త్రివిక్రమ్ను ప్రశ్నించగలరా? జానీ మాస్టర్ కేసు నేపథ్యంలో పూనమ్ కౌర్ ట్వీట్
తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు పంజాబీ ముద్దుగుమ్మ పూనం కౌర్. సినిమాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటోంది. ఈ నేపథ్యంలో కాంటెపరరీ ఇష్యూస్పై పోస్ట్లు పెడుతుంటుంది. ప్రస్తుతం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. జానీపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
తన వద్ద అసిస్టెంట్గా పనిచేస్తున్న యువతిపై స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆరోపణలు రావడం కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. అసలే హేమ కమిటీ రిపోర్ట్ చిత్ర సీమను షేక్ చేస్తున్న వేళ.. టాలీవుడ్లో లైంగిక వేధింపుల కేసు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో జనసేన పార్టీ అప్రమత్తమైంది. ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా జానీ మాస్టర్ ఇష్యూపై స్పందించింది. ఆయన నుంచి వివరణ కోరామని, బాధితురాలికి అండగా నిలిచినట్లు పెద్దలు తెలిపారు. సదరు యువతికి పెద్ద ప్రొడక్షన్ హౌస్లో మంచి అవకాశం దక్కిందని, ఓ స్టార్ హీరో వ్యక్తిగతంగా తన మేనేజర్ను పంపించి భరోసా అందించినట్లుగా యాంకర్ ఝాన్సీ తెలిపారు.
ఇక టాలీవుడ్లో ఏం జరిగినా తక్షణం స్పందించే హీరోయిన్ పూనం కౌర్.. జానీ మాస్టర్ ఇష్యూపైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. జానీని మాస్టర్ అని పిలవొద్దని, అలా పిలవాలంటే గౌరవం ఉండాలని చురకలంటించారు. ఇదే సమయంలో ఒకప్పుడు టాలీవుడ్లో మీ టూ ఉద్యమం ఉద్ధృతంగా జరిగినప్పుడు పలువురు పెద్దల పేర్లు తెరపైకి వచ్చిన ఇష్యూని ప్రస్తావించారు పూనం కౌర్. చాలా మంది సినీ ప్రముఖులపై ఆరోపణలు వచ్చాయని, ఇందుకోసం పలు కమిటీలు కూడా వేశారని.. కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని ఆమె గుర్తుచేశారు.

ప్రధానంగా స్టార్ డైరెక్టర్, రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్పై తాను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు చేసిన ఫిర్యాదును ఎందుకు పట్టించుకోలేదని పూనం కౌర్ ప్రస్తావించారు. తనలాంటి వాళ్లకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు.. అందుకే నా ఫిర్యాదును చెత్త బుట్టలో పడేశారని.. నాడు మా అసోసియేషన్లో ఉన్న పెద్దలకు త్రివిక్రమ్పై ఫిర్యాదు చేశానని వెల్లడించింది. ఇప్పుడైనా పరిశ్రమ పెద్దలు ఈ విషయంపై త్రివిక్రమ్ను ప్రశ్నించాలని పూనం కౌర్ డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











