది చిరు అభిమానులను హర్ట్ చేసిందని మీనా చెప్పారు.
తాము ఓ రోజు కారులో ఒంగోలు వెళ్తుండగా ఓ 50 మంది చిరు అభిమానులు నా కారుని చుట్టుముట్టి గొడవ చేశారని , అందరం కారు దిగి జరిగినది వాళ్లకి నచ్చజెప్పడంతో వాళ్లు శాంతించారని మీనా కుమారి తెలిపారు. ఈ ఘటన ఇప్పటికీ తనను భయపెడుతూనే ఉంటుందని ఆమె గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











