Ahmedabad Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. పవన్, ఎన్టీఆర్, బాలయ్య దిగ్భ్రాంతి
గుజరాత్లోని అహ్మదాబాద్ సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం (AI-171)టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణీకులు సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు కాగా.. 53 మంది బ్రిటన్ జాతీయులు. ప్రయాణీకుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు.
టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిన విమానం
సర్దార్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లేందుకు జూన్ 12న మధ్యాహ్నం విమానం టేకాఫ్ అయ్యింది. ఆ కాసేపటికే పైలట్లు ఏటీసీకి ఎమర్జెన్సీ సందేశాన్ని పంపారు. ఏటీసీ సిబ్బంది దానికి స్పందించి సాయం చేసే లోగానే విమానం ఓ చెట్టును ఢీకొట్టి ఓ భవనంపై కుప్పకూలిపోయింది. ఆ సమయంలో విమానం దాదాపు 825 అడుగుల ఎత్తున ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీస్, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, విమానయాన శాఖ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి బయల్దేరారు. విమానం కుప్పకూలిన భవనంలో ఓ మెడికల్ కాలేజీకి చెందిన హాస్టల్ ఉండటంతో పలువురు విద్యార్ధులు కూడా ప్రాణాలు కోల్పో్యినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

హృదయ విదారకంగా పరిస్ధితి
ఈ ఘోర విమాన ప్రమాదంలో ఎంత మంది మరణించారు? ఎంతమంది గాయపడ్డారు అన్ని వివరాలు తెలియరాలేదు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలి నుంచి పదుల సంఖ్యలో అంబులెన్స్లు బయల్దేరుతున్న వీడియోలు, మృతదేహాలు, శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎయిరిండియా విమాన ప్రమాదం గురించి తెలుసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ బయల్దేరారు.
మృతులకు రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు ఇతర ప్రముఖులు సంతాపం తెలియజేశారు. అటు సినీ ప్రముఖులు కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్తో పాటు రితేష్ దేశ్ముఖ్, అనన్య పాండే, జాన్వీ కపూర్ తదితర ప్రముఖులు ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా విమాన ప్రమాదంపై స్పందించారు.
పవన్, బాలయ్య, ఎన్టీఆర్ దిగ్భ్రాంతి
విమానం ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇది మహా విషాదమని, బాధితులకు దేశం బాసటగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ ప్రమాదంలో భారతీయులతో పాటు విదేశీయులు మరణించడం బాధాకరమని నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన కేంద్రానికి అండగా ఉందామని పిలుపునిచ్చారు. అలాగే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్లు కూడా విమాన ప్రమాద మృతులకు సంతాపం తెలియజేశారు.


Click it and Unblock the Notifications











