విష్ణుప్రియ మెడకు బెట్టింగ్ ఉచ్చు.. ఫోన్ సీజ్.. వీడియోకు ఎన్ని లక్షలంటే?
తెలంగాణలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ స్కామ్ కేసులో విచారణను పంజాగుట్ట, మియాపూర్ పోలీసులు వేగవంతం చేశారు. గత కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేయగా.. విష్ణుప్రియ గురువారం ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. అయితే ఆమెను పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. విష్ణుప్రియ విచారణకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం యువతను పట్టిపీడిస్తుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. బెట్టింగ్ యాప్ కేసు విచారణను వేగవంతం చేసిన పంజాగుట్ట పోలీసులు.. విష్ణుప్రియ, టేస్టీ తేజతోపాటు మరో ఆరుగురికి నోటీసులు జారీ చేశారు. వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, సుప్రిత, రీతూ చౌదరీ, అజయ్, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు జారీ చేశారు. గురువారం వారిని విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే విష్ణుప్రియ గురువారం రోజున పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. బుధవారం టేస్టీ తేజ విచారణకు హాజరై తన వాదనను వినిపించినట్టు తెలిసింది.

సామాజిక కార్యకర్తల ఫిర్యాదుతో మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేశారు. సామాజిక కార్యకర్తలు చేసిన ఫిర్యాదు మేరకు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, ప్రణీత, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్, అనన్య నాగళ్లతోపాటు 18 మందిపై కేసులు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ గురించి రెండు రోజుల క్రితం ఇచ్చిన నోటీసులకు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. బుధవారం విష్ణుప్రియ గైర్హాజరు అయ్యారు. అయితే తన న్యాయవాది సహాయంతో ఆమె గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఆమె రాకతో పోలీసులు విచారణను మొదలుపెట్టారు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వెనుక ఎవరున్నారు? కీలక సూత్రధారి ఎవరు? మనీ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది? ఒక్క ప్రమోషన్స్కు ఎంత చెల్లిస్తారు? అనే ప్రశ్నలను గుప్పించినట్టు తెలిసింది.
అయితే విష్ణుప్రియ వెల్లడించినట్టు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. విష్ణుప్రియ మొత్తం 15 యాప్స్కు ప్రమోట్ చేసినట్టు గుర్తించారు. ఆమె ఫోన్ను పంజాగుట్ట పోలీసులు సీజ్ చేశారు. ఒక్కో వీడియోను ప్రమోషన్ చేసినందుకు సుమారుగా 1 లక్ష రూపాయలు ఇచ్చినట్టు ఆమె వెల్లడించినట్టు సమాచారం. విష్ణుప్రియ చెప్పిన విషయాలను రికార్డు చేసిన పోలీసులు తదుపరి విచారణపై దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది.
అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో పెద్ద ఎత్తున్న మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా డబ్బు ట్రాన్స్ఫర్ జరిగిన విషయంపై దృష్టిపెట్టారు. కోట్ల రూపాయలు హవాలా రూపంలో చేతులు మారాయనే విషయంపై అధికారులు విచారణ మొదలుపెట్టారు.


Click it and Unblock the Notifications











