Akhanda 2: కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా? అఖండ 2 నిర్మాతలపై హైకోర్ట్ ఆగ్రహం
Akhanda 2: నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'అఖండ 2' (Akhanda 2). భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కావాల్సింది. కానీ, నిర్మాతల ఆర్థిక సమస్యల వల్ల వాయిదాపడింది. ఇలా అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి, డిసెంబర్ 12 ( నేడు)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. టికెట్ రేట్ల వివాదం తెలంగాణలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ విషయంలో అఖండ-2 నిర్మాతలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
బాలయ్య అఖండ మూవీకి ప్రీమియర్ షోల కోసం ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో భారీ అంచనాలు, హై హైప్ ఉన్న ఈ మూవీ కోసం అభిమానులు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ కూడా జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపు చట్టబద్ధం కాదంటూ ఒక న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

గురువారం మధ్యాహ్నం హైకోర్టు ప్రీమియర్ షోల కోసం పెంచిన ధరలతో టికెట్లు విక్రయించడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించినప్పటికీ, అదే రోజు సాయంత్రం వరకు హైదరాబాద్లో ఉన్న అనేక థియేటర్లు పెరిగిన రేట్లతోనే టికెట్లు విక్రయించడం కొనసాగించాయి. టికెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి, షోలు కూడా ప్రదర్శించబడ్డాయి. దీనిపై మరో న్యాయవాది కోర్టును ఆశ్రయిస్తూ 'హైకోర్టు ఆదేశాలు వచ్చినా కూడా బుక్ మై షో, చిత్రబృందం పట్టించుకోలేదు. ఇది కోర్టు ధిక్కరణకే ' అని ఫిర్యాదు చేశారు.
విచారణలో హైకోర్టు బుక్ మై షోను తీవ్రంగా నిలదీసింది.'కోర్టు ఆదేశాలు మీరు పట్టించుకోరా? ఎందుకు ఇంకా పెంచిన రేట్లతో టికెట్లు అమ్ముతున్నారు? మా ఆదేశాలను అమలు చేయకపోతే మీపై కాంటెంప్ట్ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు?' అని గట్టిగా ప్రశ్నించింది. బుక్ మై షో నుంచి 'మా సిస్టమ్కు కోర్టు స్టే సమాచారం ఆలస్యంగా చేరింది. అప్పటికి వేల టికెట్లు అమ్ముడయ్యాయి'అని సమాధానం వచ్చినా, కోర్టు సంతృప్తి చెందలేదు. ఈ విషయంపై మరలా మధ్యాహ్నం విచారణ కొనసాగనుంది.
ఇదే సమయంలో, 'అఖండ 2' నిర్మాణ సంస్థ 14 రీల్స్ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్లో లంచ్ మోషన్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలు చిత్రబృందంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వాదించగా, డివిజన్ బెంచ్ పరిశీలించి డిసెంబర్ 14 వరకు స్టే మంజూరు చేసింది. దీంతో నిర్మాతలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. కేసు తదుపరి విచారణ డిసెంబర్ 15కి వాయిదా పడింది.
టికెట్ రేట్ల పెంపులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.'కోర్టు ఆదేశాలను అమలు చేయడం మీ బాధ్యత కాదా? ఎలాంటి అధికారం మీద ఆధారపడి మెమోలు జారీ చేస్తారు? కోర్టు ఆదేశాల తర్వాత వాటిని ఎందుకు ఉపసంహరించుకుంటారు?' అని హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీపై ప్రశ్నల వర్షం కురిపించింది. మొత్తానికి అఖండ 2 విడుదలకు ముందే టికెట్ రేట్ల వివాదం యుద్ధ స్థాయికి చేరుకోగా, హైకోర్టు జోక్యం పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. తదుపరి విచారణలో ఏ నిర్ణయాలు వెలువడతాయో.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.


Click it and Unblock the Notifications











