‘సూపర్స్టార్ అయితే ఏంటీ? నన్ను ఒప్పించాలని అలాంటి ట్రాప్’
ఒకప్పుడు అమ్మ, వదిన, అత్త పాత్రలకు తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ప్రత్యేకంగా కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండేవారు. ఈ కోవలోకే వస్తారు నటి సుధ. నాలుగు దశాబ్ధాలుగా సినీరంగంలో కొనసాగుతున్న ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ఇప్పుడు హీరోయిన్లే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోవడంతో సుధ లాంటి వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. కానీ గతంలో వీరిదే హవా.
1984లో తమిళ చిత్రం ఓ మనే మనే మూవీతో వెండితెరపై అడుగుపెట్టారు సుధ. ఆమె అసలు పేరు హేమ సుధ. తమిళ అమ్మాయే అయినా తెలుగువారికి సుపరిచితురాలు. అద్భుతంగా తెలుగు మాట్లాడతారు. మేజర్ చంద్రకాంత్ చిత్రంలో నటరత్న ఎన్టీఆర్కి కూతురిగా నటించి మెప్పించారు. దక్షిణాదిలోని అందరు అగ్రనటులతో కలిసి నటించారు. ఈ జనరేషన్లో స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా నటించారు. హీరోయిన్ల సెకండ్ ఇన్నింగ్స్ కారణంగా హేమ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇబ్బందిగా మారింది. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, అవకాశాలు తగ్గడంపై సుధ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

హీరోయిన్లు రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల మీకు అవకాశాలు తగ్గాయా అని యాంకర్ అడగ్గా.. హేమ ఆన్సర్ ఇచ్చారు. హీరోయిన్లతో పాటు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వస్తున్న వారిని చూస్తుంటే నాకు జాలేస్తోంది. వాళ్లు నాకు కాంపిటీషన్ అని కూడా అనిపించడం లేదు. ఎందుకంటే నేను చేసే క్యారెక్టర్లు వేరే. నా ముందు జయసుధ గారు మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. ఆ తర్వాత నాతోనే ఆగిపోయింది. ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్లు లెక్క చూపించండి. నదియాగారు గతంలో హీరోయిన్గా చేశారు. అన్నీ అత్తారింటికి దారేది కాలేవు అని సుధ చెప్పారు.
నా ప్రవర్తనను చూసి చాలామంది పొగరు అనుకుంటారు. కానీ నా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్.. వీళ్లంతా వెళ్లి ఒక ప్రాపర్టీలా నిల్చొంటున్నారు. వాళ్ల కష్టాలు, ఇతర సమస్యల వల్ల అలా నిల్చొంటున్నారో లేకపోతే అది వాళ్ల వ్యక్తిగతం కావొచ్చు. అది వాళ్లకు ఇష్టమై చేస్తున్నారు.. నా వరకు అలాంటిది చేయలేను. డైరెక్టర్, ప్రొడ్యూసర్లు వచ్చి కోటి రూపాయలు ఇస్తాం.. ప్రాపర్టీగా నిల్చోమంటే, నీ కోటి వద్దు, నీ ప్రాపర్టీలా నేను రాను అంటాను. ఎంత పెద్ద స్టార్ నటిస్తున్నప్పటికీ నాకు నా క్యారెక్టర్ ఏంటీ అనేది ముందు అడుగుతానని సుధ అన్నారు.
శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు తల్లిగా నటించమని అడిగారు. కానీ నేను చేయలేదు. ఎందుకంటే ఆ రోల్లో ఏం లేదు. ఊరికే నేను వెళ్లి అక్కడ నిల్చోవడానికి ఎందుకు? అదే మహేశ్ బాబు గారితో వంశీలో తల్లిగా, మురారిలో చూస్తే ఇంపార్టెన్స్ ఉంది, అతడు చూస్తే ఇంపార్టెన్స్ ఉంది, దూకుడు చూస్తే ఒక ఇంపార్టెన్స్ ఉంది. అలాంటివి చేసిన నేను.. మహేశ్బాబు పక్కన నిల్చోవడానికి నేనెందుకు. నా బదులు వేరే చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే వాళ్లు బతుకుతారు కదా? నా కంటే ఒక ఇమేజ్, స్టేటస్ ఉంది. సినిమాలో రెండు సీన్లే చేసినా కూడా అందులో ఇంపార్టెన్స్ ఉండి, ఆ క్యారెక్టర్ నేనే చేయాలనుకుంటే 100 శాతం నేను చేస్తా. నాకు నా మీద నమ్మకం ఉంది. ఈ క్యారెక్టర్కి నేను న్యాయం చేయగలుగుతాను అనుకుంటే ఖచ్చితంగా చేస్తా. అలా కాకుండా డైలాగ్ లేదు, ఏం లేదు.. వాళ్ల పక్కన నిల్చోండి అంటే మాత్రం దండం పెట్టేస్తాను. దాని వల్ల నాకు పొగరు అనుకుంటారో? ఏమైనా నాకు అనవసరమని సుధ తేల్చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications


