2000 థియేటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకం.. అఖండ 2 వాయిదాపై స్టార్ ప్రొడ్యూసర్ ఆగ్రహం..
Akhanda 2: బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్-డివోషనల్ డ్రామా ''అఖండ 2: తాండవం'(Akhanda 2). బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన నాలుగో సినిమా ఇది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.కానీ, విడుదల చివరి నిమిషంలో వాయిదా పడడంతో అభిమానుల్లో భారీ నిరాశ నెలకొంది. అధికారికంగా ఇది టెక్నికల్ ఇష్యూ అని చెప్పినా.. ఫైనాన్షియల్ వివాదాలే అసలు కారణం అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సినిమా వాయిదాకు సంబంధించి నిర్మాణ సంస్థ '14 రీల్స్ ప్లస్' ప్రకటన మినహా టీమ్లో ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అఖండ 2: తాండవం' విడుదల వాయిదాపై సినీ పరిశ్రమ మొత్తం షాక్లో ఉంది. భారీ అంచనాలతో, వేడెక్కించిన ప్రమోషన్ల మధ్య విడుదలయ్యే క్షణానికి సినిమా ఆగిపోవడంతో అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కలకలం నేపథ్యలో ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఫిల్మీ బీట్ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా నట్టి కుమార్ మాట్లాడుతూ 'బాలయ్యగారి వంటి పెద్ద హీరో డేట్స్ ఇచ్చారు... బోయపాటి లాంటి హ్యాట్రిక్ డైరెక్టర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా... అఖండకు సీక్వెల్... ఇలాంటి సినిమాలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా రిలీజ్ అవుతాయని భావిస్తారు. సెన్సార్ పాజిటివ్ గా చెప్పింది, అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ అలాంటి సినిమానే ఆగిపోవడం అందరికీ షాక్" అన్నారు.

తాను కూడా థియేటర్లు నడుపుతున్నానని, డిస్ట్రిబ్యూటర్లతో పెద్ద ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు మొదలవ్వాల్సిన షోలు వాయిదా కాగా ఆందోళన పడ్డాం. 9:30 కి అయినా రిలీజ్ అవుతుందా అనుకున్నాం. చివరకు రాత్రి 12 గంటలకు పూర్తిగా ఆపేశారన్న సమాచారం వచ్చింది. ఇది ఆందోళనకరని వెల్లడించారు. బాలయ్య సినిమా కోసం అభిమానులు రెండు రోజులుగా వేచి చూస్తున్నారని, వారికి ఎలా సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 'ఫస్ట్ షో వస్తుందా? సెకండ్ షో వస్తుందా? అని అభిమానులు పదేపదే ఫోన్లు చేస్తున్నారు. వాళ్లకు ఏం సమాధానం చెబుతారు? వాళ్ల నమ్మకాన్ని ఎవరు కాపాడతారు?' అని ప్రశ్నించారు.
ఎరోస్ ఇంటర్నేషనల్తో ప్రొడ్యూసర్లకు ఉన్న 10 ఏళ్ల సమస్య ఇప్పుడే ముందుకు రావడమే అసలైన లోపమని నట్టి కుమార్ వ్యాఖ్యానించారు. 'పాత బాకీలు ఉన్నాయని తెలిసినప్పుడు ముందే సెటిల్ చేయాలి కదా? 100 కోట్ల పైగా టేబుల్ ప్రాఫిట్ వచ్చిన సినిమా. గత సినిమా కంటే డబుల్ రేటుకు అమ్ముడైంది. అలాంటి సినిమా రిలీజ్ అవ్వకపోవడం ఎంత నష్టం తెలుసా?' అని ప్రశ్నించారు. 'మీకు 22 కోట్ల నష్టం అనిపించవచ్చు. కానీ ఈ సినిమా మీద వేలాది మంది ఆధారపడి ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, థియేటర్ వర్కర్లు వారి కుటుంబాల భవిష్యత్తు ఉంది. ఇది చిన్న విషయం కాదు'అని నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 2000 థియేటర్లు సినిమాను స్క్రీన్ చేసేందుకు సిద్ధంగా ఉండగా, చివరి నిమిషంలో రిలీజ్ ఆగిపోవడం వల్ల వారి పరిస్థితి దారుణంగా మారిందని తెలిపారు. 'అంతటి పెద్ద సినిమా ఒకేసారి ఆగిపోవడం ఎప్పుడూ జరగలేదు. 2000 థియేటర్లు ఇప్పుడు ఖాళీగా పడ్డాయి. ప్రత్యామ్నాయ సినిమా కూడా వేయలేని పరిస్థితి. మా డబ్బు తిరిగి వస్తుందా? పోతుందా? అన్న భయంతో ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నిద్రపోలేని స్థితిలో ఉన్నారు' అన్నారు. చివరగా నట్టి కుమార్ 'ఇలాంటి భారీ సినిమా ముందస్తు ప్లానింగ్ లేకుండా వాయిదా వేయడం బాధ్యతారాహిత్యం. ఈ గందరగోళానికి బాధ్యులు ఎవరో స్పష్టంగా చెప్పాలి. అభిమానుల నమ్మకాన్ని ఇలా ఎందుకు దెబ్బతీస్తున్నారు?' అంటూ ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











